Dipika Chikhlia About Ramayana Movie: ఇప్పటివరకు రామాయణం కథ ఆధారంగా ఎన్నో సినిమాలు, సీరియల్స్ తెరకెక్కాయి. కానీ వాటన్నింటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయాయి. అలాంటి వాటిలో రామానంద్ సాగర్ దర్శకత్వం వహించిన ‘రామాయణ్’ సీరియల్ కూడా ఒకటి. అప్పట్లో వారానికి ఒకసారి వచ్చే ఈ సీరియల్ కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూసేవాళ్లు. ఈ సీరియల్ ద్వారా రాముడు, లక్ష్మణుడు, సీతగా నటించిన నటీనటులకు మంచి గుర్తుంపు లభించింది. ఇక ‘రామాయణ్’లో సీత పాత్రలో ఆకట్టుకున్న దీపికా చిఖ్లియా.. నితిష్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ్’పై అనూహ్య కామెంట్స్ చేశారు.


మార్చేస్తున్నారు..


నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘రామాయణ్’లో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా కనిపించనున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపికా చిఖ్లియా.. ఈ ‘రామాయణ్’పై ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు ‘‘రామాయణాన్ని పదేపదే తెరకెక్కిస్తున్న మనుషులను చూసి నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. ఎందుకంటే వారు అలా చేయకూడదు. అందరూ కలిసి ఈ ఇతిహాసాన్ని ఇష్టం వచ్చినట్టుగా మార్చేస్తున్నారు. రామాయణాన్ని తెరకెక్కించిన ప్రతీసారి వారు అందులో ఏదో కొత్తదనాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక కొత్త కథ, కథలో కొత్త కోణం లేదా కొత్త లుక్.. ఇలా’’ అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు దీపికా.


వారి గురించి చెప్పండి..


తన అభిప్రాయాన్ని చెప్పడం కోసం ‘ఆదిపురుష్’ను ఉదాహరణగా తీసుకున్నారు దీపికా చిఖ్లియా. ‘‘సీతగా నటించిన కృతి సనన్‌కు శాటిన్ చీర కట్టారు. రావణుడిగా కనిపించడం కోసం సైఫ్ అలీ ఖాన్ లుక్కే మార్చేశారు. ఎందుకంటే వారు క్రియేటివ్‌గా కొత్తగా ఏదో చూపించాలని అనుకున్నారు. కానీ దానివల్లే రామాయణం ప్రభావం అనేది పూర్తిగా పోయింది. అందరూ ఈ రామాయణం చుట్టూ తిరగడం ఆపేస్తే బాగుంటుంది. రామాయణం కాకుండా ఇంకా చాలా కథలు ఉన్నాయి. దేశం కోసం పోరాడిన స్వాతంత్ర్య యోధుల గురించి మాట్లాడండి. హిస్టరీలో స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి గురించి చెప్పండి. రామాయణమే ఎందుకు’’ అంటూ ప్రశ్నించారు.


ముందే చెప్పలేం..


అలనాటి ‘రామాయణ్’లో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ కూడా రణబీర్ కపూర్ రాముడిగా నటించడంపై స్పందించారు. ‘‘రణబీర్ కపూర్ ఈ పాత్ర చేయగలడా లేదా అనేది సినిమా చూసిన తర్వాతే చెప్పగలుగుతాం. ముందే ఎవరి వల్ల ఏమైమవుతుంది అని చెప్పలేం కదా.. కానీ నాకు తెలిసినంత వరకు రణబీర్ కపూర్ మంచి నటుడు. మంచి మనిషి కూడా. తను రాముడిగా కచ్చితంగా బాగా చేస్తాడని నేను నమ్ముతున్నాను’’ అని తెలిపారు అరుణ్. మొత్తానికి ఎన్నో అంచనాల మధ్య ‘రామాయణ్’ను తెరకెక్కిస్తున్నారు నితీష్ తివారీ. అంతే కాకుండా ఈ సినిమాపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్‌ను కూడా మేకర్స్.. తమ ఔట్‌పుట్‌తోనే సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఇప్పటికే ‘రామాయణ్’ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.


Also Read: అయోధ్య ప్రజలు అప్పుడు రాముడికి, ఇప్పుడు మోదీకి వెన్నుపోటు పొడిచారు - రామాయణ్ నటుడి సంచలన పోస్ట్