Sivaji Raja: సినీ పరిశ్రమ అన్న తర్వాత నటీనటులు, మేకర్స్ మధ్య మనస్పర్థలు సహజం. చిన్న చిన్న విషయాల వల్ల ఎన్నో ఏళ్లుగా మాట్లాడకుండా ఉండిపోయిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీ రాజా, నాగబాబు కూడా ఒకరు. ఒకప్పుడు శివాజీ రాజా, నాగబాబు మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్‌గా ఉండేవారు. కానీ ఇప్పుడు వారిద్దరూ కనీసం మాట్లాడుకోవడం లేదు. దాని వెనుక కారణమేంటి అని తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్యూలో బయటపెట్టారు శివాజీ రాజా. అంతే కాకుండా పవన్ కళ్యాణ్.. తన ఆఫీస్‌కు వచ్చి చేసిన గొడవ గురించి కూడా వివరించారు.


నాకే తెలియదు..


‘‘దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అసలు నాగబాబుకు, నాకు మధ్య మనస్పర్థలు ఎందుకు వచ్చాయో నాకు తెలియదు. ఏమైంది అని అడగాలనుకున్నా అడిగే స్టేజ్ దాటిపోయింది. మధ్యలో కొందరు ఉంటారు కదా. పవన్ కళ్యాణ్ ఒకరోజు ఆఫీస్‌కు వచ్చి గొడవ చేసి.. తర్వాత మిమ్మల్ని ప్రెసిడెంట్ అవ్వనివ్వను అన్నాడు. మంచిదే కదా రెస్ట్ తీసుకుంటాను అన్నాను. ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు గొడవ చేశాడు ఇప్పటికీ నాకు క్లారిటీ లేదు. ఏదో కోపంలో వచ్చి రాఘవేంద్ర రావుకు, సురేశ్ బాబుకు ఫోన్ చెయ్యి అన్నాడు. ఇద్దరూ అందుబాటులో లేరని తనతో చెప్పాను. అతని ఎమోషన్ ఎలా ఉంటుందో చూస్తూనే ఉన్నాం కదా. నాకు అన్యాయం జరిగింది. దీనికి సమాధానం ఎవరు చెప్తారు అన్నాడు. దాంతో మూవీ ఆర్టిస్ట్‌కు, ఛాంబర్‌కు సంబంధం ఏముంది?’’ అని ముందుగా పవన్ కళ్యాణ్ చేసిన గొడవ గురించి బయటపెట్టారు శివాజీ రాజా.


నేను వదలలేదు..


‘‘ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 20 మంది లాయర్లను తీసుకొచ్చాడు. కొందరితో కలిసి ఐజీ దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేసి ఫైల్ తీసుకొచ్చి ఆయన చేతికి ఇచ్చాం. ఫైల్ చూసే ఓపిక కూడా ఆయనకు లేదు. ఆయన అప్పటికే నాకు చాలా క్లోజ్. అయినా కూడా పట్టించుకోకుండా లోపల లాయర్లు ఉన్నారు వాళ్లకు ఇవ్వు అన్నాడు. మీటింగ్ హాల్ మొత్తం లాయర్లతో నిండిపోయింది. వాళ్లకి ఇచ్చేశాక ఆయనతో చెప్దామనుకుంటే ఆ మాట కూడా ఆయన వినలేదు. నాకు బాధ అనిపించిన విషయం ఏంటంటే నాకోసం ఏం చేశావు నువ్వు అన్నారు. మిమ్మల్ని ఎవరో ఏదో అన్నందుకే ఐజీకి ఫిర్యాదు చేశాం ఫైల్ చూసుకోండి అన్నాను. నేను ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడే డ్రగ్స్ సమస్యలు వచ్చాయి. ఇంకెవరైనా అయ్యింటే వదిలేస్తారు. నేను వదలలేదు’’ అని అసలు ఆరోజు ఏం జరిగిందో వివరణ ఇచ్చారు.


ఓపిక ఉండదు..


‘‘ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్‌కు కొన్నిరోజులు ఉంది అనగా రాజశేఖర్ దగ్గరికి వెళ్లిపోయాడు నాగబాబు. ఇండస్ట్రీలో అప్పుడప్పుడు షాకులు తింటాం కదా. అది ఒక షాక్ నాకు. ఇవన్నీ దాదాపు కరోనా టైమ్‌లోనే జరిగాయి. మంచు విష్ణు ప్రెసిడెంట్ అయిన చాలారోజుల తర్వాత వెళ్లి కలిసి లేనివాళ్లను బాగా చూసుకో అని చెప్పాను. యూత్‌కు అంత ఓపిక ఉండదు. వాళ్లు చేయాలనుకుంటే చాలా చేయొచ్చు. పక్కనవాళ్లు కూడా కరెక్ట్‌గా ఉండాలి’’ అని మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అవ్వడంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు శివాజీ రాజా.


Also Read: అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!