Game Changer Update: 2024 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాలలో ‘గేమ్‌ ఛేంజర్‌’ ఒకటి. మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని షో మ్యాన్ శంకర్‌ షణ్ముగం డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చెర్రీ ఫస్ట్ లుక్ మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే చాలా కాలంగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని ఉత్సాహపరిచే ఓ ఆసక్తికరమైన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
మనకందిన సమాచారం ప్రకారం, ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. సంక్రాంతి సంబరాల కోసం మూడు రోజుల బ్రేక్ తీసుకున్న చిత్ర బృందం.. నిన్న బుధవారం తిరిగి చిత్రీకరణ ప్రారంభించింది. ఈ షూటింగ్ లో రామ్ చరణ్ తో పాటుగా సునీల్, రఘుబాబు వంటి పలువురు ప్రధాన నటీనటులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. జనవరి 21 - 22 వరకూ జరగనున్న ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. 


‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాని వీలైనంత త్వరగా ఫినిష్ చేసి బుచ్చిబాబు మూవీ షూటింగ్ లో పాల్గొనాలని భావిస్తున్నారట. ఇప్పటికే మేజర్ యాక్షన్ సీన్స్, సాంగ్స్ షూట్ కంప్లీట్ అయినందున.. మార్చి నెలాఖరుకల్లా తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ మొత్తాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఈ మేరకు శంకర్ సినిమా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్న చెర్రీ.. ఏప్రిల్ లో RC16 మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నారట.  


అన్నీ అనుకున్నట్లు జరిగి షూటింగ్ పూర్తయితే, ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాని ఈ ఏడాది చివరి త్రైమాసికంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కనున్న 'శతమానం భవతి' సీక్వెల్ ను 2025 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో, అంతకంటే ముందుగానే రామ్ చరణ్ - శంకర్ ల సినిమా వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. 2024 దసరా ఫెస్టివల్ సీజన్ లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్ రికార్డ్ స్థాయిలో అమ్ముడయ్యాయని అంటున్నారు. మరి థియేట్రికల్ రిలీజ్ పై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి. 


‘గేమ్‌ ఛేంజర్‌’ అనేది పవర్‌ ఫుల్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న శంకర్ మార్క్ పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్. ఇందులో చెర్రీ తండ్రీకొడులుగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. దర్శక నటుడు ఎస్‌.జె. సూర్య విలన్ గా నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, జయరామ్, సముద్రఖని, నవీన్‌ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 


ఇది శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ లో రూపొందే 50వ సినిమా. అందుకే దిల్‌ రాజు - శిరీష్ లు బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. తిరు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ రాస్తున్నారు. ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.


Also Read: హాలీవుడ్ హీరోలను తలదన్నేలా సోగ్గాడి స్టైలిష్ లుక్‌ - ఆర్జీవీ వీడియో వైరల్!