Vennela Kishore: కమెడియన్స్‌గా పాపులారిటీని సంపాదించుకున్న తర్వాత హీరోలుగా మారిన నటులు ఎంతోమంది ఉన్నారు. కానీ అందులో సక్సెస్ సంపాదించుకున్న వారి సంఖ్య మాత్రం చాలా తక్కువ. ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ కమెడియన్‌గా వెలిగిపోతున్న వెన్నెల కిషోర్ కూడా త్వరలోనే ‘చారి 111’ అనే చిత్రంతో హీరోగా మారనున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. మార్చి 1న థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. తాజాగా హీరో, హీరోయిన్, దర్శకుడు కలిసి ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.


తెలుగులో స్పై యూనివర్స్..


‘చారి 111’ చిత్రాన్ని టీజీ కీర్తి కుమార్ డైరెక్ట్ చేశారు. ప్రస్తుతం సీక్వెల్స్ అనేవి ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి ‘చారి 111’కు సీక్వెల్ ఏమైనా ఉంటుందా అని దర్శకుడిని ప్రశ్నించగా.. స్పై యూనివర్స్ లాంటి ప్లాన్స్ ఉన్నాయని, ముందుగా ఈ మూవీ విడుదలయిన తర్వాత ఆలోచించాలని బయటపెట్టారు కీర్తి కుమార్. ‘‘దేవుడి దయ వల్ల మూవీ వర్కవుట్ అయితే అడవి శేష్‌తో మాట్లాడి గూఢచారి 2లో చారిని కలపాలి అని అనుకున్నాం. ఇంకా ఆయనను అప్రోచ్ అవ్వలేదు’’ అంటూ స్పై యూనివర్స్ ప్లాన్స్ గురించి చెప్పుకొచ్చాడు వెన్నెల కిషోర్. ఈ ఐడియా విన్న ప్రేక్షకులు బాగుందని, తెరపై వర్కవుట్ చేస్తే ఇంకా బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


వారి డేట్స్ దొరక్కపోతే..


అసలు ‘చారి 111’ ఎలా ఉంటుంది అని తన మాటల్లో చెప్పుకొచ్చాడు వెన్నెల కిషోర్. ‘‘మొత్తం అడవి శేష్ మూవీలాంటి సెటప్‌తోనే ‘చారి 111’ కూడా తెరకెక్కింది. మూవీలో ప్రతీది సీరియస్‌గానే ఉంటుంది. సీరియస్ సినిమాలో కమెడియన్ ఎంటర్ అయితే ఎలా ఉంటుందో చూడొచ్చు. ఉదాహరణకు అడవి శేష్, నిఖిల్ డేట్స్ దొరక్కపోతే వెన్నెల కిషోర్ మాత్రమే అందుబాటులో ఉంటే ఎలా ఉంటుందో.. అలా ఉంటుంది సినిమా సెటప్. ఇదంతా ఎలా వర్కవుట్ అవుతుందో తెరపై చూడాలి’’ అని తన స్టైల్‌లో సినిమా గురించి చెప్పాడు. ఇక ఇందులో ఫైట్ సీన్స్ ఉన్నా కూడా హీరోకంటే హీరోయిన్ సంయుక్త విశ్వనాథనే ఎక్కువగా ఫైట్స్ చేస్తుందని, దానికోసం ట్రైనింగ్ కూడా తీసుకుందని రివీల్ చేశారు. 


వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను..


నాలుగు రోజుల పాటు పూర్తిగా యాక్షన్ సీన్స్ షూటింగ్ జరిగిందన్నారు. ఈ మూవీని బర్కత్ స్టూడియోస్ బ్యానర్‌పై అదితి సోనీ నిర్మించారు. ఆమె మొదటిసారి నిర్మాతే అయినా చాలా బాగా పనిచేశారని వెన్నెల కిషోర్ చెప్పుకొచ్చాడు. తన కెరీర్‌లో ఎప్పుడైనా ప్రొడక్షన్‌లో అడుగుపెట్టాలని అనుకుంటే అదితి సాయమే తీసుకుంటానని అన్నాడు. మహేశ్ బాబు, శ్రీను వైట్ల, దేవ్ కట్టాతో తనకు ఒక ఎమోషనల్ బాండింగ్ ఉందని, ఏమీ లేని స్థాయిలో ఉన్నప్పుడు తనకు అవకాశాలు ఇచ్చారని గుర్తుచేసుకున్నాడు కిషోర్. ఇక బాలయ్య గురించి చెప్తూ పెద్ద స్టార్ అయినా కూడా రెండో టేక్ తీసుకోవాలంటే చాలా నిదానంగా చెప్తారని అన్నాడు. చిరంజీవి అయితే తన చుట్టుపక్కల ఉన్నవారిని కలుపుకుపోతారని తెలిపాడు.


Also Read: సౌత్ హీరోలు ఇంత ప్రాధాన్యత ఇవ్వరేమో - దక్షిణాది సినిమాలపై జ్యోతిక షాకింగ్ కామెంట్స్