యాక్షన్‌ పరంగా.. కథ పరంగా తనదైన శైలిని మెయింటైన్‌ చేస్తున్న హీరో సుధీర్‌బాబు. మహేష్‌బాబు బావగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్‌బాబు ప్రస్తుతం హంట్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు. హాలీవుడ్ సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో 'హంట్' సినిమాలో యాక్షన్ దృశ్యాలను తెరకెక్కించారు. సుధీర్ బాబు, భరత్, యాక్షన్ టీమ్ పడిన కష్టం ఆ వీడియోలో కనిపించింది. డూప్స్, రోప్స్ వాడకుండా ప్రేక్షకులకు రియలిస్టిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం కోసం చిత్ర బృందం శ్రమించింది. మహేష్‌ సూర్పనేని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.


ఈ సినిమాలోని స్టంట్స్ గురించి సుధీర్‌ బాబు మాట్లాడుతూ.. ‘‘రెగ్యులర్ ఫార్ములాలో వెళ్ళే సినిమా కాదు ‘హంట్’. ఈ మూవీ కథను నిజాయతీగా చెప్పే ప్రయత్నం చేశాం. ఫ్రాన్స్‌లో క్యాంపస్ యూనివర్స్ కాస్‌కేడ్స్ అని ఒక టీమ్ ఉంది. వాళ్లను కొన్ని సంవత్సరాలుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నాను. చాలా కొత్తగా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫైట్స్ చేస్తుంటారు. సినిమాలో ఎక్కడా ఒక్క రోప్, బెడ్ వాడలేదు. మా కెమెరామెన్ ఉన్నా... ఫైట్స్ వరకు మాత్రం ఆ టీమ్ కెమెరామెన్ వర్క్ చేశారు. ఆయన కూడా ఫైటర్, స్టంట్ మ్యాన్. 'విక్రమ్'లో స్టంట్స్ షూట్ చేసేటప్పుడు బోల్ట్ అనే కెమెరా కోసం మిషనరీ వాడారు. ఆ మిషనరీ లేకుండా అటువంటి ఎఫెక్ట్ కెమరా మ్యాన్ తీసుకొచ్చారు. దానికి చాలా స్కిల్స్ కావాలి. భరత్‌కు కూడా యాక్షన్ సీక్వెన్స్ ఉంది. మనిషిని పైకి ఎత్తి మూడు నాలుగు అడుగుల దూరంలో ఉన్న గోడపైకి విసరాలి. ఎవరు చేస్తారని అనుకున్నా.. భరత్ బాగా చేశాడు. షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు చాలా రిహార్సల్స్ చేశారు’’ అని తెలిపారు. 


Also Read: త్వరలో నేనూ విశాఖవాసి కాబోతున్నా, శృతిని బెదిరించారేమో - బాలకృష్ణపై చిరంజీవి స్వీట్ సెటైర్


‘‘ఈ సినిమాలో యాక్సిడెంట్ తర్వాత మెమరీ లాస్ అయిన వ్యక్తిగా నటించాను. సినిమా చూసే ప్రేక్షకులకు ఒక్కటే క్యారెక్టర్. కానీ, నా వరకు డబుల్ రోల్. మెమరీ లాస్ అవ్వడానికి ముందు, తర్వాత... అర్జున్ పాత్రలో డిఫరెన్స్ యాక్షన్ సీక్వెన్సుల్లో కూడా కనబడతాయి. అంజి మాస్టర్ 6, 7 కెమెరాలతో ఛేజ్ సీక్వెన్స్, కార్ యాక్సిడెంట్ షూట్ చేశారు. సీజీ వర్క్స్ లేకుండా ఫైట్స్ కూడా రియల్‌గా ఉండాలని అనుకున్నాం. అందుకే, అన్ని కెమెరాలు వాడాం. అన్ని యాంగిల్స్‌లో షూట్ చేశాం. ఛేజ్ సీక్వెన్సు కూడా బాగా వచ్చింది. ఇంటర్వెల్ ముందు ఒక సీక్వెన్స్ వస్తుంది. దానికి కూడా రిహార్సల్స్ చేశాం. సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు... చాలా కథ ఉంది'' అని సుధీర్ బాబు చెప్పారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాను జనవరి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.