Simbaa Movie Trailer Is Out Now: సోషల్ మెసేజ్‌తో వస్తున్న సినిమాల్లో కూడా మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ యాడ్ అయితే ప్రేక్షకులు వాటిని ఆదరిస్తారు. ఇప్పుడు అదే కేటగిరిలో మరో తెలుగు సినిమా కూడా యాడ్ అవ్వనుంది. అదే ‘సింబా’. జగపతి బాబు, అనసూయ భరద్వాజ్ లీడ్ రోల్స్ చేసిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను బట్టి చూస్తే... ప్రకృతి గురించి, ప్రస్తుతం మనుషుల వల్ల ప్రకృతిపై పడుతున్న ఎఫెక్ట్ గురించి తెరకెక్కించినట్టుగా అనిపిస్తోంది. కానీ ఈ మూవీలో మరెన్నో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని ట్రైలర్‌లోనే రివీల్ చేశాడు దర్శకుడు మురళి మనోహర్ రెడ్డి.


వాయు కాలుష్యం..


‘‘స్టేజ్ ముందు ఉన్న పెద్దవాళ్ల దగ్గర నుండి సెంటర్ డోర్ ఓపెన్  చేసే సెక్యూరిటీ వరకు ఇక్కడ ఉన్న హంతకులు అందరికీ సుఖమైన చావు రావాలని కోరుకుంటున్నాను’’ అని జగపతి బాబు చెప్పే డైలాగ్‌తో ‘సింబా’ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఒక మోటివేషనల్ టాక్ షో స్టేజ్‌పై జగపతి బాబు మాట్లాడుతూ ఉంటారు. అదేంటి అందరినీ హంతకులు అని అందరూ ఆశ్చర్యపోయేలోపు అలా ఎందుకు అన్నారో వివరిస్తారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా గాలి కాలుష్యం వల్ల 65 శాతం మంది చనిపోతున్నారు. దమ్ము, మందు కంటే దుమ్ము వల్ల చనిపోయేది 25 రెట్లు ఎక్కువ. ఆ తర్వాత ఒక స్కూల్ టీచర్‌ అక్షికగా అనసూయ భరద్వాజ్ పాత్ర పరిచయం అవుతుంది.


విజయ్ దేవరకొండలాంటి మొగుడు..


‘సింబా’ ట్రైలర్‌లో తన క్లాస్ పిల్లలకు మొక్కలు, చెట్ల గొప్పదనాన్ని వివరిస్తుంది అనసూయ భరద్వాజ్. ఆ తర్వాత ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ప్రేమికుల్లాగా అనీష్ కురువిల్లా, దివి పరిచయం అవుతారు. ఒక సీన్‌లో అనసూయ దగ్గరకు ఒక అడుక్కునే వ్యక్తి వచ్చి ‘‘నీకు మహేశ్ బాబు లాంటి మొగుడొస్తాడు’’ అని అంటే తను వద్దు అంటుంది. దీంతో వెంటనే ఆ వ్యక్తి.. ‘‘పోనీ విజయ్ దేవరకొండ లాంటి మొగుడొస్తాడు’’ అని అంటాడు. ఈ డైలాగ్‌ను బట్టి చూస్తే అనసూయ ఆఫ్ స్క్రీన్ ఫేమ్‌ను కూడా ‘సింబా’లో ఉపయోగించుకున్నట్టు తెలుస్తోంది. అప్పటివరకు సరదాగా సాగిపోయిన ట్రైలర్.. ఒక హత్యతో మరో మలుపు తిరుగుతుంది. ఆ హత్యలను విచారించడానికి వశిష్ట సింహా రంగంలోకి దిగుతాడు.



కావాలని చేయలేదు..


సిటీలో జరుగుతున్న హత్యలకు అనసూయ కారణమనుకొని తనను అనుమానిస్తుంటారు పోలీసులు. మెల్లగా అనీష్ కూడా ఈ హత్యల్లో అనుమానితుడు అవుతాడు. వారిని విచారించే డాక్టర్‌గా సీనియర్ నటి గౌతమి పరిచయమవుతారు. అనసూయ, అనీష్‌ను విచారించిన గౌతమికి.. వారే హత్యలు చేసినా కూడా వారికి ఏమీ గుర్తులేదనే విషయం అర్థమవుతుంది. ‘‘చంపినవాళ్లు ఎవరినీ కూడా వీళ్లు వెతికి చంపలేదు’’ అని గౌతమి నిర్ధారిస్తారు. మొత్తానికి ‘సింబా’ ట్రైలర్‌ను బట్టి చూస్తుంటే అనసూయ, జగపతి బాబు ఈ మూవీలో చాలా వైలెన్స్‌ను చూపించారని అర్థమవుతోంది. ఆగస్ట్ 9న ఈ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది.



Also Read: పవన్ కళ్యాణ్‌తో అనసూయ స్పెషల్ సాంగ్ - అది ఏ సినిమాలోనో తెలుసా?