Mr Bachchan Promotion In Hyderabad Metro Train: సినిమాను తెరకెక్కించడం ఎంత ముఖ్యమో, ఆ సినిమాను మార్కెటింగ్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇప్పటి వరకు వాల్ పోస్టర్లు, ఇంటర్వ్యూలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు మేకర్స్. ఇప్పుడు ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా సమ్ థింగ్ స్పెషల్ గా ఉండాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే సరికొత్త ఆలోచనలతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా మాస్ మహారాజా  చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ విషయంలోనూ ఇదే పంథాను అవలంభిస్తున్నారు. కొత్తగా ప్రమోషన్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సినిమాకు అట్రాక్ట్ చేస్తున్నారు.

    


హైదరాబాద్ మెట్రోలో ‘మిస్టర్ బచ్చన్’ ప్రమోషన్


‘మిస్టర్ బచ్చన్’ సినిమా ప్రమోషన్ కోసం చిత్రబృందం హైదరాబాద్ మెట్రో రైల్‌ను ఎంచుకుంది. ఇప్పటి వరకు రైలు ఎక్కగానే డోర్ దగ్గర నిలబడకూడదు, రైలు ఏస్టేషన్ వరకు వచ్చింది? ఏ స్టేషన్ లో డోర్ ఎటువైపు తెరుచుకుంటుంది? రైలులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలకు సంబంధించి అనౌన్స్ మెంట్స్ వచ్చేవి. ‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్ నేపథ్యంలో కొత్తగా రవితేజ వాయిస్ వచ్చి చేరింది. ఓవైపు మెట్రో సూచనలు వస్తూనే, మధ్య మధ్యలో రవితేజ తన సినిమాకు సంబంధించి ప్రమోషన్ కంటెంట్ నే ప్రయాణీకులతో పంచుకోనున్నారు.


తాజాగా మెట్రోలో వినిపించిన మాస్ మహారాజా వాయిస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నది. “మెట్రో ప్రయాణికులకు స్వాగతం. సుస్వాగతం. ఏంటి తమ్ముళ్లూ.. మెట్రోలో సీట్ దొరకలేదా? లేకపోతే కూర్చోగానే లేపేస్తున్నారా? ఏం పర్లేదు. నీ స్టేషన్ వచ్చేవరకు నీకు ఎనర్జీ ఇచ్చేలా మిస్టర్ బచ్చన్ నుంచి కొత్త సాంగ్ వచ్చింది. హ్యాపీగా నిల్చొని.. వినుకుంటూ వెళ్లిపోండి. ఇక్కడ సీట్ దొరకకపోయినా పర్లేదు. ఆగస్టు 15న థియేటర్‌కు వచ్చేయండి. అక్కడ సీట్ గ్యారెంటీ” అంటూ రవితేజ వాయిస్ వినిపించింది.






బాక్సాఫీస్ దగ్గర ‘మిస్టర్ బచ్చన్’కు గట్టి పోటీ


ప్రస్తుతం ‘మిస్టర్ బచ్చన్’ కు సంబంధించిన మెట్రో ప్రమోషనల్ కంటెంట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా బృందం ఆలోచనకు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ ప్రమోషన్ తో సినిమాకు మంచి హైప్ వస్తుందని అందరూ భావిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఎస్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తోంది.


పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, టి సిరీస్ ఫిల్మ్స్, పనోరోమా స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. సినిమాటోగ్రాఫర్ గా అయాంక బోస్ వ్యవహరిస్తున్నారు. ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.  'మిస్టర్ బచ్చన్' సినిమా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ 'రైడ్' చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతోంది. అటు ఈ సినిమాతో రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్’, కీర్తి సురేష్ మూవీ ‘రఘు తాత’, విక్రమ్ ‘తంగలాన్’ సినిమాలు పోటీ పడుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర ఏ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో చూడాలి.



Also Read: తొలి సినిమాకే అవార్డు, మూడో సినిమాకే రూ. 100 కోట్ల గ్రాస్‌ - #NBK109 డైరెక్టర్ బాబీ బర్త్‌డే గ్లింప్స్ చూశారా?