Upcoming Telugu Movies In May Ending And June: ఈ ఏడాది (2024లో) సమ్మర్ సీజన్ వృథాగా పోయింది. ఈసారి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవ్వకపోవడంతో బాక్సాఫీస్ వెలవెలబోయింది. ఆ లోటును కాస్త భర్తీ చేయడానికి చిన్న మీడియం రేంజ్ మూవీస్ చాలా వచ్చాయి.  కానీ, వాటిలో ఒకటీ రెండు మినహా మిగతా సినిమాలేవీ ఆశించిన విజయాలను సాధించలేదు. కొన్ని చిత్రాలకు మంచి టాక్ వచ్చినా, ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనాలు థియేటర్ల వైపు చూడలేదు. ఈవెనింగ్, సెకండ్ షోలు ఉన్నాయిలే అనుకుంటే... వాటిపై ఐపీఎల్ క్రికెట్ గట్టి ప్రభావం చూపించింది. దీనికి తోడు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటంతో సినిమా హాళ్ల దగ్గర సందడి తగ్గిపోయింది. దీంతో కొన్ని రోజుల పాటు నైజాంలో సింగిల్ స్క్రీన్లు బంద్ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పటికే ఎలక్షన్స్ పూర్తవ్వడం, ఐపీఎల్ సీజన్ కూడా ముగియడంతో మళ్ళీ ఎప్పటిలాగే కొత్త సినిమాలు థియేటర్లకు క్యూలు కడుతున్నాయి.


సినీ అభిమానులను అలరించడానికి ఈ నెలాఖరున మూడు మీడియం రేంజ్ క్రేజీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' శుక్రవారం రిలీజ్ అవుతుంది. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడిన ఈ మూవీ... ఫైనల్ గా మే 31వ తేదీని ఫిక్స్ చేసుకుంది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఇందులో నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి స్పందన లభించింది.


విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం 'గం. గం.. గణేశా'. ఇప్ప‌టికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఈ నెల 31న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఉదయ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ ఫ‌న్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ను, హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కేదార్ సెలగం శెట్టి & వంశీ కారుమంచి నిర్మించారు. ఇందులో ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించారు. 'బేబీ' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆనంద్ నుంచి రాబోతున్న ఈ మూవీ టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి.


‘బెదురులంక 2012’ తో మంచి విజ‌యాన్ని అందుకున్న యువ హీరో కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ ‘భజే వాయు వేగం’. ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కూడా ఈ శుక్రవారమే థియేటర్లలోకి రాబోతోంది. ఇందులో ఐశ్వర్య మీనన్ క‌థానాయిక‌గా నటించగా.. 'హ్యాపీ డేస్' ఫేమ్ రాహుల్ హ‌రిదాస్ కీల‌క పాత్ర‌ పోషించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మీద ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మధ్యనే రిలీజైన ఈ మూవీ టీజ‌ర్, ట్రైల‌ర్ల‌కు ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.


మే మంత్ ఎండ్ పక్కన పెడితే... వచ్చే నెల (జూన్) మొదటి వారంలో మరో మూడు క్రేజీ సినిమాలు విడుదల కాబోతున్నాయి. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ ప్లే చేసిన 'సత్యభామ' జూన్ 7వ తేదీన థియేటర్లలోకి రానుంది. సుమన్ చిక్కాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లో నవీన్ చంద్ర కీలక పాత్ర పోషించారు. 'మేజర్' దర్శకుడు శశి కిరణ్ తిక్క సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఆల్రెడీ రిలీజ్ చేసిన ఈ మూవీ ప్రమోషనల్ మీటీరియల్ అందరిలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. 


వర్సటైల్ హీరో శర్వానంద్‌ నటించిన తాజా చిత్రం 'మనమే'. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఆ మధ్య వచ్చిన టైటిల్‌ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌ ఆకట్టుకుంది. ఈ సినిమాను జూన్ 7వ తేదీన ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. నవదీప్ హీరోగా నటించిన 'లవ్ మౌళి' మూవీని కూడా అదే రోజున రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తుకున్నారు. 


తమిళ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాయన్' సినిమాని తెలుగులో జూన్ 13న విడుదల చేయనున్నారు. ఇందులో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, కాళిదాసు జయరామ్, వరలక్ష్మి శరత్ కుమార్, దుషార విజయన్, అపర్ణ బాలమురళి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సుధీర్ బాబు హీరోగా నటించిన 'హరోం హర' సినిమా జూన్ 14న రిలీజ్ కానుంది. జ్ఞాన శేఖర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది. 'మ్యూజిక్ షాప్ మూర్తి', 'ఇంద్రాణి' లాంటి చిన్న సినిమాలను కూడా ఇదే వీక్ లో తీసుకొస్తున్నారు.


2024 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీస్ లో 'కల్కి 2898 AD' ఒకటి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా, ఎట్టకేలకు జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫాంటసీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటానీ లాంటి పాపులర్ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. 


Also Read: మలయాళ చిత్రాల్లో మహిళల ప్రాధాన్యత తగ్గుతోందా?