సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు చేసింది తక్కువ సినిమాలైనా వాటితోనే ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. అందంతో పాటు టాలెంట్ ఉన్న హీరోయిన్స్ కి అవకాశాలు రాక ఎంతోమంది ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి పెళ్లిళ్లు చేసుకుని  స్థిరపడిపోయారు. అలాంటి వాళ్లలో హీరోయిన్ అంకిత కూడా ఒకరు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'సింహాద్రి' సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది ఈ హీరోయిన్. తన అందం, అభినయంతో అప్పట్లో కుర్రాళ్ళ మనసు కొల్లగొట్టింది. 'లాహిరి లాహిరి లాహిరిలో' అనే సినిమాతో తెలుగు వెండితెరకు హీరోయిన్గా పరిచయమైంది అంకిత. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో హీరోయిన్గా అంకితకు కెరీర్ ఆరంభంలో మంచి అవకాశాలే వచ్చాయి.


బాలకృష్ణ, రవితేజ, గోపిచంద్ లాంటి అగ్ర హీరోలతో నటించే అవకాశం దక్కించుకుంది. కానీ ఈ హీరోయిన్ కి బాగా గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమా మాత్రం'సింహాద్రి'. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా భూమిక నటించగా.. మరో హీరోయిన్గా అంకిత తన నటనతో ఆకట్టుకుంది. ఇక 'సింహాద్రి' తర్వాత ఈమెకు హీరోయిన్గా మంచి అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఎవరు ఊహించిన విధంగా సినీ ఇండస్ట్రీకి దూరమైపోయింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అంకిత ఇండస్ట్రీకి ఎందుకు దూరం కావాల్సి వచ్చింది అనే విషయాలతో పాటు కొన్ని ఆసక్తికర విశేషాలను పంచుకుంది. ముఖ్యంగా అప్పట్లో హీరో నవదీప్ తో జరిగిన గొడవ గురించి కూడా క్లారిటీ ఇచ్చింది.


ఇక తాజా ఇంటర్వ్యూలో అంకిత మాట్లాడుతూ.. " బాలకృష్ణ నటించిన ‘విజయేంద్ర వర్మ’ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాను. ఆ సినిమా తర్వాత పెద్ద పెద్ద ఆఫర్స్ వస్తాయని అనుకున్నా. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఆ సినిమా కనుక సక్సెస్ అయి ఉంటే నేను ఈరోజు ఇండస్ట్రీలో ఉండేదాన్ని. సినిమా పరిశ్రమలో సక్సెస్ ఉంటేనే కెరియర్ సాగుతుందంటూ" చెప్పుకొచ్చింది. ఇక హీరో నవదీప్ తో  గొడవ గురించి మాట్లాడుతూ.. " నవదీప్ నాకు ఎలాంటి విభేదాలు లేవు. నేను నవదీప్ తో కలిసి నటించిన సినిమాతో పాటు తమిళంలో మరో సినిమా ఒకే సమయంలో చిత్రీకరణ సాగడంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాను. ఆ క్రమంలో అసహనానికి గురయ్యాను తప్పితే.. నవదీప్ తో ఎలాంటి గొడవ జరగలేదు" అంటూ నవదీప్ తో గొడవ గురించి క్లారిటీ ఇచ్చింది అంకిత.


అంతే కాకుండా ఇండస్ట్రీలో తనకు ఆర్తీ అగర్వాల్, ఉదయ్ కిరణ్ మంచి ఫ్రెండ్స్ అని ఇప్పుడు వాళ్లు మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమని అన్నారు. ఇక గత ఏడాది అల్లు అర్జున్ ని కలిసానని, ఎన్టీఆర్ తో సోషల్ మీడియాలో టచ్ లో ఉన్నానని, పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో అభిమానం అని, మంచి అవకాశం వస్తే మళ్లీ సినిమాల్లో తాను సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టడానికి సిద్ధమంటూ చెప్పుకొచ్చింది. కాగా 2009 తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన అంకిత 2016లో ముంబై కి చెందిన విశాల్ జగపతి అనే ప్రముఖ వ్యాపారవేత్తని వివాహం చేసుకుంది. ఆ తర్వాత వీరు కుటుంబంతో న్యూజెర్సీలో స్థిరపడ్డారు.


Also Read : కమల్ హాసన్, నషిరుద్దిన్ షా కామెంట్స్‌పై ఎట్టకేలకు స్పందించిన అదా శర్మ - సక్సెస్‌ను ఆపలేరు!




Join Us on Telegram: https://t.me/abpdesamofficial