సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ దంపతుల ముద్దుల కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ చిన్నారి.. ఇన్స్టాగ్రామ్ వీడియోలతో, తన ముద్దుముద్దు మాటలతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. సేవాగుణంలో తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది. అయితే తాజాగా లిటిల్ ప్రిన్సెస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ లో తన తండ్రి 'సిల్వర్ స్క్రీన్ టైటాన్' అని ప్రస్తావించడం, సినిమా అనేది తన DNAలోనే ఉందని కామెంట్ పెట్టడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 


నేషనల్ సినిమా డే సందర్భంగా శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలిసి త్రోబాక్ ఫోటోని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది సితార. "సినిమా - నా జీవితంలో మరియు నా పెంపకంలో చాలా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇది నాకు పరిశ్రమ కాదు.. ఇది నా DNA లో ఒక భాగం. సిల్వర్ స్క్రీన్ టైటాన్ అయిన మా నాన్న నాకు ఇన్స్పిరేషన్. ఆయనకు తన తండ్రి స్ఫూర్తి. లెజెండరీ ఎవర్‌ గ్రీన్ సూపర్‌స్టార్ కృష్ణగా ఈ ప్రపంచానికి తెలిసిన మా తాతగారు మనందరిపై ఎంతగానో ప్రభావం చూపారు. మా నాన్న, నా అన్న కోసం ఆయన విడిచిపెట్టిన ఈ లెగసీలో భాగమైనందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. దానికి కృతజ్ఞతతో ఉన్నాను. ఇది సినిమా మాయాజాలానికి, నా ఫ్యామిలీ సినిమాటిక్ జర్నీని ఇష్టపడి మద్దతుగా నిలిచే మీ అందరికీ. National Cinema Day" అని సితార రాసుకొచ్చింది. 






ఈ సందర్భంగా పంచుకున్న ఫొటోలో తన తాత దివంగత నటుడు కృష్ణ, తల్లిదండ్రులు నమ్రతా శిరోద్కర్ - మహేష్ ల మధ్య కూర్చొని ఉంది సితార. ఈ పిక్ లో ఆమె సోదరుడు గౌతమ్ కృష్ణని కూడా మనం చూడొచ్చు. మూడు తరాల ఘట్టమనేని వారసులు కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సూపర్ స్టార్ లెగసీని మహేష్ బాబు ఎలా కాపాడుతున్నారో, దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  


కాగా, 'వంశీ' సినిమాలో కలిసి నటించిన మహేష్ బాబు - నమ్రతలు కొన్నాళ్లపాటు డేటింగ్ చేసి, 2005 ఫిబ్రవరి 10న ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 17 ఏళ్ల కుమారుడు గౌతమ్ ఘట్టమనేని, కుమార్తె సితార జన్మించారు. మహేష్ హీరోగా నటించిన '1 నేనొక్కడినే' సినిమాతో గౌతమ్ ఇప్పటికే తెరంగేట్రం చేసాడు. ఈ క్రమంలో లిటిల్ ప్రిన్సెస్ సితార డెబ్యూ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'సర్కారు వారి పాట' సినిమాలోని 'పెన్నీ' మ్యూజిక్ వీడియోలో తన క్యూట్ పెర్ఫామెన్స్, స్టైలిష్ డ్యాన్స్ మూవ్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. బిగ్ స్క్రీన్ మీదకు రాకముందే కమర్షియల్ యాడ్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. మరి సూపర్ స్టార్ డాటర్ త్వరలోనే సినిమాల్లో ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి. 


ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'గుంటూరు కారం'లో నటిస్తున్నారు. వీరి కాంబోలో రాబోతున్న ఈ హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను 2024 సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టైటిల్ గ్లిమ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. దసరా పండక్కి ఫస్ట్ సింగి రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత మహేశ్ బాబు ఓ గ్లోబల్ ప్రాజెక్ట్ కోసం దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళితో చేతులు కలపబోతున్నాడు. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటించబడతాయి. 


Also Read: ఇండియన్ సినిమాపై సౌత్ ఇండస్ట్రీ ప్రభావం గురించి సీనియర్ నటి ఖుష్బూ ఆసక్తికర వ్యాఖ్యలు!



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial