కొందరు నటీనటులకు దర్శకులు చెప్పే కథలు నచ్చాలంటే అంత మామూలు విషయం కాదు.. ఎన్నాళ్లు అయినా సినిమాలు చేయకుండా ఉంటారేమో కానీ.. నచ్చని కథను మాత్రం పొరపాటున కూడా ఒప్పుకోరు. అలాగే కొందరు నటీనటులు కథ నచ్చినా కూడా అందులో తమ పాత్రకు ప్రాధాన్యత లేకపోతే క్షణం కూడా ఆలోచించకుండా రిజెక్ట్ చేస్తారు. అలాంటి వారిలో సాయి పల్లవి కూడా ఒకరు. ఇప్పటికే సాయి పల్లవి కెరీర్ ప్రారంభమయ్యి పలు సంవత్సరాలు అయినా తను నటించిన సినిమాల సంఖ్య మాత్రం తక్కువే. ఎందుకంటే కథ ఎలా ఉంది, అందులో తన పాత్ర ఎలా ఉంది అనే ఆలోచనలు సాయి పల్లవికి ఎక్కువ. అలాంటి ఈ భామ.. ఒక యంగ్ హీరోతో రెండోసారి జతకట్టడానికి సిద్ధమవుతోంది.


రెండోసారి జతకడుతూ..
ఒక నటితో కెమిస్ట్రీ వర్కవుట్ అయితే.. అదే నటితో మళ్లీ మళ్లీ నటించడానికి హీరోలు ఏ మాత్రం వెనకాడరు. అలాంటి నటీమణుల్లో సాయి పల్లవి కూడా ఉంటుంది. ఏ హీరోతో నటించినా కూడా ఆ హీరోతో తన కెమిస్ట్రీని అద్భుతంగా పండించగల స్టామినా సాయి పల్లవిలో ఉంటుంది. అందుకే నేచురల్ స్టార్ నాని కూడా తనతో రెండు సినిమాలు చేశాడు. ఇప్పుడు మరో యంగ్ హీరో నాగచైతన్య కూడా సాయి పల్లవితో జోడీకట్టడానికి సిద్ధపడుతున్నాడు. ఇప్పటికే నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్‌లో ‘లవ్ స్టోరీ’ చిత్రం వచ్చింది. ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది. అలాంటి హిట్ తర్వాత మరోసారి వీరిద్దరు జతకట్టబోతున్నారు అనే వార్త ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.


మత్స్యకారుల కథ..
చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య ఒక చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ మూవీ మత్స్యకారుల జీవితకథల ఆధారంగా తెరకెక్కుతుందని టీమ్ క్లారిటీ ఇచ్చింది. అంతే కాకుండా దీని ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం గోదావరి జిల్లాల్లోని మత్స్యకారులను కూడా వెళ్లి కలిసింది. ఈ మూవీ చేద్దామని అనుకున్నప్పటి నుంచి ప్రతీ ఒక్క అంశాన్ని ప్రేక్షకులతో ఎప్పటికప్పుడు పంచుకుంటోంది టీమ్. అయితే తాజాగా ఇందులో హీరోయిన్ ఎవరో కనుక్కోండి చూద్దాం అన్నట్టు ఒక వీడియోను విడుదల చేసింది. ఆ వీడియో చూసిన మూవీ లవర్ ఎవరైనా టక్కున సాయి పల్లవి అని గుర్తుపట్టేయవచ్చు. అందుకే మూవీ టీమ్ కూడా వెంటనే సోషల్ మీడియాలో హీరోయిన్ ఎవరు అని ప్రకటించింది. సాయి పల్లవి కూడా ఈ సినిమాలో నటించడం తనకు సంతోషంగా ఉంది అంటూ పోస్ట్ చేసింది. 


మిమ్మల్ని మిస్ అయ్యాను..
‘‘ఇలాంటి ప్రియమైన టీమ్‌లో భాగమయినందుకు చాలా సంతోషంగా ఉంది. గీతా ఆర్ట్స్, బన్నీ వాస్, చందూ మొండేటి ఇచ్చిన వెల్‌కమ్‌కు థ్యాంక్స్. నాగచైతన్యతో కలిసి మరో స్పెషల్ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులు మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. ఇప్పుడు ఎన్‌సీ 23 ద్వారా మిమ్మల్ని కలుస్తాను అని చాలా సంతోషంగా ఉన్నాను’’ అంటూ సాయి పల్లవి ట్వీట్ చేసింది. అంతే కాకుండా మూవీ టీమ్‌తో కలిసి దిగిన ఫోటోలను, ప్రత్యేకంగా అల్లు అరవింద్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. మరి ఇలాంటి భారీ ప్రీ ప్లానింగ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఎన్‌సీ 23.. ఏ రేంజ్‌లో హిట్ అవుతుందో చూడాలి.






Also Read: సల్మాన్ ఖాన్‌తో సినిమాపై సమంత క్లారిటీ - ఆ ఇద్దరికీ లైన్ క్లియర్?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial