Choodu Nanna Song: తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి.. ఇప్పుడిక ఏపీ వంతు. మరి కొన్ని రోజుల్లో ఏపీలో ఎన్నికల నగార మోగనుంది. దీంతో ఆయా పార్టీలు తమ ప్రచారానికి పదునుపెట్టాయి. దాంట్లో భాగంగానే అధికార వైసీపీ పార్టీ సినిమా రూపంలో.. అది కూడా సెంటిమెంట్‌తో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 2019 ఎన్నికలకు ముందు రిలీజ్‌ చేసిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బయోపిక్‌గా తెరకెక్కిన ‘యాత్ర’ ఓటర్లపై ప్రభావం చూపించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎన్నికలకు ఆ సినిమా సీక్వెల్‌ని ప్లాన్‌ చేసిన విషయం తెలిసిందే. దాంట్లో భాగంగానే ‘యాత్ర 2’ సినిమాతో వస్తోంది. ఇప్పటికే పోస్టర్లు, టీజర్లు రిలీజ్‌ చేసిన సినిమా బృందం ఇప్పుడిక సినిమాకి సంబంధించి ఒక వీడియో సాంగ్‌ రిలీజ్‌ చేసింది. ఫాదర్‌ సెంటిమెంట్‌తో ఈ సాంగ్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.  


పాట ఎలా ఉందంటే? 


దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణించిన తర్వాత జరిగిన పరిణామాల ఆధారంగా  ‘యాత్ర 2’ సినిమాను తెరకెక్కించారు. దాంట్లో భాగంగా ఈ పార్ట్‌లో జగన్‌ చేసిన ఓదార్పు యాత్ర, పాదయాత్రకు సంబంధించి సన్నివేశాలను చూపించారు. ఇక ఈ వీడియో సాంగ్‌ విషయానికి వస్తే.. ఫాదర్‌ సెంటిమెంట్‌ బాగా చూపించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణించిన తర్వాత ఆయన అభిమానులు ఆయన్ను ఎలా భావించారనే విషయాలు ఈ పాట ద్వారా చూపించారు మేకర్స్‌. రాజశేఖర్‌రెడ్డి లేక అందరూ ఒంటరి వాళ్లు అయిపోయారని, తాను ఒంటరి అయిపోయానని, తనకు ధైర్యం ఇవ్వాలని జగన్‌ నాన్నను అడుగుతున్నట్లుగా, జనాల్లో తన స్థానం ఎలా ఉందో తండ్రికి చెప్పుకుంటున్నట్లుగా ఉన్న లిరిక్స్‌.. కంటతడి పెట్టిస్తాయి. రాజకీయాలు, అభిమానులు అనే విషయం పక్కన పెడితే.. ఫాదర్‌ సెంటిమెంట్‌ ఉన్న వాళ్లంతా ఈ పాటకు కచ్చితంగా కనెక్ట్‌ అవుతారని అభిప్రాయపడుతున్నారు ఈ పాట విన్న వాళ్లంతా.


దేవుడు నమ్మకం.. వైఎస్‌ఆర్‌ నిజం


వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత ఆయన ఫొటోను చాలామంది తమ ఇళ్లలో ఉంచుకున్నారు. ఆయన్ను దేవుడుతో సమానంగా పూజించారు చాలామంది. ఆ విషయాలను హైలైట్‌ చేస్తూ కొన్ని సీన్లను ఈ పాటలో చూపించారు. తన కూతుర్ని కాపాడింది వైఎస్‌ఆర్‌ అని, దేవుడు అంటే నమ్మకం అని.. అదే వైఎస్‌ అంటే నిజం అని ఒక మహిళ కన్నీళ్లు పెట్టే సీన్‌.. ప్రతి ఒక్కరినీ కనెక్ట్‌ చేసేలా ఉంది.


 


ఈ సినిమాకి ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు సంతోష్‌ నారాయణ్‌ సంగీతం అందించారు. భాస్కరభట్ల రవికుమార్‌ లిరిక్స్‌ అందించగా, విజయ్‌ నారాయణ్‌ పాటను పాడారు. 2019 ఎన్నికలకు ముందు వచ్చిన ‘యాత్ర’ మంచి విజయం సాధించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బయోపిక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో టైటిల్ రోల్‌ను మమ్ముట్టి పోషించారు. ఇక ఇప్పుడు జగన్‌ పాత్రను తమిళ యాక్టర్‌ జీవా పోషించారు. 2024 ఫిబ్రవరి 8న ఈ సినిమా విడుదల కానుంది. 2019 ఫిబ్రవరిలో ‘యాత్ర’ విడుదల అయింది. ఇప్పుడు సరిగ్గా ఐదు సంవత్సరాల తర్వాత అదే నెలలో, ఎన్నికల ముంగిట ‘యాత్ర 2’ని రిలీజ్ చేస్తున్నారు.  


Read Also: బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న ‘గుంటూరు కారం‘, ఏంటీ షాకయ్యారా? ఇవిగో ప్రూఫ్స్