సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'విరూపాక్ష'. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో 'సార్' భామ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. క్షుద్రపూజల బ్యాక్ డ్రాప్ లో ఈ సూపర్ నేచురల్ హారర్ మిస్టిక్ థ్రిల్లర్ రూపొందింది. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో స్టార్ డైరక్టర్ సుకుమార్ చిత్ర బృందాన్ని అభినందించారు.

 

'విరూపాక్ష' చిత్రానికి సుకుమార్ స్క్రీన్ ప్లే సమకూర్చడమే కాదు.. నిర్మాతగానూ వ్యవహరించిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ & సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ తో కలిసి సుక్కు ఈ సినిమాని నిర్మించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన తరుణంలో సుకుమార్ సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ''వావ్" అంటూ తన వద్ద కొన్ని చిత్రాలను పని చేసిన దర్శకుడు కార్తీక్ దండును అప్రిసియెట్ చేస్తూ పోస్ట్ పెట్టారు.

 

"వావ్ కార్తీక్ అని మాత్రమే నేను చెప్పగలను. నువ్వు ఈ స్క్రిప్ట్ ని నాకు చెప్పిన మొదటి రోజు నుండి ఈ సినిమా విజయంపై నమ్మకం ఉంది. కానీ నీవు 24 క్రాఫ్ట్స్ నుండి బెస్ట్ అవుట్ పుట్ ని తీసుకోవడం ద్వారా స్క్రీన్ మీద అద్భుతమైన విజువల్ ఎక్స్ పీరియన్స్ గా ఎలా మార్చగలిగారు అనేది నన్ను ఆశ్చర్యపరిచింది" అని సుకుమార్ దర్శకుడి పనితనాన్ని కొనియాడారు.

 

హీరో సాయి ధరమ్ తేజ్ గురించి చెబుతూ.. "ఈ ప్రాజెక్ట్ పై నమ్మకం ఉంచి కష్టకాలంలో కూడా సపోర్ట్ అందించినందుకు మిమ్మల్ని నిజంగా అభినందిస్తున్నాను. యూ ఆర్ జస్ట్ ఆవ్ సమ్" అని సుకుమార్ పేర్కొన్నారు. హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా చాలా అద్భుతంగా నటించిందని ఆయన ప్రశంసించారు.

 

'విరూపాక్ష' వరల్డ్ శామ్దత్ సైనుదీన్ లెన్స్ ద్వారా ప్రాణం పోసుకుంది. నాగేంద్ర, అజనీష్ లోక్ నాథ్ ఈ చిత్రానికి వెన్నుముకలు. విరూపాక్ష బృందం మొత్తానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను అని జీనియస్ డైరెక్టర్ సుక్కూ తన ఫేస్ బుక్ పోస్ట్ లో రాసుకొచ్చారు.

 


 

కాగా, 'విరూపాక్ష' అనేది సాయి తేజ్ కెరీర్ లో 15వ సినిమా. బైక్ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత మెగా మేనల్లుడి నుంచి వచ్చిన చిత్రం కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.50 కోట్ల గ్రాస్ ని వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ మార్క్ ని క్రాస్ చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ ని ప్రాఫిట్ జోన్ లోకి తీసుకొచ్చిందని చెబుతున్నాయి.

 

''విరూపాక్ష'' చిత్రంలో సాయి తేజ్, సంయుక్త మీనన్ లతో పాటుగా బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్, రవి కృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటించారు. 'కాంతారా' ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు.