Rana Daggubati: 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో సంచలన విజయం అందుకున్న హీరో రానా దగ్గుబాటి, డైరెక్టర్ తేజ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. వీరి కలయికలో రాబోతున్న ఈ సినిమా.. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ‘నేనే రాజు నెనే మంత్రి’ సినిమాలో రానా చేసిన జోగేంద్ర పాత్రకు మరింత బలంగా ఈ మూవీలోనూ ఆయన క్యారెక్టరైజేషన్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. తేజ ఈ చిత్రాన్ని పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.


నందమూరి బాలకృష్ణ హీరోగా ‘టాప్ హీరో’, ‘దేవుడు’, ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో ‘జంబలకిడి పంబ’, రాజేంద్రప్రసాద్ హీరోగా ‘ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్’ సినిమాలను నిర్మించిన గోపినాథ్ ఆచంట... రానా రాబోయే సినిమాను నిర్మించబోతున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ మలయాళం స్టార్ హీరో నటించబోతున్నట్టు సమాచారం. కాగా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.


గత కొన్ని రోజుల నుంచి రానా, తేజల కాంబో మరోసారి రిపీట్ కానుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. 'నేనే రాజు నేనే మంత్రి'లో కలిసి పనిచేసిన తర్వాత, దర్శకుడు తేజ, నటుడు రానా దగ్గుబాటి త్వరలో మరో చిత్రం కోసం జతకట్టనున్నారని టాక్ నడిచింది. దర్శకుడు తేజ తన అద్భుతమైన ప్రాజెక్ట్ కోసం రానాను సంప్రదించారని, ఆయన స్క్రిప్ట్‌ని ఇష్టపడి మూవీకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడంతో ఈ ప్రకటన వెలువడింది.


విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రానా, తేజాల మూవీకి 'రాక్షస రాజు'.. అనే టైటిల్‌ని పెట్టినట్లు కూడా ప్రచారం సాగింది. అంతే కాదు ఈ చిత్రంలో రానా ఓ ప్రముఖ నటుడితో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనున్నట్లు కొన్ని మీడియాలు కథనాలు ప్రచురించాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే రానా షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని రాసుకొచ్చాయి.


ఇటీవలే హీరో విక్టరీ వెంకటేష్ తో కలిసి 'రానా నాయుడు'లో వెబ్ సిరీస్ లో రానా కనిపించారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ రిలీజ్ కాగా.. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది. కానీ ఒకానొక సమయంలో పలు విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అడ‌ల్ట్ కంటెంట్ మోతాదుకు మించి ఉండ‌టం, రానా, వెంక‌టేష్ నోట బూతు డైలాగ్‌లు ప‌ల‌క‌డంతో నెటిజ‌న్‌లు రానా, వెంక‌టేష్ ల‌పై విమర్శ‌లు చేశారు. ఎన్ని విమ‌ర్శ‌లు ఎదురైనా `రానా నాయుడు` మాత్రం నెట్ ఫ్లిక్స్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించుకుంది.


ఈ సిరీస్ తర్వాత రానా మరో ప్రాజెక్ట్ నూ ప్రకటించలేదు. ఇటీవల ఆయనకు పలు అనారోగ్య కార‌ణాల వ‌ల్ల సినిమాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చిన రానా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటీ? ..ఎవ‌రితో చేయ‌బోతున్నాడు? అన్న‌ది ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిక‌రమైన అంశంగా మారింది. ఈ నేప‌థ్యంలో రానా అభిమానుల‌కు గుడ్ న్యూస్ వినిపించారు. త‌న నెక్స్ట్ సినిమాని సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు తేజ‌తో చేస్తున్నాని చెప్పేశారు. ఈ ప్రాజెక్ట్‌ని మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు.


Read Also : 'ఇండియన్ ఐడల్ సీజన్ 2' ఫినాలేకు బన్నీ - ప్రోమోతో అదరగొట్టిన అల్లు అర్జున్