Vijaya Rangaraju Died with Heart Attack : యజ్ఞం మూవీ సినిమాతో తెలుగులో విలన్​గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి చెందారు. ఇటీవల హైదరాబాద్​లో జరిగిన ఓ సినిమా షూటింగ్​లో పాల్గొన్న ఆయన.. ఓ ప్రమాదంలో గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆయనను చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వారం నుంచి ట్రీట్​మెంట్ తీసుకుంటున్న రాజ్​కుమార్ మళ్లీ నార్మల్ అవుతారనుకునేలోపు.. గుండెపోటుతో మృతి చెందారు. 


సినీ ప్రయాణం.. 


విజయ రంగరాజు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. కెరీర్​ను స్పోర్ట్స్​లో ప్రారంభించారు. తర్వాత నటన మీద ఆసక్తితో మద్రాసులోని రంగస్థల కళాకారునిగా చేశారు. స్టేజ్ ఆర్టిస్ట్​గా ఉన్నప్పుడు వియత్నాం అనే మలయాళ సినిమాలో అవకాశం దక్కించుకున్నారు. మోహన్ లాల్ హీరోగా చేసిన ఈ సినిమాలో విజయ రంగరాజు విలన్​గా చేశారు. తర్వాత తెలుగులో 1994లో భైరవద్వీపంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. బాలయ్య హీరోగా చేసిన ఈ సినిమా తెలుగులో మంచి హిట్​ని అందుకుంది.


పేరు వెనక స్టోరి ఇదే


అసలు పేరు ఉదయ్ రాజ్​ కుమార్ అయినా సినిమాల్లోకి వచ్చిన తర్వాత పేరు మార్చుకోవాల్సి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. భైరవద్వీపం చేస్తున్న సమయంలో విజయ బ్యానర్​పై విలన్​గా పరిచయమవుతున్నందుకు "విజయ".. పాతాళ భైరవిలో ఎస్​.వి.రంగారావు తరహా పాత్రను చేస్తున్నందుకు "రంగ".. అసలుపేరులోని "రాజు"ను కలిపి.. "విజయ రంగరాజు"గా పేరు పెట్టినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 


భైరవ ద్వీపం భారీ హిట్​గా నిలిచినా.. విజయ రంగారాజుకు అవకాశాలు దక్కలేదు. తర్వాత మగరాయుడు అనే సినిమాలో నటించారు. తర్వాత కొన్ని సినిమాల్లో నటించి బ్రేక్ తీసుకున్నారు. గోపిచంద్ హీరోగా నటించిన యజ్ఞం సినిమాలో విలన్​గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత చేసిన ఢమరుకం, బ్యాండ్ బాజా సినిమాల్తో కూడా మంచి గుర్తింపు వచ్చింది. 


విలన్​గానూ, కామెడీ పాత్రల్లోనూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ రంగరాజు.. అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఓ షూటింగ్​లో జరిగిన ప్రమాదంలో గాయపడి.. చికిత్స తీసుకుంటున్న సమయంలో గుండెపోటుతో మృతి చెందారు. 


Also Read :  గొప్ప మనసు చాటుకున్న ఆకాష్‌ పూరి - నటి పావలా శ్యామలకు ఆర్థిక సాయం, స్వయంగా వెళ్లి చెక్కు అందించిన హీరో