బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్, మరో హీరో జాన్ అబ్రహం ప్రధాన తారలుగా రూపొందుతోన్న సినిమా 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 25న సినిమాను విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.

 

'పఠాన్' సినిమా కోసం షారూఖ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే... వెండితెరపై ఆయన కనిపించి మూడేళ్ళు అవుతోంది. 'జీరో' సినిమా డిసెంబర్ 21, 2018న విడుదలైంది. అప్పటి నుంచి మరో సినిమా రాలేదు. పైగా, 'వార్' వంటి యాక్షన్ హిట్ తీసిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు కావడం కూడా సినిమాపై అంచనాలు పెంచింది. ఇప్పుడీ సినిమా విడుదల తేదీ రావడంతో షారూఖ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.


'పఠాన్' జనవరి 25న విడుదలకు సిద్ధమైంది. ఆ రోజు బుధవారం. విడుదలైన రెండో రోజు గురువారం (జనవరి 26న) రిపబ్లిక్ డే కాబట్టి హాలిడే ఉంటుంది. శుక్ర, శని, ఆది వారాలు అభిమానులు సినిమాలకు వస్తారు. సో... లాంగ్ వీకెండ్ మీద షారూఖ్ సినిమా కన్నేసిందని చెప్పాలి.

 





'పఠాన్' విడుదల తేదీ ఖరారు కావడంతో హృతిక్ రోషన్ - దీపికా పదుకోన్ నటిస్తున్న 'ఫైటర్', జాన్ అబ్రహం 'తెహ్రాన్' వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్ టాక్. ఎందుకంటే... 'పఠాన్'లో దీపికా పదుకోన్, జాన్ అబ్రహం ఉన్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే... 'పఠాన్', 'ఫైటర్' సినిమాలకు దర్శకుడు ఒక్కరే - సిద్ధార్థ్ ఆనంద్. అదీ సంగతి!