జానపద చిత్రాలు అంటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు బి. విఠలాచార్య (B Vittalacharya). ఆయన దర్శకత్వం, నిర్మాణంలో వచ్చిన చిత్రాలు చూడని ప్రేక్షకులు ఉండరని చెప్పవచ్చు. తరాలు మారినా తరగని ఆదరణ కల చిత్రాలను ఆయన తీశారు. అందుకే ఆయనను 'జానపద బ్రహ్మ' అని తెలుగు చిత్ర పరిశ్రమ ముద్దుగా పిలుచుకుంటుంది. విఠలాచార్య స్టైల్‌ ఆఫ్‌ ఫిల్మ్ మేకింగ్‌, సినీ ప్రయాణాన్ని ఈతరం ప్రేక్షకులకు సమగ్రంగా పరిచయం చేయాలని ప్రముఖ పాత్రికేయులు, పీఆర్వో, రచయిత పులగం చిన్నారాయణ (Writer Pulagam Chinnarayana) సంకల్పించారు. 'జై విఠలాచార్య' పుస్తకాన్ని తీసుకు వచ్చారు. 'మూవీ వాల్యూమ్ మీడియా' ఆధ్వర్యంలో షేక్ జీలాన్ బాషా ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేశారు. 


'జై విఠలాచార్య' ఆవిష్కరించిన త్రివిక్రమ్‌
ప్రముఖ దర్శకులు, మాటల మాంత్రికులు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) చేతుల మీదుగా 'జై  విఠలాచార్య' (Jai Vittalacharya Book) పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. త్రివిక్రమ్ నుంచి తొలి ప్రతిని సీనియర్ సివిల్ సర్వెంట్, రైల్వే ఉన్నతాధికారి రవి పాడి అందుకున్నారు. ఇటువంటి పుస్తకాలు తీసుకు రావడం లాభసాటి వ్యాపారం కాదని పేర్కొన్న త్రివిక్రమ్... సినిమాపై ప్రేమ, ఇష్టంతో తీసుకు వచ్చిన రచయిత పులగం చిన్నారాయణ, పబ్లిషర్ & మూవీ వాల్యూమ్ మీడియా అధినేత షేక్ జీలాన్ బాషాలను అభినందించారు. పుస్తకాలను అభిమానించే వ్యక్తిగా ఇటువంటి ప్రయత్నాలు బావుండాలని, ప్రజల్లో పుస్తక పఠనం బాగా పెరగాలని కోరుకుంటున్నట్లు త్రివిక్రమ్ తెలిపారు. 


విఠలాచార్య ఫాదర్ ఆఫ్ మాస్ సినిమా
త్రివిక్రమ్ మాట్లాడుతూ... ''నాకు పులగం చిన్నారాయణ బాగా పరిచయం. గతంలో ఆయన రాసిన పుస్తకాలు చదివా. విఠలాచార్య అంటే ఫాదర్ ఆఫ్ తెలుగు మాస్ సినిమాగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనమంతా చూస్తున్న వీఎఫ్ఎక్స్ ఫిల్మ్స్ వంటి వాటికంటే ముందు... తెలుగు సినిమా మొదలైన రోజుల్లో అడ్వెంచరస్ ఫిలిమ్స్ తీసిన టెక్నీషియన్ ఆయన. విఠలాచార్య సక్సెస్ రేషియో, రీచ్, పాపులారిటీ ఈ తరం ప్రేక్షకులు చాలా మందికి తెలియదు... యూట్యూబ్ లేదా టీవీల్లో ఆయన సినిమాలు వచ్చినప్పుడు చూడటం తప్ప! ఆయన జీవితం, ప్రస్థానాన్ని జనం ముందుకు తీసుకుని వచ్చిన చిన్నారాయణ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. చరిత్రను అక్షరబద్ధం చేయడం తెలుగులో తక్కువ. తెలుగు సినిమా చరిత్ర ఇంకా చాలా తక్కువగా అందుబాటులో ఉంది. పులగం చిన్నారాయణకు ఆ శక్తి, ఆసక్తి... రెండూ ఉన్నాయి కాబట్టి ఇటువంటి పుస్తకాలు మరిన్ని రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అని అన్నారు.   


Also Read టీడీపీ, జనసేనకు 'జై' కొడుతున్న టాలీవుడ్?


రచయిత పులగం చిన్నారాయణ మాట్లాడుతూ ''విఠలాచార్య గారు సినిమాలు తీసినంత వేగంగా ఈ పుస్తకం రాశాను. సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ, జమున, వాణిశ్రీ, రాజశ్రీ, జయమాలిని, నరసింహ రాజు... ఇలా ఎందరో అతిరథ మహారథులను ఈ పుస్తకం కోసం ఇంటర్వ్యూలు చేశా. విఠలాచార్య గారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన విషయాలు తెలుసుకున్నా. తెలుగులో విఠలాచార్య గారు దర్శకత్వం వహించిన 39 సినిమాల తెరవెనుక విశేషాలు, ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, ఇప్పటి వరకు ఎక్కడ లేని సమాచారంతో ఈ పుస్తకం రెడీ చేశా. సినిమాలు, సాహిత్యంపై విపరీతమైన అనురక్తి ఉన్న త్రివిక్రమ్ గారి చేతుల మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది'' అని అన్నారు.


Also Read బాలకృష్ణ, రవితేజకు గట్టి పోటీ, దసరా బరిలో సిక్సర్ - 'జైలర్', 'జవాన్' సక్సెస్ రిపీట్ చేసేదెవరు?  


''జర్నలిజంలో ఉన్న నేను ఈ పుస్తకంతో పబ్లిషర్‌గా తొలి అడుగు  వేయడం గర్వంగా ఉంది. సూపర్ స్టార్ కృష్ణ గారు కవర్ పేజీ ఆవిష్కరించగా... ఇప్పుడు త్రివిక్రమ్ పుస్తకావిష్కరణ చేయడం మధుర అనుభూతి'' అని షేక్ జీలాన్ బాషా తెలిపారు. ''జై విఠలాచార్య' కవర్ పేజీసీనియర్ పబ్లిసిటీ డిజైనర్, రఘుపతి వెంకయ్య పురస్కార గ్రహీత ఈశ్వర్ గారి ఆఖరి పెయింటింగ్‌తో రూపొందింది'' అని రవి పాడి తెలిపారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial