ప్రియాంక చోప్రా ఇంట పెళ్లి సందడి నెలకొంది. స్టార్ హీరోయిన్ తమ్ముడు సిద్ధార్థ్ చోప్రా, హీరోయిన్ నీలమ్ ఉపాధ్యాయ వివాహ బంధంతో ఒక్కటి అవుతున్నారు. ఈ పెళ్లితో నీలమ్ పేరు ముంబై సినిమా సర్కిళ్లలో పాపులర్ అవుతోంది. ఆవిడ ఎవరు? అని ఆరాలు తీయడం మొదలు పెట్టారు.
డేటింగ్ యాప్ 'బంబుల్'లో తన తమ్ముడు సిద్ధార్థ్ చోప్రా, నీలమ్ ఉపాధ్యాయ ఒకరికొకరు పరిచయం అయ్యారని ప్రియాంక చోప్రా తెలిపారు. ఈ పెళ్లి వల్ల ఉత్తరాది ప్రేక్షకులకు నీలమ్ గురించి తెలుస్తోంది. అంత కంటే ముందు ఆవిడ తెలుగులో పాపులర్ అని తెలుసా? తెలుగులో కథానాయికగా ఆవిడ సినిమాలు చేశారు.
ఎస్వీఆర్ మనవడితో నీలమ్ ఎంట్రీ
నీలమ్ ఉపాధ్యాయది ముంబై. బాలీవుడ్ రాజధానిలో జన్మించిన ఆ అమ్మాయి, ఎంఎంకే కాలేజీలో చదువుకున్నారు. యాక్టింగ్, మోడలింగ్ మీద ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించారు. తొలుత ఒక తమిళ సినిమాలో నటించే అవకాశం వచ్చినా ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. తర్వాత తెలుగులో కథానాయికగా ఆవిడ ఎంట్రీ ఇచ్చారు.
ఎస్వీ రంగారావు మనవడు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఒకట్రెండు సినిమాలు చేశాక కనుమరుగు అయ్యారు. ఎస్వీఆర్ మనవడు, జూనియర్ ఎస్వీ రంగారావు హీరోగా నటించిన 'మిస్టర్ 7'తో నీలమ్ ఉపాధ్యాయ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. కథానాయికగానూ ఆవిడకు అదే మొదటి సినిమా. తర్వాత మరికొన్ని సినిమాలు చేశారు.
'అల్లరి' నరేష్ 'యాక్షన్ త్రీడీ'లోనూ...
'మిస్టర్ 7' విజయం సాధించలేదు. అయినా నీలమ్ ఉపాధ్యాయకు అవకాశాలు వచ్చాయి. నిర్మాత అనిల్ సుంకర దర్శకత్వం వహించిన 'యాక్షన్ త్రీడీ'లో 'అల్లరి' నరేష్ జంటగా ఆవిడ నటించారు. ఆ సినిమాలో 'స్వాతిముత్యపు జల్లులు' సాంగ్ రీమిక్స్ చేశారు. ఆ పాటలో నీలమ్ ఉపాధ్యాయ గ్లామర్ హైలైట్ అయ్యింది. ఆ తర్వాత తమిళంలోనూ రెండు సినిమాలు చేశారు ఆవిడ.
సీఎం కొడుకుతోనూ నటించిన నీలమ్!
నీలమ్ ఉపాధ్యాయకు సీఎం కొడుకుతోనూ నటించిన ట్రాక్ రికార్డ్ ఉంది. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నారా రోహిత్ కొడుకు వరుస అవుతారని తెలుసు కదా! నారా రోహిత్ సరసన 'పండగలా వచ్చాడు' సినిమాలో నీలమ్ ఉపాధ్యాయ నటించారు. అయితే, ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. ఎప్పుడో 2018లో థియేటర్లలోకి రావాల్సిన సినిమా. అనివార్య కారణాల వల్ల ఆగింది. అదొక్కటే కాదు... మరొక తెలుగు సినిమా కూడా నీలమ్ ఉపాధ్యాయ పూర్తి చేసింది. అదీ విడుదల కాలేదు.
Also Read: హాయ్ నాన్న... కన్నడ సినిమాకు కాపీనా? కన్నడ నిర్మాత ఇన్స్టా స్టోరీ గొడవ ఏంటి?
హిందీలో హీరోయిన్ కాకుండా పాపులారిటీ!
తెలుగులో నాలుగు సినిమాల్లో నటించిన నీలమ్ ఉపాధ్యాయ హిందీలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ, ఆవిడ పాపులర్ అయ్యింది. అందుకు రీజన్ సిద్ధార్థ్ చోప్రాతో పెళ్లి. ప్రియాంకా చోప్రాకు మరదలు కావడం. అసలు 2018 తర్వాత నీలమ్ ఉపాధ్యాయ సినిమాలే చేయలేదు. గతేడాది (2024) ఆగస్టులో సిద్ధార్థ్ చోప్రాతో ఆమె నిశ్చితార్థం జరిగింది. అంతకు ముందు వాళ్లిద్దరూ కలిసి కనిపించినా... ఆ తర్వాత ఎక్కువగా కనిపించడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఫిబ్రవరి మొదటి వారంలో పెళ్లి చేసుకుంటున్నారు.