మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. గతేడాది చివర్లో 'ధమాకా' చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుని 100 కోట్ల క్లబ్ లో చేరాడు. అలానే ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో కలిసి 'వాల్తేరు వీరయ్య' వంటి మరో భారీ విజయాన్ని సాధించాడు. ఈ జోష్‌ లో ఇప్పుడు 'రావణాసుర' సినిమాతో హ్యాట్రిక్ హిట్టు కొట్టడానికి వస్తున్నాడు మాస్ రాజా.


స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా 'రావణాసుర' సినిమా తెరకెక్కింది. అక్కినేని యువ హీరో సుశాంత్ కీలక పాత్ర పోషించారు. అను ఇమాన్యుయేల్ - మేఘా ఆకాష్ - ఫరియా అబ్దుల్లా - దక్ష నగార్కర్ - పూజిత పొన్నాడ వంటి ఐదుగురు ముద్దుగుమ్మలు ఈ సినిమాలో భాగం అవుతున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్‌ ను ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


'రావణాసుర' చిత్రం నుంచి ఇది వరకే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. విడుదల తేదీ దగ్గర పడుతుండంతో చిత్ర బృందం ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. రవితేజ అండ్ టీం కలిసి వరుస ఇంటర్వ్యూలతో సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగా పాపులర్ యాంకర్ సుమతో చేసిన ఓ ఫన్నీ ఇంటర్వ్యూ నెట్టింట చక్కర్లు కొడుతోంది.


'రావణాసుర' మూవీలో రవితేజ ఒక క్రిమినల్ లాయర్ గా కనిపిస్తాడని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. కోర్టు బ్యాక్ డ్రాప్ లో సీన్స్ ఉన్నట్లు ట్రైలర్ ని బట్టి అర్థమైంది. ఇప్పుడు సుమ ఇదే థీమ్ తో హీరో రవితేజ, డైరక్టర్ సుధీర్ వర్మలను తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేసింది. దర్శక హీరోలను ముద్దాయిలుగా పేర్కొంటూ, కోర్టు బోనులో విచారణ చేస్తున్నట్లు సాగిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.


హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్ అనే ట్యాగ్ లైన్ తో రావణాసుర చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలో.. దీని గురించి సుమ ప్రశ్నించింది. దీనికి రవితేజ సమాధానం చెబుతూ, ఈ ప్రపంచంలో 88 శాతం మంది విలన్సే అని.. కేవలం 12 శాతం మంది మాత్రమే మంచోళ్లు ఉన్నారని అన్నారు. అలానే ఈ చిత్రానికి హర్ష వర్దన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరిలియో వంటి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ను తీసుకోవడం గురించి రవితేజ మాట్లాడారు. మిస్ కమ్యూనికేషన్ కారణంగానే ఇది జరిగినదని చెప్పాడు. నిర్మాత అభిషేక్ నామా ముందుగా హర్షవర్దన్ తో రెండు ట్యూన్స్ చేయించాడని.. తానేమో బీమ్స్ ని సజెస్ట్ చేశానని చెప్పాడు. ఇద్దరూ పాజిటివ్ పీపుల్ కావడంతో, ఇద్దరినీ ఈ సినిమాలో భాగం చేశామని రవితేజ వివరించారు.


Also Read : బాలీవుడ్‌లో ఎన్టీఆర్ భారీ సినిమా - హృతిక్ రోషన్ 'వార్ 2'లో!




కాగా, అభిషేక్ పిక్చర్స్ మరియు RT టీం వర్క్స్ బ్యానర్లపై అభిషేక్ నామా భారీ బడ్జెట్ తో 'రావణాసుర' చిత్రాన్ని నిర్మించారు. శ్రీకాంత్ విస్సా కథ అందించడంతో పాటు మాటలు - స్ర్కీన్‌ ప్లే సమకూర్చారు. ఇందులో జయరామ్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా ('అఖండ' ఫేమ్), సత్య, జయ ప్రకాష్, హైపర్ ఆది తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. విజయ్ కార్తీక్ కన్నన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. మాస్ రాజా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్న ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి. 


Also Read : జపాన్‌లో 'రంగస్థలం' రిలీజ్ - ఎప్పుడంటే?