Director VI Anand  to narrate a script to Chiranjeevi : 'భోళాశంకర్' వంటి భారీ డిజాస్టర్ తర్వాత కథల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి.ఈ క్రమంలోనే కంటెంట్ ఉన్న కథలకే మొగ్గుచూపుతున్నారు. అలాగే ఎక్కువగా యువ దర్శకులతో పని చేసేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే వశిష్ట అనే యంగ్ డైరెక్టర్ తో 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. సోషియో ఫాంటసీ జోనర్ లో ఈ సినిమా ఉండబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ తోనే మెగాస్టార్ బిజీగా ఉన్నారు. మరోవైపు మెగాస్టార్ తో సినిమా చేయాలని అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, మారుతీ వంటి దర్శకులు ఇప్పటికే కథలు రెడీ చేస్తున్నారు. ఇక ఈ లిస్టులో మరో యంగ్ డైరెక్టర్ కూడా చేరారు.


మెగాస్టార్ కోసం కథ రెడీ చేసిన మరో యంగ్ డైరెక్టర్


టాలీవుడ్ లో 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'టైగర్', 'ఒక్క క్షణం' వంటి డిఫరెంట్ మూవీస్ తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విఐ ఆనంద్. తాజాగా ఈ డైరెక్టర్ తెరకెక్కించిన 'ఊరు పేరు భైరవకోన' మూవీ విడుదలకు రెడీగా ఉంది. ఈ లోపే అతనికి మెగాస్టార్ కి కథ చెప్పే ఆఫర్ వచ్చిందట. ఇదే విషయాన్ని స్వయంగా డైరెక్టర్ వి.ఐ.ఆనంద్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో చిరంజీవి ఓ సినిమా చేయబోతున్నారట.


దానికోసం నిర్మాత అనిల్ సుంకర కొత్త కథల్ని అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వి.ఐ.ఆనంద్ చెప్పిన కథ అనిల్ సుంకరకి బాగా నచ్చింది. చిరంజీవికైతే ఈ కథ బాగా సూట్ అవుతుందని ఆయన ఫిక్స్ అయ్యారట. త్వరలోనే మెగాస్టార్ తో కథా చర్చలు జరగనున్నాయి. చిరుకి కథ నచ్చితే ప్రాజెక్ట్ సెక్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. మెగాస్టార్ కనుక వి.ఐ.ఆనంద్ కథకు ఓకే చెబితే ఈ డైరెక్టర్ పంట పండినట్లే అని చెప్పొచ్చు.


ఫిబ్రవరి 16 న రిలీజ్ కాబోతోన్న 'ఊరుపేరు భైరవకోన'


యాక్షన్ అడ్వెంచరస్ డ్రామాగా తెరకెక్కిన 'ఊరు పేరు భైరవకోన'లో సందీప్ కిషన్‌కు జోడీగా వర్ష బొల్లామా, కావ్య థాపర్ నటించారు. ముందుగా ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవ్వాలని నిర్ణయించుకుంది. కానీ అప్పటికే చాలా సినిమాలో రేసులో ఉండడంతో తప్పుకుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 9న విడుదల అవుతున్నట్టు ప్రకటించింది. అప్పటికే మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఈగల్’ మూవీకి సోలో రిలీజ్ అందిస్తామని నిర్మాతలంతా ప్రకటించడంతో.. వారి నిర్ణయాన్ని గౌరవించి మరోసారి రిలీజ్ డేట్ మార్చుకుంది ‘ఊరు పేరు భైరవకోన’. ఫైనల్‌గా ఫిబ్రవరీ 16న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది.


'విశ్వంభర' షూటింగ్‌కు బ్రేక్


వాలెంటైన్స్ డే సందర్భంగా చిరంజీవి తన భార్యతో కలిసి ఓ చిన్న ట్రిప్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే 'విశ్వంభర' షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి భార్య సురేఖతో కలిసి చిన్న హాలిడే కోసం అమెరికా వెళుతున్నానని, తిరిగి వచ్చిన వెంటనే 'విశ్వంభర' షూటింగ్‌లో పాల్గొంటానని.. తన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు చిరంజీవి.


Also Read : 'సరిపోదా శనివారం' కోసం నాని రెమ్యునరేషన్ అన్ని కోట్లా?