కన్నడ భామ రష్మిక మందన్న (Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘ఛలో‘ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ, తక్కువ కాలంలోనే వరుస విజయాలతో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. సౌత్ తో పాటు నార్త్ లోనూ సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. అంతేకాదు, ప్రస్తుతం ఈమె చేస్తున్న చిత్రాలన్నీ పాన్ ఇండియా రేంజిలో విడుదల కాబోతున్నాయి.


వరుస పాన్ ఇండియా చిత్రాల్లో రష్మిక


ప్రస్తుతం రష్మిక మందన్న అల్లు అర్జున్ తో కలిసి ‘పుష్ప: ది రూల్’ అనే చిత్రంలో నటిస్తోంది. ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించి మెప్పించిన రష్మిక, రెండో భాగంలో అద్భుతమైన పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్ రష్మిక పాత్రను మరింత జాగ్రత్తగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. తొలి భాగం దేశ వ్యాప్తంగా అద్భుత విజయాన్ని అందుకోవడంతో పాటు ఇటీవలే ఈ చిత్రంలో నటనకు గాను అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.


అటు బాలీవుడ్ లో రష్మిక ‘యానిమల్’ అనే సినిమా చేస్తోంది. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం కూడా పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కుతోంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. తాజాగా రష్మికకు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబినేషన్‌లో వస్తున్న ఓ పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ‘D51’ అనే వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాను అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు.  


క్రేజీ ప్రాజెక్టులలో హీరోయిన్ గా ఎంపిక


మరోవైపు తమిళ స్టార్ హీరో విక్రమ్‌ తో కలిసి ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. కేరళ వరదల నేపథ్యంలో వచ్చిన ‘2018’ అనే చిత్రానికి దర్శకత్వం వహించిన జూడ్‌ ఆంథోనీ జోసెఫ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.  లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా ఎంపిక అయినట్లు తెలుస్తోంది.  త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.  అటు ‘ఛవా’ అనే చారిత్రాత్మక పాన్ ఇండియా చిత్రంలోనూ ఆమె హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విక్కీ కౌశల్ కు జోడీగా ఆమె నటించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు చత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోంది. లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, దినేష్ విజన్ నిర్మించనున్నారు. ఇక తెలుగులో ‘రెయిన్ బో’ అనే లేడీ సెంట్రిక్ మూవీలోనూ ఆమె నటిస్తోంది.  మొత్తంగా వరుస క్రేజీ ప్రాజెక్టులతో దేశ వ్యాప్తంగా రష్మిక సత్తా చాటబోతోంది.






Read Also: ఆ కవర్లో రూ.100 కోట్ల చెక్? ‘జైలర్’ మూవీకి రజినీకాంత్ తీసుకున్న రెమ్యునరేషన్, అంతకుమించి?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial