Rajinikanth travels to Kedarnath, Badrinath: వరుస సినిమాలతో బిజీగా ఉండే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సమయం దొరికితే చాలు ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్తారు. మానసిక ప్రశాంతంత కోసం హిమాలయాలకు వెళ్తారు. పలు ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. ప్రశాంత ప్రదేశాల్లో ధ్యానం, యోగా చేస్తూ ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారు. ఎప్పటి లాగే ఈసారి కూడా ఆయన తీర్థయాత్రల బాట పట్టారు. వేసవి తాపం నుంచి సేద తీరేందుకు, ఆలయాల సందర్శనకు వెళ్తున్నారు. ఈసారి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు బ‌ద్రీనాథ్, కేదార్‌నాథ్ ధామ్‌ల‌ను దర్శించబోతున్నారు.


హిమాలయ యాత్ర చేపట్టిన రజనీకాంత్


రీసెంట్ గా అబుదాబి యాత్రను పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చిన ఆయన ఇప్పుడు మళ్లీ హిమాలయ యాత్ర మొదలు పెట్టారు. అందులో భాగంగానే చెన్నై నుంచి డెహ్రాడూన్ కు వెళ్లారు. గతంలో అనేక హిమాలయ ఆధ్యాత్మిక యాత్రలు చేసిన ఆయన ఈసారి మరిన్ని పవిత్ర గుహలను సందర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. డెహ్రాడూన్ విమానాశ్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తన ఆధ్యాత్మిక యాత్ర గురించి చెప్పారు. "ప్రతి సంవత్సరం నేను నా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తాను. ఈ యాత్రతో కొత్త మానసిక అనుభూతిని పొందుతాను. ఈసారి కూడా నేను సరికొత్త అనుభవాలను పొందుతానని నేను నమ్ముతున్నాను" అని వెల్లడించారు. ఈ ఆధ్యాత్మిక పర్యటనలు తన మానసిక ఎదుగుదలకు ఎలా ఉపయోగపడతాయో రజనీకాంత్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికత ఎందుకు ముఖ్యం అనే విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు. “ప్రపంచం మొత్తానికి ఆధ్యాత్మికత అవసరం. ప్రతి మనిషికి ముఖ్యమైనది. ఆధ్యాత్మికంగా ఉండటం అంటే శాంతి, ప్రశాంతతను అనుభవించడం. దేవుడిని విశ్వసించడం అనేది ప్రతి ఒక్కరు చేయాలి” అని వివరించారు. 






ఇటీవల అబుదాబి BAPS హిందూ ఆలయాన్ని సందర్శించిన రజనీకాంత్


ఇటీవల, రజనీకాంత్ అబుదాబిలోని BAPS హిందూ ఆలయాన్ని సందర్శించారు. రజనీకాంత్ ఆలయంలో ఆశీర్వాదం తీసుకుంటున్న వీడియోలు, ఫోటోలను BAPS హిందూ మందిర్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతోంది. అబుదబి పర్యటనలో రజనీకాంత్‌కు యూఏఈ సాంస్కృతిక, పర్యాటక శాఖ గోల్డెన్ వీసా మంజూరు చేసింది. ఈ వీసాను అందించిన అబుదాబి ప్రభుత్వానికి, వీసా ఇచ్చేందుకు సహకరించిన అతడి స్నేహితుడు, లులు గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ MA యూసఫ్ అలీకి రజనీకాంత్ కృతజ్ఞతలు చెప్పారు. అబుదాబి ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మకమైన UAE గోల్డెన్ వీసాను స్వీకరించడం తనకు ఎంతో గౌరవంగా ఉందంటూ వీడియో రిలీజ్ చేశారు.


‘వేట్టయాన్’ సినిమా షూటింగ్ పూర్తి


ఇక ప్రస్తుతం రజనీకాంత్ TJ జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వేట్టయాన్’ అనే సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాలో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ కీలక పాత్రపోషిస్తున్నారు. పలు సినీ పరిశ్రమలకు చెందిన హీరోలు కూడా భాగం అవుతున్నారు. గతంలో ‘జైలర్’ షూటింగ్ అయ్యాక ఆధ్యాత్మిక యాత్ర చేపట్టిన రజనీకాంత్, ఇప్పుడు ‘వేట్టయాన్’ షూటింగ్ కంప్లీట్ కావడంతో మళ్లీ హిమాలయాల బాటపట్టారు.


Also Read: ‘గం గం గణేశా’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - ఆనంద్ దేవరకొండ ఖాతాలో మరో హిట్!