Kannada Hero To Play The Lead Role In Jai Hanuman: ఈ ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమాలతో పోటీ పడి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా ‘హనుమాన్’. తెలుగులోనే కాదు... దేశ వ్యాప్తంగా విడుదలైన ప్రతి చోటా అద్భుత విజయాన్ని అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది. సుమారు రూ. 25 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 400 కోట్లు వసూళు చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు సీక్వెల్ గా ‘జై హనుమాన్’ ఉంటుందని ప్రశాంత్ వర్మ ప్రకటించారు. తొలి భాగానికి మించి ఈ సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పటి వరకు పెద్దగా అప్ డేట్స్ ఏవీ రాలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.


‘జై హనుమాన్’లో కన్నడ స్టార్ హీరో మెయిన్ లీడ్


ప్రస్తుతం ‘జై హనుమాన్’ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ మూవీలో నటించే యాక్టర్లకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా ఈ చిత్రంలో ఓ కన్నడ స్టార్ హీరో మెయిన్ లీడ్ పోషించబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు, ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి. ప్రశాంత్ వర్మ మాదిరిగానే, రిషబ్ కూడా ‘కాంతార’ సినిమాతో దేశ వ్యాప్తంగా మాంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన ‘కాంతార 2’ కోసం దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ‘జై హనుమాన్’లో నటించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ‘జై హనుమాన్’ సినిమాలో మెయిన్ లీడ్ ను ఎవరి ఊహలకు అందుకుండా ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హనుమాన్, రాముడి పాత్రలకు చాలా ప్రాధాన్యత ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే, రిషబ్ శెట్టి ఈ మూవీలో రాముడిగా కనిపిస్తారా? లేదంటే హనుమంతుడిగా కనిపిస్తాడా? అనేది త్వరలో తెలియనుంది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్రశాంత్ వర్మ ప్రయత్నిస్తున్నారు.



‘జై హనుమాన్’ థియేటర్లలోకి వచ్చేది అప్పుడేనా?


‘జై హనుమాన్’ సినిమాను వెండితెరపై సరికొత్తగా ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో పెద్ద ఎత్తున వీఎఫ్ఎక్స్ ను ఉపయోగించనున్నారు. ఈ పనుల కోసం చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అయితే, ఈ సినిమా ఇప్పట్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. నిజానికి ఈ సినిమాను 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ‘హనుమాన్’ సినిమా సమయంలో ప్రకటించారు. కానీ, అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2026 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.  


వరుస ప్రాజెక్టులతో ప్రశాంత్ వర్మ బిజీ


‘హనుమాన్’ క్రేజ్ తో ప్రశాంత్ వర్మ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. PVCU నుంచి కొత్త ప్రాజెక్టులను అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ నిర్మాత దానయ్య కుమారుడు కల్యాణ్ దాసరి హీరోగా ‘అధీరా’ అనే సినిమాను ప్రకటించారు. నందమూరి మోక్షజ్ఞను లాంచ్ చేయబోతున్నారు. ‘మహాకాళి’ అనే లేడీ సూపర్ హీరో మూవీని చేస్తున్నారు. ఈ సినిమాకు ఆయన కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నట్లు తెలిపారు.   


Read Also: బేబీ బంప్‌తో షాక్ ఇచ్చిన 'లెజెండ్' హీరోయిన్ - త్వరలో తల్లి కానున్న రాధికా ఆప్టే