సెలబ్రిటీలు.. కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో నిర్వహించే స్పెషల్ ఈవెంట్స్‌కు గెస్టులుగా లేదా ఎంటర్‌టైన్ చేయడానికి వెళ్తుండటం స్వరసాధారణమే. ముఖ్యంగా పెద్ద పెద్ద వ్యాపారులు నిర్వహించే వేడుకల్లో మాత్రమే పాల్గొంటారు. తాజాగా బాలీవుడ్ నటి, మాజీ పోర్న్ స్టార్ సన్నీలియోన్, నటుడు జాకీష్రాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్ కూడా ఓ వెడ్డింగ్ ఫంక్షన్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) వారితోపాటు పలువురు సెలబ్రిటీలు సమాన్లు జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.


అదేంటీ.. వెడ్డింగ్ ఫంక్షన్‌కు వెళ్తే.. ఈడీ సమాన్లు జారీ చేయడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? ఎందుకంటే.. వారు వెళ్లింది ఎవరి పెళ్లి వేడుకకో తెలుసా? ‘ది మహాదేవ్ బుక్ ఆన్‌లైన్ బెట్టింగ్’ యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ ఇంట్లో జరిగిన వేడుకకు. బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ ఇప్పటికే చంద్రకర్‌కు చెందిన రూ.417 కోట్లు ఆస్తులను జప్తు చేసింది. అయితే, ఫిబ్రవరి నెలలో యూఏఈ(UAE)లో చంద్రకర్ నిర్వహించిన వెడ్డింగ్ ఫంక్షన్‌కు రూ.200 కోట్లను మంచి నీళ్లలా ఖర్చు పెట్టేశారట. 


ఈ కార్యక్రమం బాధ్యతలు తీసుకున్న ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ముంబయి నుంచి ప్రత్యేక విమానంలో సెలబ్రిటీలను యూఏఈకి తీసుకెళ్లిందట. వారిలో సన్నీ లియోన్, టైగర్ ష్రాఫ్‌తోపాటు నేహా కక్కర్, అతిఫ్ అలమ్, అలి అస్గార్, విశాల్ దద్లానీ, భాగ్యశ్రీ, కృతి ఖర్బందా, సుశ్రత్ భరుచ్చా, సుక్విందర్ సింగ్ తదితర సెలబ్రిటీలు ఉన్నారట. ఇంకా డ్యాన్సర్లు, సింగర్లు.. ఇలా పెద్ద లిస్టే ఉందట. నిర్వాహకులు వారికి రూ.112 కోట్ల నగదును క్యాష్, హవాలా రూపంలో చెల్లింపులు జరిపినట్లు ఈడీకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఈడీ ఆ వేడుకలో పాల్గొన్న సెలబ్రిటీలందరికీ సమాన్లు జారీ చేసి విచారించనుందట. వారి స్టేట్‌మెంట్స్‌ను రికార్డు చేయనుంది. ప్రస్తుతం ఈడీ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయట. వారిలో ఎవరైనా అవకతవకలకు పాల్పడినా, అందుకు సహకరించినట్లు తెలిసినా.. చిక్కుల్లో పడటం ఖాయం. 


ఇలాంటి వివాదాల్లో సన్నీ లియోన్‌కు ఇదే ఫస్ట్ టైమ్


సన్నీ లియోన్ కెనడాలో జన్మించింది. ఆమె అసలు పేరు కరెన్‌జిత్ కౌర్ వోహ్ర. అనుకోకుండా పోర్న్ స్టార్ గా మారిన సన్నీ 2011 లో బిగ్ బాస్ లో పాల్గొన్న తర్వాత విపరీతమైన ప్రజాదరణ పొందింది. అప్పటి నుంచి సన్నీ క్రేజ్ మరింత పెరిగింది. దీంతో ఆమెకు వరుస నినిమా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం బాలీవుడ్ ఫేవరేట్ నటీమణుల్లో సన్నీ లియోన్ ఒకరిగా మారింది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా ఉందీ బోల్డ్ బ్యూటీ. ఇటీవల తన పేరు వెనక ఉన్న రహస్యాన్ని చెప్పుకొచ్చింది. ఆమె అమెరికాలో ఉన్నప్పుడు ఒక  మ్యాగజైన్ సంస్థ వారు తనను ఇంటర్వ్యూ చేశారని చెప్పింది. ఇంటర్వ్యూ తర్వాత వాళ్లు ‘‘మీ పేరు ఏమని వేయమంటారు’’ అని అడిగారని, అప్పుడు తనకు వెంటనే ఏమీ ఆలోచన రాలేదని అంది. అప్పుడు తాను వివిధ సంస్థల కోసం పనిచేస్తున్నానని, అప్పుడున్న పరిస్థితుల రీత్యా తన అసలు పేరును బయటపెట్టలేకపోయానని చెప్పింది. అందుకే తన మొదటి పేరుగా సన్నీ అని రాసుకోమని, చివరి పేరును మీకు ఇష్టం వచ్చింది పెట్టుకోమని చెప్పానని తెలిపింది. తర్వాత ఆ మ్యాగజైన్ వాళ్లు తన పేరును సన్నీ లియోన్ గా ప్రచురించారని పేర్కొంది. అయితే, సన్నీ లియోన్ ఇప్పటివరకు ఆర్థికపరమైన వివాదాల్లో చిక్కుకోలేదు. ఈడీ సమాన్లు జారీ చేస్తే తప్పకుండా ఆమె స్టేట్‌మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది.


Also Read: నీకు సినిమా ఎందుకు అని అడిగారు - నా సమాధానం ఇదే: యూట్యూబర్ హర్షసాయి