ఎవరికైనా 'సినిమా' అంటే వెంటనే గుర్తొచ్చేది 'హీరో' పాత్ర. ఎందుకంటే అతను వెండితెర మీద ఫైట్స్ చేస్తాడు.. నవ్విస్తాడు.. రొమాన్స్ చేస్తాడు.. ఇలా ఎన్నో విధాలుగా మనల్ని అలరిస్తాడు. దీంతో హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. ఆట బొమ్మల్లా మిగిలిపోతారు. ఒకప్పుడు హీరోలతో సమానంగా హీరోయిన్ల పాత్రలు ఉండేవి. కానీ, ఇప్పుడు సినిమాలన్నీ హీరో చుట్టూనే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్లు ఉమెన్ సెంట్రిక్ చిత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. తమ సత్తా చాటడానికి అదే సరైన మార్గంగా భావిస్తున్నారు. ప్రేక్షకులు కూడా వారి సినిమాలను ఆధరిస్తున్నారు.  హీరోలతో పోటీగా బాక్సాఫీస్ కలెక్షన్స్ కొల్లగొట్టిన కథానాయికలకు కూడా కొదవలేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమెన్ సెంట్రిక్ చిత్రాల్లో నటించిన నేటి తరం హీరోయిన్ల గురించి ఒకసారి చూద్దాం. 


అనుష్క శెట్టి


అగ్ర కథానాయిక అనుష్క శెట్టి 'అరుంధతి' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని హీరోలతో సమానంగా మార్కెట్ క్రియేట్ చేసుకుంది. ఆ తర్వాత పంచాక్షరి, సైజ్ జీరో, రుద్రమదేవి, భాగమతి వంటి మహిళా ప్రాధాన్య చిత్రాల్లో స్వీటీ నటించింది. చివరగా 'నిశబ్దం' మూవీతో నేరుగా ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరించింది. లేడీ సూపర్ స్టార్ నయనతార అనేక ఉమెన్ సెంట్రిక్ చిత్రాల్లో నటించింది. అందులో మయూరి, ఐరా, అనామిక, డోరా, కోకో కోకిల, కర్తవ్యం, కనెక్ట్, ఓ2, నెట్రికాన్ వంటి సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. 


సమంత


మరో స్టార్ సమంత రూత్ ప్రభు సైతమ ఉమెన్ ఓరియెంటెడ్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. 'ఓ బేబీ' 'యూ టర్న్' సినిమాలతో మెప్పించిన సామ్.. చివరగా 'యశోద' వంటి పాన్ ఇండియా మూవీతో సక్సస్ అందుకుంది. త్వరలోనే 'శాకుంతలం' వంటి మైథలాజికల్ చిత్రంతో రాబోతోంది. అలనాటి నటి సావిత్రి బయోపిక్ గా వచ్చిన 'మహానటి' సినిమాలో అద్భుతమైన నటన కనబరిచిన కీర్తి సురేష్.. 'గుడ్ లక్ సఖీ' 'పెంగ్విన్' 'మిస్ ఇండియా' 'సాని కాయుధం' వంటి చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించింది. 


సాయి పల్లవి


నేచురల్ బ్యూటీ సాయి పల్లవి 'గార్గి' అనే సినిమాతో మహిళలు ఎదుర్కో లైంగిక వేధింపుల గురించి తెలియజెప్పే ప్రయత్నం చేసింది. 'అభినేత్రి' సినిమాలో నటించిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.. గతేడాది చివర్లో 'బబ్లీ బౌన్సర్' తో అలరించింది. 'నవంబర్ స్టోరీస్', '11థ్ అవర్' అనే రెండు వెబ్ సిరీసులు కూడా చేసింది. ఆమె నటించిన 'దట్ ఈజ్ మహాలక్ష్మి' మూవీ విడుదలకు నోచుకోలేదు. మంచు లక్ష్మి 'దొంగాట' సినిమాతో పాటుగా, 'లక్ష్మీ బాంబ్' అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది. 


