Pushpa 2 Vs Bhairathi Ranagal: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన యాక్షన్ డ్రామా 'పుష్ప'. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ పాన్ ఇండియా చిత్రం.. 2021లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో ఇప్పుడు రెండో భాగం 'పుష్ప: ది రూల్' మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ఆగస్టులో రాబోతున్న బన్నీకి సోలో డేట్ దొరకడం లేదు. పోటీగా ఇప్పుడు మరో అగ్ర హీరో వస్తుండటం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.


'పుష్ప 2' చిత్రాన్ని 2024 ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పిన సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. 'పుష్ప: ది రూల్' చుట్టూ నెలకొన్న బజ్ ను దృష్టిలో పెట్టుకొని, అదే టైంలో థియేటర్లలోకి రావడానికి ఇతర సినిమాలేవీ సాహసించడం లేదు. పుష్ప పార్ట్ 2కి భయపడి, 'సింగం' ఫ్రాంచైజీలో భాగంగా తెరకెక్కుతోన్న 'సింగం ఎగైన్' సినిమాని కూడా పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కన్నడ హీరో శివరాజ్ కుమార్ పుష్పరాజ్ ను ఢీకొట్టడానికి సిద్ధమయ్యారు


డా.శివ రాజ్‌ కుమార్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘భైరతి రణగల్’. ఇది బ్లాక్ బస్టర్ 'మఫ్తీ' మూవీకి ప్రీక్వెల్. నర్తన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గతేడాది మహా శివరాత్రి సందర్భంగా ఆ సినిమా టైటిల్ అనౌన్స్ చేసి, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అయితే తాజాగా మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ ను లాక్ చేశారు. రాబోయే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తారీఖున విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ, కొత్త పోస్టర్ ను ఆవిష్కరించారు. దీంతో ఇప్పుడు శివ రాజ్ కుమార్, అల్లు అర్జున్ మధ్య క్లాష్ అనివార్యంగా మారే పరిస్థితి ఏర్పడింది.






'పుష్ప 2' అనేది పాన్ ఇండియా సినిమా. తెలుగుతో పాటుగా కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. బన్నీకి కర్ణాటకలో మంచి మార్కెట్ ఉంది కాబట్టి, కన్నడలోనూ హ్యూజ్ కలెక్షన్స్ ఆశించవచ్చు. అయితే ఇప్పుడు అదే రోజున ‘భైరతి రణగల్’ సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తామని అనౌన్స్ చేశారు. దీన్ని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తారా లేదా? అనేది పక్కన పెడితే.. కన్నడలో మాత్రం 'పుష్ప: ది రూల్' సినిమాకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. 


ఎందుకంటే శివరాజ్ సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా అక్కడ భారీ ఓపెనింగ్స్ రాబడుతుంటాయి. అందులోనూ ఇది 2017లో ఘన విజయం సాధించిన 'మఫ్టీ' చిత్రానికి ప్రీక్వెల్. కాబట్టి ‘భైరతి రణగల్’ కచ్ఛితంగా బన్నీ మూవీ వసూళ్లపై ప్రభావం చూపుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఇవన్నీ ఆలోచించి, రానున్న రోజుల్లో ఎవరైనా వెనక్కి తగ్గుతారేమో చూడాలి.


'భైరతి రణగల్' చిత్రంలో శివరాజ్ కుమార్ తో పాటుగా రాహుల్‌ బోస్, 'డ్యాన్సింగ్ రోజ్' షబీర్, ఛాయా సింగ్, వశిష్ఠ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. నవీన్ కుమార్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. గీతా పిక్చర్స్ బ్యానర్ పై గీతా శివరాజ్‌ కుమార్ నిర్మిస్తున్నారు.


Also Read: లెజెండరీ నటుడికి వీరాభిమానిగా.. కొత్త చిత్రానికి కొబ్బరికాయ కొట్టిన కార్తి!