Trisha to be paired opposite Salman Khan : కోలీవుడ్ స్టార్ హీరోయిన్ చెన్నై బ్యూటీ త్రిష తన సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు అందుకుంది. దళపతి విజయ్ సరసన త్రిష నటించిన 'లియో' ఈ ఏడాది కోలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. లియో సక్సెస్ తో త్రిష క్రేజ్ మరింత పెరిగిపోయింది. దీంతో ఈ ముద్దుగుమ్మకి ఇతర ఇండస్ట్రీల్లో అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే త్రిషకి ఎవరూ ఊహించని విధంగా ఓ బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. సుమారు 13 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత త్రిష మళ్లీ బాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. తాజా సమాచారం ప్రకారం త్రిష ఓ హిందీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.


అది కూడా సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరో సినిమాలో త్రిషకి నటించే ఛాన్స్ రావడం విశేషం. రీసెంట్ గా 'టైగర్ 3' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సల్మాన్ ఖాన్ తన తదుపరి చిత్రాన్ని పంజా మూవీ ఫేమ్ విష్ణువర్ధన్ దర్శకత్వంలో చేస్తున్నారు. 'ది బుల్' అనే పేరుతో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాలో త్రిష సల్మాన్ తో రొమాన్స్ చేయబోతుందట. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలిసింది. 1988లో జరిగిన ఓ మిలిటరీ ఆపరేషన్ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. 1988లో 'ఆపరేషన్ కాక్టస్' పేరుతో ఓ మిలిటరీ జరిగింది మాల్దీవ్స్ అధ్యక్షుడిని రక్షించేందుకు ఇండియన్ మిలటరీ ఈ ఆపరేషన్ ని ప్లాన్ చేశారు.


దీని ఆధారంగానే 'ది బుల్' సినిమాని విష్ణువర్ధన్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ మిలిటరీ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. సల్మాన్ ఖాన్ కి జోడిగా త్రిషని హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. నిజం చెప్పాలంటే త్రిష సల్మాన్ ఖాన్ చాలా పెద్ద ఫ్యాన్. ఈ విషయాన్ని ఆమె గతంలో చాలా సందర్భాల్లో వెల్లడిస్తూ సల్మాన్ తో కలిసి నటించాలనే కోరికను బయటపెట్టింది. ఎట్టకేలకు ఆ కోరిక ఇప్పుడు తీరబోతోంది. సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా చలామణి అయిన త్రిష బాలీవుడ్ లో ఇప్పటివరకు ఒకే ఒక్క సినిమా చేసింది. అది కూడా 2010 లో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన 'కట్టమీటా' అనే సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.


ఆ తర్వాత హిందీలో ఆఫర్స్ వచ్చినా సౌత్ లో బిజీ అవ్వడంతో వాటిని రిజెక్ట్ చేసింది. మళ్లీ 13 ఏళ్ల విరామం తర్వాత తన అభిమాన హీరో సల్మాన్ ఖాన్ సరసన నటించబోతోంది. కాగా ఈ సినిమాని బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మించబోతున్నారు. సుమారు 25 ఏళ్ల తర్వాత సల్మాన్, కరణ్ జోహార్ కలిసి సినిమా చేస్తుండడంతో అప్పుడే ఈ ప్రాజెక్టుపై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి మొదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. 2025 ద్వితీయార్థంలో ఈ సినిమాని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


Also Read : బాక్సాఫీస్ దగ్గర 'సలార్' ర్యాంపేజ్ - ఏడు రోజుల్లోనే అదిరిపోయే కలెక్షన్స్, ఎంత వచ్చిందో తెలుసా?