కాజల్ అగర్వాల్


కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, రెజీనా కాసాండ్రా, ఈషా రెబ్బా కలిసి 'అ!' అనే వైవిద్యమైన సినిమా చేసిన సంగతి తెలిసిందే. దీని తర్వాత నిత్యా 'వండర్ విమెన్' సినిమా చేస్తే.. నివేదా థామస్ తో కలిసి రెజీనా 'శాకినీ డాకిని' సినిమా చేసింది. ఐశ్వర్య రాజేశ్ ఇప్పటి వరకు డ్రైవర్ జమున, కౌసల్య సుబ్రహ్మణ్యం వంటి రెండు ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించింది. ఐశ్వర్య లక్ష్మీ ఓటీటీలో 'అమ్ము' అనే చిత్రంతో పలకరించింది. త్వరలో 'అర్చన 31 నాట్ అవుట్' అనే సినిమాతో రాబోతోంది. అమల పాల్ 'ఆమె' సినిమా చేసి అందరినీ షాక్ ఇచ్చింది. 


అంజలి


'గీతాంజలి' సినిమా చేసిన తెలుగమ్మాయి అంజలి.. ప్రస్తుతం 'ఝాన్సీ' వంటి మహిళా ప్రాధాన్యమున్న వెబ్ సిరీసులు చేస్తోంది. యాంకర్ సుమ 'జయమ్మ పంచాయితీ' అంటూ వస్తే.. యాంకర్ అనసూయ 'థాంక్యూ బ్రదర్' 'కథనం' వంటి సినిమాలలో లీడ్ రోల్స్ చేసింది. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెల సైతం తెలుగులో 'బ్లాక్ రోజ్; సినిమాలో నటించింది. సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను కెరీర్ లో అనేక ఉమెన్ సెంట్రిక్ మూవీస్ ఉన్నాయి. తప్పడ్, శభాష్ మితు, పింక్, నామ్ షబానా, ఆనందో బ్రహ్మ, ముల్క్, గేమ్ ఓవర్, సాండ్ కీ ఆంక్, రష్మీ రాకెట్, దోబారా, బ్లర్ వంటి సినిమాలు తాప్సీకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. 


కంగన రనౌత్


బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ వరుసగా విమెన్ సెంట్రిక్ సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. మణికర్ణిక, క్వీన్, తను వెడ్స్ మను, రజ్జో, తలైవి, పంగా, ధాకడ్ వంటి సినిమాల్లో కంగనా ఆకట్టుకుంది. ప్రస్తుతం తేజస్, ఎమర్జెన్సీ, సీత, టింకు వెడ్స్ షేరు వంటి చిత్రాల్లో నటిస్తోంది. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ 'గుంజన్ సక్సేనా' 'మిలీ' 'గుడ్ లక్ జెర్రీ' వంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేసింది. 


అలియా భట్


అలియా భట్ గతేడాది 'గంగూబాయి కథియావడి' సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. అంతకముందు రాజీ, హైవే సినిమాలతో అలరించింది. సోనాక్షి సిన్హా ఇప్పటి వరకూ అకీరా, నూర్, హ్యపీ ఫిర్ భాగ్ జాయేగి, డబుల్ ఎక్స్ ఎల్ వంటి ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ లో నటించింది. ప్రియాంక చోప్రా 'మేరీ కోమ్', 'మర్జావా','ఫ్యాషన్' వంటి సినిమాలు చేస్తే.. పరణితి చోప్రా 'సైనా' 'కోడ్ నేమ్ తిరంగా' 'ది గర్ల్ ఆన్ ది ట్రైన్' వంటి చిత్రాల్లో ప్రధాన పాత్ర పోషించింది. కరీనా కపూర్ 'హీరోయిన్', సోనమ్ కపూర్ 'మీర్జా', కృతి సనన్ 'మీమీ' వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. 


Also Read : వెంకటేష్ మహా రాజేసిన రగడ - 'కెజియఫ్' ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన మిగతా ముగ్గురు