Nani Remunaration For Saripodhaa Sanivaaram : నాచురల్ స్టార్ నాని బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. గత ఏడాది నాని నటించిన 'దసరా', 'హాయ్ నాన్న' వంటి సినిమాలు వరుస విజయాలు అందుకోవడంతో నాచురల్ స్టార్ మార్కెట్ భారీగా పెరిగిపోయింది. దాంతో నాని సినిమాలకు నెక్స్ట్ లెవెల్ బిజినెస్ జరుగుతుంది. ఈ క్రమంలోనే నాని తన కొత్త సినిమా కోసం భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తాజా సమాచారం వినిపిస్తోంది. 


'సరిపోదా శనివారం'కోసం నాని భారీ రెమ్యునరేషన్


గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న నాని కొత్త సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్ పెంచినట్లు తెలుస్తోంది. లేటెస్ట్ ఫిలిం సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 'సరిపోదా శనివారం' సినిమా కోసం నాని ఏకంగా రూ.25 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు నాని మరే సినిమాకి ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్న దాఖలాలు లేవు. కానీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న 'సరిపోదా శనివారం' సినిమా కోసం తన కెరీర్ లోనే అత్యధికంగా రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. నాని సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తూ ఉండడంతో నిర్మాతలు కూడా అతను అడిగినంత ఇచ్చేందుకు ఏమాత్రం వెనకాడటం లేదట.


భారీ ధరకు 'సరిపోదా శనివారం' ఓటీటీ రైట్స్


సరిపోదా శనివారం' సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడు అయినట్లు తెలుస్తోంది. ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అన్ని భాషలకు సంబంధించిన రైట్స్ కోసం ఏకంగా రూ. 45 కోట్లు వెచ్చించినట్లు టాక్ వినిపిస్తోంది. నాని కెరీర్ లోనే అత్యధిక ధర పలికిన ఓటీటీ డీల్ ఇదే కావడం విశేషం.


దిల్ రాజు చేతికి థియేట్రికల్ రైట్స్


'సరిపోదా శనివారం' తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ని అగ్ర నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నారు. ఈ విషయాన్ని దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర్ క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. దిల్ రాజు ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాడు అని తెలియడంతో నాని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతో నానికి మంచి సక్సెస్ అందడంతో పాటు దిల్ రాజుకు బాగానే లాభాలు వచ్చే అవకాశం ఉంది.


'అంటే సుందరానికి' సినిమా తర్వాత వివేక్ ఆత్రేయ నాని కాంబినేషన్లో తెరకెక్కుతున్న రెండవ సినిమా ఇది. ఈ మూవీలో నాని సరసన హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తోంది. నాని, ప్రియాంక మోహన్‌ కలిసి చేస్తున్న రెండో సినిమా ఇది. ఇప్పటికే వీళ్లిద్దరు కలిసి నాని 'గ్యాంగ్ లీడర్' సినిమాలో నటించారు. అప్పట్లో వీరిద్దిరి జోడి ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రంలో తమిళ నటుడు SJ సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. రీసెంట్ గా ఆయన ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఇక ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.


Also Read : రవితేజ సినిమా రీ రిలీజ్‌ - మళ్లీ థియేటర్లలో దుబాయ్ శీను సందడి ఎప్పుడంటే?