Veturi Sundararama Murthy:కొంత మంది పుట్టుక ఆ కుటుంబానికే కాదు, జాతికే కాదు, యావద్దేశానికే కీర్తి తెచ్చి పెడుతుంది. అన్నమయ్య పాటలని చాలా వాటిని వెలికి తీసినవారూ, పండితుడూ అయిన  వేటూరి ప్రభాకర శాస్త్రి తమ్ముడి కొడుకు వేటూరి సుందరరామ్మూర్తి. ఆయన 29 జనవరి 1936 లో జన్మించారు. మంచి సాహిత్య కుటుంబంలో పుట్టిన వేటూరికి సహజంగానే లిటరేచర్ మీద పట్టు ఉంది. సినిమాల్లోకి రాక ముందే "ఏ కులమూ నీదంటే గోకులమూ నవ్విందీ" లాంటి గొప్ప పాట రాయడంలోనే అది తెలుస్తోంది. (చాలా సంవత్సరాల తర్వాత విశ్వనాథ్ తన "సప్తపది" సినిమా కోసం ఈ పాటను ఉపయోగించారు).


16 ఏళ్ళ పాటు పత్రికా రంగంలో పని చేశారు వేటూరి. ఆంధ్రపత్రికలో పనిచేసేప్పుడు ముళ్ళపూడి వెంకటరమణ, బాపులతో ఏర్పడిన సాన్నిహిత్యం, సినీ పరిశ్రమలోకి వచ్చాక వాళ్ళ ఫేవరేట్ ఆరుద్ర గారి తర్వాత ఎక్కువ పాటలు రాయించుకున్నది వేటూరితోనే. సినిమా సాహిత్యంలో ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నారో, సినిమాల్లోకి రాక ముందు కూడా ఆయన పని చేసిన జర్నలిజంలో కూడా అంతే గొప్ప పేరు తెచ్చుకున్నారు. మంచి హెడ్డింగులు పెట్టేవారని కూడా అప్పట్లో గొప్ప పేరుంది. తనలోని ప్రతిభని గుర్తించి, పత్రికా రంగంలో నుంచి సినిమా రంగంలోకి రమ్మని ఎన్టీరామారావు బలవంతం చేసినా, సినిమా రంగం పట్ల సదభిప్రాయం లేక తప్పించుకోడానికి ప్రయత్నించారట. ఆయన పట్టు బట్టి సినిమా రంగంలోకి తీసుకురాకపోయి ఉంటే ఎన్నో మంచి పాటలు మిస్ అయిపోయి ఉండేవాళ్లం.


కీరవాణి, వేటూరీ కలిసి ఎన్నో గొప్ప పాటలకి ప్రాణం పోశారు. "మాతృదేవోభవ", "అన్నమయ్య" సినిమాలలోని పాటలని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అన్నమయ్య తన జన్మ దినం గురించి తానే రాసుకున్నాడా అనిపించేలా అద్భుత పద ప్రయోగంతో అన్నమయ్య సినిమాకి టైటిల్ సాంగ్ రాశారు. గర్భాశయాన్ని గర్భాలయంగా ...ఏడు స్వరాలే ఏడు కొండలై వెలసిన కలియుగ విష్ణుపదం అంటూ చేసిన ప్రయోగాలు తనకే చెల్లాయి.


చివరి రోజుల్లో తనతో పాటలు రాయించుకునే అదృష్టం శేఖర్ కమ్ములకే దక్కింది. ఆ అదృష్టం మనది కూడా. 'ఆనంద్','గోదావరి' సినిమాల్లోని పాటలు సంగీత ప్రియులకు ఇప్పటికీ వీనుల విందు చేస్తున్నాయి. సప్తపది సినిమాలో 'పిల్లనగ్రోవికి నిలువెల్లా గాయాలు"... "సీతాకోక చిలుక' లో నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడి బొమ్మ ఆకట్టుబడికి తరించేను ఆ పట్టుపురుగు జన్మ ",'శంకరాభరణం' లో '"ఉచ్చ్వాస నిశ్వాసములు వాయులీనాలు స్పందించు నవ నాడులే వీణా గానాలు" .. "ఇలాంటి అపురూప పద విన్యాసాలు తన గీతాల్లో అడుగడుగునా కనిపిస్తాయి. తనకే సొంతమైన చిలిపి ప్రయోగాలెన్నో విన్న వారికి చక్కిలిగింతలు పెట్టేలా తన సాహిత్యంలో కనిపిస్తాయి.


చాలా మంది దృష్టిలో తను ప్రబంధ కవుల్లో చేమకూర వెంకట కవి లాంటి వాడు. నేల టిక్కట్టు నుంచి, బాల్కనీలో కూర్చునే ప్రేక్షకుడి వరకూ… పండితుడి నుంచి పామరుడి వరకు, ఎవరినైనా అలరించగల పాటలు రాశారు. తన కలానికి రెండు వైపులా పదునే. "చిలక కొట్టుడు కొడితే చిన్నదానా,ఓలమ్మీ తిక్క రేగిందా, అ అంటే అమలాపురం.. లాంటి మాస్ మసాలా పలికించగలరు. అయితే అంతకు మించి హృద్యమైన గీతాలను కూడా అందించారు..ఆధ్యాత్మిక సాహిత్యాన్నీ రాశారు. ఇందుకు తార్కాణం గా భక్త కన్నప్ప సినిమా లో శివ శివ శంకర పాటని చెప్పుకోవచ్చు. సంగీత,నృత్య,సాహిత్యాల సమన్వయంతో కైలాసాన కార్తీకాన శివ రూపాన్నీ, శివుని నయన త్రైలాస్యాన్నీ... సాగర సంగమంలో నాద వినోదంతో పరుగులెత్తించారు.


"చూడాలని ఉంది" సినిమాకు కలకత్తా నగర ప్రాశస్థ్యాన్ని వివరిస్తూ రాసిన “యమహానగరి కలకత్తాపురి” పాట ఎంత ప్రాచుర్యం పొందిందో చెప్పనవసరం లేదు.SP బాలు కూడా ఒకసారి ఈ పాట గురించి వివరిస్తూ ఈ పాటని బెంగాల్ వాళ్ళు తమ రాష్ట్ర గీతంగా పెట్టుకోవచ్చు అని అన్నారు. అలాగే ఇంద్ర సినిమా కోసం వారణాసి మీద రాసిన "భం భం బోలె" పాట క్రేజ్‌ నేటికీ తగ్గలేదు. అన్ని వర్గాల వారినే కాదు అన్ని వయసులవారిని కూడా మెప్పించే పాటలు ఎన్నో రాసారు .. "జగడజగడ జగడం"తడి కన్నులనే తుడిచిన నేస్తమా..ఒడిదుడుకులలో నిలిచినస్నేహమా...అంటూ కుర్రకారుకి నచ్చే పాటలు…." మాటే మంత్రమూ” ",విధాతనై వినిపించితిని" అని తల పండిన పాటలు కూడా రాశారు. 


తెలుగు భాషకి ప్రాచీన హోదా కల్పించ లేదని తనకు వచ్చిన జాతీయ అవార్డునే తిరిగి ఇవ్వబోయారంటే తెలుగుపై తనకున్న గౌరవం, భక్తికి ఇంతకంటే తార్కాణం ఏముంటుంది! అలాంటి తెలుగుతల్లి గర్వపడే ముద్దుబిడ్డ వేటూరికి అంతర్జాతీయ కవితా దినోత్సవం సందర్భంగా  ఏబీపీ దేశం తరఫున ఇదే మా నివాళి.