ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) నటించిన లేటెస్ట్ మూవీ 'గాండీవదారి అర్జున' (Gandeevadhari Arjuna Movie). శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్. ఆగస్టు 25న సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. సినిమాకు సంబంధించి అనేక విషయాలను పంచుకున్నారు.



దర్శకుడు ప్రవీణ్ సత్తార్ గురించి వరుణ్ తేజ్ మాట్లాడుతూ... "అతని సినిమాలు స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను. 'చందమామ కథలు', 'గరుడవేగ' చూశా. 'గని' షూటింగ్ సమయంలో తను నాకు ఫోన్ చేశాడు. ఆ సమయంలో కథ గురించి నేనేమీ అడగలేదు. కానీ యాక్షన్ సినిమా చేద్దాం అన్నాడు" అని తెలిపారు.


"ప్రవీణ్ కథ చెప్పినప్పుడు తాను మాట్లాడాలనుకున్న ఇష్యూ ఏదైతే ఉందో అది చాలా పెద్దదని నాకు తెలుసు. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్ వల్ల ఆ ప్రాబ్లం ఎవరు పట్టించుకోం. అది వెంటనే మనపై ప్రభావం చూపేది కాదు. దాని ఎఫెక్ట్ కొన్నేళ్ల తర్వాత ఉంటుంది. ప్రవీణ్ కథ చెప్పినప్పుడు కూడా కథలో మెయిన్ పాయింట్ తో పాటు ఎమోషన్స్ కూడా నచ్చాయి. నాకు యాక్షన్ సినిమాలు చూడడం చాలా ఇష్టం. ప్రవీణ్ కి యాక్షన్ ఎలా కావాలనే దానిపై అవగాహన ఉంది. అందుకని తన సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ బాగుంటాయి. 'గాండీవదారి అర్జున' విషయానికి వచ్చేసరికి... ఇందులో ఎక్కువ రోప్ షాట్స్, సిజి వర్క్ ఉపయోగించకుండానే చేశాం. సినిమాలో డిఫరెంట్ యాక్షన్ సీక్వెన్స్ లు చేశాం. యాక్షన్ సీక్వెన్స్ లు చేసినప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్లు కూడా అయ్యాయి" అని చెప్పారు.


'గాండీవదారి అర్జున' సినిమా గురించి వరుణ్ తేజ్ మాట్లాడుతూ... "గాండీవదారి అర్జున' - ఇది కథకు సరిగ్గా యాప్ట్ అయ్యే టైటిల్. కాల్ ఫర్ హెల్ప్ లాంటి టైటిల్. సినిమాలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హీరోని పిలుస్తారు. తన పేరు అర్జున్. అందుకే ఆ టైటిల్ పెట్టాం. ఇది స్పై సినిమా కాదు. ఇందులో నేను బాడీగార్డ్ రోల్ చేశాను. సినిమాలో ఏదో సందేశం ఇచ్చి, ఇదంతా మారాలని చెప్పడం లేదు. ఇప్పుడున్న సమస్య ఏంటి? అనే దాన్ని మాత్రమే చూపిస్తున్నాం. దాని వల్ల ఎవరైనా మారితే మంచిదే. రీసెంట్ గా ఈ సినిమా చూశాను. నాకు నచ్చింది. ఎవరైనా క్లాస్ పీకినట్లు ఒకే విషయాన్ని చెప్తుంటే బోర్ కొట్టేస్తుంది. అది సినిమా అయినా అంతే. కాస్త ఎంటర్టైనింగ్ వేలో చెబితే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. 'గాండీవ దారి అర్జున' విషయానికొస్తే యాక్షన్ ఎంటర్టైనర్ గా చెప్పే ప్రయత్నం చేశాం" అని అన్నారు.


"ఈ సినిమా కథ నాలుగు రోజుల్లో జరుగుతుంది. ఇందులో ఆకట్టుకునే యాక్షన్ సీన్స్ తో పాటు మంచి ఎమోషన్స్ కూడా ఉంటాయి. అలాగే కథ డిమాండ్ మేరకు సినిమాని లండన్ లో షూట్ చేశాం. ఇక హీరోయిన్ సాక్షి వైద్య చాలా ఫోకస్డ్ పర్సన్. సినిమాలో మూడు పేజీల డైలాగ్ ను ఎక్కువ టేక్స్ లేకుండా ఆమె కంప్లీట్ చేయడం నాకు షాకింగ్ అనిపించింది. తను ఏదో సాధించాలనుకుంటుంది" అని వరుణ్ తేజ్ తెలిపారు. ఇక తన తదుపరి సినిమా గురించి ఆయన మాట్లాడుతూ... "ఇప్పుడు నేను చేస్తున్న 'మట్కా'లో నా పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. అందులో నా క్యారెక్టర్ లో నాలుగు షేడ్స్ ఉంటాయి. 'మట్కా' అనే ఆట ఎలా స్టార్ట్ అయిందనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది" అని చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్.


Also Read : పెళ్ళిళ్లలో డ్యాన్సులు చేసేదాన్ని, ‘బేబీ’ క్లైమాక్స్‌లో నిజంగా ఏడ్చేశా: వైష్ణవి చైతన్య







Join Us on Telegram: https://t.me/abpdesamofficial