దక్షిణాది అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా గడుపుతోంది. 2021లో విడుదలైన 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ తో నేషనల్ వైడ్ పాపులారిటీ రావడంతో.. ఇప్పుడు సామ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ పై ఎక్కువగా దృష్టి సారిస్తోంది. ఇప్పటికే 'యశోద' చిత్రాన్ని ఐదు భాషల్లో రిలీజ్ చేసి హిట్ కొట్టిన స్టార్ హీరోయిన్.. 'శాకుంతలం' చిత్రంతో మరోసారి పాన్ ఇండియాని టార్గెట్ చేస్తోంది. పాన్ ఇండియన్ స్టార్ గా పిలవబడటంపై సమంత స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 


'శాకుంతలం' సినిమా విడుదల కోసం ఎదురుచూస్తోన్న సమంత.. జాతీయ స్థాయిలో ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత జీవితం ఎలా మారింది? అనే ప్రశ్నకు స్పందించింది. "ఎవరైనా ఈ విషయాన్ని నా పెంపుడు జంతువులకు చెప్పండి.. ఎందుకంటే నేను ఇప్పటికీ వాటి మలాన్ని శుభ్రం చేస్తున్నాను" అని సామ్ హిలేరియస్ గా సమాధానం చెప్పింది. "నా జీవితం మారిందని నేను అనుకోను. నేను సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే స్టార్‌ ని. ఆ తర్వాత, నా జీవితం చాలా నార్మల్" అని ఆమె చెప్పుకొచ్చింది.


ఇకపోతే సామ్ ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో ముచ్చటించింది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా వైఫ్యలాలను, విజయాలను మీరు ఎలా తీసుకుంటారు? భావోద్వేగాలను ఎలా సమతుల్యం చేస్తారు? అని ఓ నెటిజన్‌ ప్రశ్నించగా.. విజయాలకన్నా అపజయాలు, వైఫల్యాలు గొప్ప పాఠాలు నేర్పుతాయని సమంత బదులిచ్చింది. అపజయాలు ఎదురైనప్పుడే మరింత ఉత్తమంగా మారడానికి అవకాశం ఉంటుందని పేర్కొంది. ఈ రెండేళ్లలో చాలా జరిగాయి. అస్సలు ఊహించని పరిణామాలు, జీవిత పాఠాలు ఎదురయ్యాయి. ఇప్పుడు దేనికైనా సిద్ధపడి ఉన్నానని అనుకుంటున్నాని తెలిపింది. 


'శాకుంతలం' సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ పాత్ర చాలా స్ఫూర్తినిచ్చేది. ఆమె చూపించిన దయ, గౌరవం, జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు.. ఇలా ప్రతి దాని నుంచి నేను స్ఫూర్తిపొందానని సమంత చెప్పింది. ఇదొక సరికొత్త ఎంటర్‌టైనర్ అని, ఈ సినిమా మిమ్మల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని చెప్పింది. నిజంగా ఇదొక విజువల్‌ ట్రీట్‌ అని, తాను గర్వపడేలా చేసిన సీన్‌ సెకండాఫ్‌ లో ఉంటుందని తెలిపింది. ‘శాకుంతలం’ చిత్రానికి మూడు భాషల్లో తానే డబ్బింగ్‌ చెప్పుకొన్నట్లు సామ్ వెల్లడించింది. తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో డబ్బింగ్ చెప్పానని... కష్టమే అయినా, అవసరం కాబట్టి భవిష్యత్‌లోనూ దీన్ని కొనసాగించాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది. 


కాగా, గుణశేఖర్ దర్శకత్వం వహించిన 'శాకుంతలం' చిత్రంలో సమంత టైటిల్ రోల్ పోషించగా.. దేవ్ మోహన్ కీలక పాత్ర పోషించాడు. సచిన్ ఖేడేకర్, మోహన్ బాబు, అదితి బాలన్, ప్రకాష్ రాజ్, మధుబాల, జిషు సేన్‌గుప్తా మరియు కబీర్ బేడీ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. కాళిదాసు రాసిన 'అభిజ్ఞాన శాకుంతలం' నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దిల్ రాజు సమర్పణలో గుణశేఖర్ కుమార్తె నీలిమ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఏప్రిల్ 14న పాన్ ఇండియా వైడ్ భారీ స్థాయిలో తెలుగు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో ఈ మైథలాజికల్ డ్రామా రిలీజ్ కానుంది. 3డీలోనూ ఈ మూవీ అందుబాటులోకి రానుంది.


Also Read : ఎన్టీఆర్ సాంగులో హుక్ లైన్ టైటిల్‌ గా, సింగిల్ క్యారెక్టర్‌ తో సినిమా