Chiranjeevi's Vishwambhara: మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం బింబిసార డైరెక్టర్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో 'విశ్వంభర' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇది పంచభూతాల కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ అడ్వెంచర్ మూవీ. చిరు కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిస్తున్నారు. దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి టార్గెట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్‌ లో జరిగిన 'విశ్వంభర' షెడ్యూల్ లో, కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. అలానే కోకాపేట‌లో వేసిన ఓ సెట్ లో పెళ్లి పాట షూట్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ నగర శివార్లలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో చిరంజీవి మీద బురద నీళ్లలో ఓ భారీ ఫైట్ సీన్ ను ప్లాన్ చేశారట దర్శకుడు వశిష్ఠ. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, చిరు ఎలాంటి డూప్ లేకుండా ఈ బురద సీక్వెన్స్ లో పాల్గొంటున్నారట. ఒంటి నిండా బురదతో ఇబ్బంది కలుగుతున్నా సరే, డూప్ ను పెట్టుకోకుండానే ఈ సన్నివేశాలను పూర్తి చేస్తున్నారట. 


ఇటీవలి కాలంలో సీనియర్ హీరోలే కాదు, యంగ్ హీరోలు సైతం సినిమాల కోసం ఎక్కువగా రిస్క్ తీసుకోవడం లేదు. ఇబ్బంది కలుగుతుందని భావించిన సన్నివేశాలను డూప్ ను పెట్టి లాగించేస్తున్నారు. ఇక్కడ చిరంజీవి కావాలనుకుంటే డూప్ ను పెట్టి బురద ఫైట్ సీన్స్ ను మేనేజ్‌ చేయగలరు. కానీ ఆయన మాత్రం తానే స్వయంగా ఆ సన్నివేశాలను పూర్తి చెయ్యాలని భావించి, బురదను కూడా లెక్కచేయకుండా బరిలోకి దిగుతున్నారని తెలుస్తోంది. 'విశ్వంభర' షూటింగ్ స్పాట్ కు సంబంధించిన ఫొటోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.


ఇంతకముందు 'వాల్తేరు వీరయ్య' సినిమాలో సముద్రం బ్యాక్ డ్రాప్ లో సన్నివేశాల కోసం గంటల తరబడి మురికి నీటిలో తడుస్తూ, షూటింగ్ పూర్తి చేశారు చిరంజీవి. ఇప్పుడు ఫ్యాన్స్ కు అసలైన మజాని అందించడానికి ఇతరుల సహాయం తీసుకోకుండానే, బురదలో ఫైట్ చెయ్యడానికి రెడీ అయ్యారు. ఏదేమైనా 68 ఏళ్ల వయసులో బిగ్ బాస్ ఇంకా ఆడియన్స్ ను అలరించడానికి దేనికైనా సిద్ధ పడటం గొప్ప విషయమనే చెప్పాలి. నిజంగా సినిమా పట్ల ఆయనకున్న అంకితభావానికి నిబద్ధతకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. చిన్న చిన్న షాట్స్ కే డూప్ ను పెట్టుకుంటున్న కుర్ర హీరోలంతా చిరుని చూసి ఎంతైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.


‘విశ్వంభర’ సినిమాలో చిరంజీవి సరసన త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. 'స్టాలిన్' తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న రెండో చిత్రమిది. మీనాక్షి చౌదరీ, ఈషా చావ్లా, సురభి, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా.. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025 జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.


Also Read: అనుష్క శెట్టి 50వ చిత్రానికి టైటిల్ ఫిక్స్ - ఇంట్రెస్టింగ్ గా ప్రీ లుక్ పోస్టర్!