Singeetam Srinivasa Rao: క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించి అద్భుత దృశ్య కావ్యం ‘ఆదిత్య 369’ (Aditya 369). అప్పట్లో ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ఈ సినిమా.. దాదాపు 34 సంవత్సరాల తర్వాత 4కె వెర్షన్‌లో రీ రిలీజ్ కాబోతోంది. ఏప్రిల్ 4న ఈ సినిమాను సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తన సంతోషాన్ని తెలియజేస్తూ.. అసలు ఈ సినిమా ఎలా మొదలైందనే విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. ‘ఆదిత్య 369’ సినిమా ఆలోచన గురించి ఆయన మాట్లాడుతూ.. 

‘‘అంతా ఈ సినిమాను ‘బ్యాక్ టు ద ఫ్యూచర్’ స్ఫూర్తితో తీశానని అంటుంటారు. కానీ అది నిజం కాదు. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లోనే హెచ్.జి. వెల్స్ రచించిన నవల ‘ది టైం మిషన్’ చదివాను. అది వేరే కథ. టైం ట్రావెల్, సైన్స్, ఫిక్షన్ ఇలాంటివన్నీ అందులో ఉంటాయి. వాటి గురించి అప్పట్లో నా కాలేజ్ మేట్స్‌తో డిస్కస్ చేస్తుండేవాడిని. బ్లాక్ అండ్ వైట్‌లో టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో టైం మెషిన్ సినిమాలు హాలీవుడ్‌లో చాలానే వచ్చాయి. నేను డైరెక్టర్ అయిన తర్వాత ఇది ఒక సబ్జెక్టుగా తీస్తే బాగుంటుందనే ఆలోచనతో దానికి సంబంధించిన లైన్ ఆర్డర్ మొత్తం రఫ్‌గా రాసి పెట్టుకున్నాను, ఆ తర్వాత ఇది ఎలా చేద్దాం? ఎవరితో చేద్దాం? అని ఆలోచన చేస్తున్నప్పుడు.. బెంగళూరు ఫ్లైట్‌లో ఎస్పీ బాలసుబ్రమణ్యంతో నేను ట్రావెల్ చేయ‌డం జరిగింది. ఆ స‌మ‌యంలో ఇద్దరం వేరే విషయాలు మాట్లాడుకుంటుండగా.. నా దగ్గర ఒక సబ్జెక్టు ఉందని నేను చెప్పడం మొదలుపెట్టాను. అంతే ఆయన ఫుల్ ఎక్జయిట్ అయ్యారు. 

Also Read: మధుశాల రివ్యూ: ETV Winలో పొలిటికల్ క్రైమ్ డ్రామా... వరలక్ష్మి శరత్‌ కుమార్ సినిమా బావుందా? లేదా?

వెంటనే ‘కాన్సెప్ట్ చాలా బాగుంది.. ఇది మనం తప్పకుండా చేయాలి’ అని అన్నారు. శివలెంక కృష్ణ ప్రసాద్‌కు తెలుసో తెలియ‌దో.. ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇద్దరు ముగ్గురు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లకు స్టోరీ గురించి చెప్పారు. కానీ వాళ్లకి సైన్స్‌ ఫిక్షన్ అనే కాన్సెప్ట్ అర్థం కాలేదు. ఇదేదో ఒక ఫాంటసీ సినిమా అనుకున్నారు. కానీ ఎస్పీ బాలసుబ్రమణ్యం మాత్రం ఈ కథను బాగా నమ్మారు. అప్పుడు కృష్ణ ప్రసాద్‌కు చెప్పారు. ఆయ‌న‌కు కూడా సైన్స్ ఫిక్షన్ అనే జోనర్ గురించి తెలియదు. కానీ ఆయన గొప్పతనం ఏంటంటే.. పెద్ద పెద్ద నిర్మాతలే ఇదేమిటని సందేహిస్తున్న సమయంలో ఇందులో ఏదో మ్యాటర్ ఉందనే ఫీలింగ్ ఆయనకు వచ్చింది. ‘ఇది మామూలు ఫాంటసీ కాదు, మామూలు చరిత్ర కాదు, ఇది ఇంకేదో ఉంది..’ అని చెప్పి, ఒక గుడ్డి నమ్మకంతో కృష్ణ‌ప్ర‌సాద్ దూకేశారు. అసలు ముందూ వెనుకా చూసుకోలేదు.. ఎలా చేస్తామో తెలియదు. స్విమ్మింగ్ గురించి తెలుసుకుని నీళ్లలోకి దూకడం కాదు, ముందు నీళ్లల్లోకి దూకి స్విమ్మింగ్ నేర్చుకోవడం అన్న చందంగా ఆయన ఈ ప్రాజెక్ట్‌ని నడిపించారు. ఆ క్రెడిట్ మొత్తం కృష్ణ ప్రసాద్‌కే చెందుతుంది. చాలా గ‌ట్ ఫీలింగ్‌తో ముందుకు వ‌చ్చారు. అలా ఈ ప్రాజెక్ట్ మొదలైంది’’ అని సింగీతం చెప్పుకొచ్చారు.

ఈ చిత్ర రీ రిలీజ్ విషయమై ఆయన మాట్లాడుతూ.. నాకు ఇది ఒక వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్‌లా అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడెప్పుడో మేము ఈ సినిమాను మాకున్న అనుభవంతో ఒక టైప్ ఆఫ్ టెక్నికల్ యాక్సిలెరెన్స్‌లో చేశాము. ఇంత టెక్నికల్ అడ్వాన్స్‌మెంట్ ఉంటుందని అప్పుడు మాకు తెలియదు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని చూసిన తర్వాత.. ‘ఆదిత్య 369’ సినిమాను ఇప్పుడు తీసుంటే బాగుండేదని నాకు చాలా సార్లు అనిపించింది. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను కంప్లీట్‌గా అప్‌గ్రేడ్ చేసి, కాంటెంపరరీ టెక్నాలజీకి ఈక్వెల్‌గా చేసి ఇలా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుంటే.. ఆస‌క్తి ఉన్న‌ ప్రేక్ష‌కుల‌కే కాదు నాలాంటి వాళ్ల‌కి కూడా ఈ సినిమాను చూడాల‌నిపిస్తుంది. నిజంగా ఇది ఒక థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్. నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

Also Read: 'దిల్' రాజు సినిమాకూ టైమ్ ఇవ్వలేదు... హిందీ కోసం సౌత్ వదిలేసింది... ఇప్పుడు కామెంట్స్ ఏంటమ్మా?