Allu Aravind Clarifying About Trolling Comments On Allu Arjun: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తనకు కొడుకు లాంటి వాడని.. అతనిపై ఉద్దేశపూర్వకంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) స్పష్టం చేశారు. ఇటీవల రామ్ చరణ్‌పై (Ram Charan) వ్యాఖ్యలు ట్రోల్ కాగా.. 'తండేల్' మూవీ పైరసీ అంశంపై నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన వివరణ ఇచ్చారు. 'ఇటీవల నేను చేసిన వ్యాఖ్యలపై నన్ను బాగా ట్రోల్ చేశారు. ఆ తర్వాత ఓ ప్రెస్ మీట్‌లో సీనియర్ విలేకరి నన్ను ప్రశ్నిస్తే.. అది సందర్భం కాదని దాటవేశాను. ఇప్పుడు పబ్లిక్‌గా ఓ విషయం చెప్పాలనుకుంటున్నా.



ఆ రోజు వేదిక మీదకు దిల్ రాజ్ గారిని ఆహ్వానించే క్రమంలో.. కష్టాలు, నష్టాలు, ఇన్‌కమ్ ట్యాక్స్ సోదాలు వంటివి ఎదుర్కొన్నారని చెబుతూ ఆ మాట వాడాల్సి వచ్చింది. ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదు. దానికి మెగా అభిమానులు చాలా బాధపడ్డారు. నన్ను బాగా ట్రోల్ చేశారు. వారందరికీ ఒకటే చెబుతున్నా. చరణ్ నాకు కొడుకులాంటివాడు. నాకున్న ఏకైక మేనల్లుడు. అతనికి నేను ఏకైక మేనమామను. చరణ్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. అది కేవలం పొరపాటున మాట్లాడాను. అలా మాట్లాడకుండా ఉండాల్సిందని ఆ తర్వాత అనిపించింది. మమ్మల్ని వదిలేయండి.' అని అల్లు అరవింద్ స్పష్టత ఇచ్చారు.


ట్రోలింగ్‌కు కారణం ఇదే..


కాగా, ఇటీవల 'తండేల్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దిల్ రాజును స్టేజీ మీదకు ఆహ్వానిస్తూ.. 'ఒక సినిమాను పైకి తీసుకెళ్లి మరొక సినిమాను కిందకు తీసుకెళ్లి, ఇన్ కమ్ ట్యాక్స్ పిలిచి.. వారం రోజుల్లోనే రకరకాలుగా చేశారు.' అంటూ అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. అనంతరం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. రామ్ చరణ్ 'చిరుత' యావరేజ్‌గా ఆడిందని.. తాను నిర్మించిన చరణ్ రెండో సినిమా 'మగధీర' బ్లాక్ బస్టర్ హిట్టయిందని చెప్పారు. దీంతో మెగా అభిమానులు దీనిపై ట్రోల్ చేయగా.. తాజాగా అల్లు అరవింద్ దీనిపై క్లారిటీ ఇచ్చారు.


Also Read: మూవీ లవర్స్‌కు నిజంగా 'వాలెంటైన్స్ డే' - అటు థియేటర్ ఇటు ఓటీటీల్లో ఈ సినిమాలు చూసి ఎంజాయ్ చేసేయండి!


'అక్కడి నుంచే 'తండేల్' లీక్'


ఫిలిం ఛాంబర్ చర్యల వల్ల కొన్నాళ్లుగా సినిమా పైరసీలు జరగడం లేదని.. గత 2 నెలల నుంచి పైరసీ భూతం విరుచుకుపడుతుందని అల్లు అరవింద్ అన్నారు. 'గేమ్ ఛేంజర్‌ను ఇలాగే ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. చాలా ప్రయత్నాలు చేసి లింక్స్ తొలగించాం. పైరసీపై పోరాటం చేసేందుకు ఫిలిం ఛాంబర్‌లో సెల్ ఏర్పాటు చేశాం. వాట్సాప్ గ్రూపుల్లో లింక్స్ ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇలా చేస్తోన్న వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్ అడ్మిన్లను గుర్తించాం. వారిని సమాచారాన్ని సైబర్ క్రైమ్ దృష్టికి తీసుకెళ్లాం. వారందిరినీ అరెస్ట్ చేయిస్తాం. అడ్మిన్లు జాగ్రత్తగా ఉండాలి. మీరు జైలుకు వెళ్లే అవకాశం ఉంది. కొంతమంది వెబ్‌సైట్స్‌లోనూ పెడుతున్నారు. పైరసీ సెల్‌ను ఇంకా బలోపేతం చేయాలి.' అని అల్లు అరవింద్ పేర్కొన్నారు.


'పైరసీ చేస్తే మెసేజ్ చేయండి'


'తండేల్' పైరసీపై నిర్మాత బన్నీ వాసు (Bunny Vas) స్పందించారు. యువత ఈ వలలో చిక్కుకోవద్దని.. క్రిమినల్ కేసు ఫైలైతే వెనక్కి తీసుకోలేమని చెప్పారు. 'కేబుల్ ఆపరేటర్లకు కూడా ఇదే మా హెచ్చరిక. మా సినిమా క్లిప్ ఒక్కటి ప్లే చేసినా కేసు పెడతాం. 'తండేల్' పైరసీ చేస్తే 9573225069 కు మెసేజ్ చేయండి. సాక్ష్యాలు ఉంటే కచ్చితంగా న్యాయపోరాటం చేస్తాం. మా సినిమా పైరసీ కాపీ 100 శాతం ఓవర్సీస్ నుంచే వచ్చింది. ఇది తమిళ ప్రింట్ రాగా దానికి తెలుగు ఆడియో కలిపారు. అది కూడా గుర్తించాం. ఆఫ్రికన్ దేశాల్లో ఉన్న ఐపీ అడ్రస్‌ల నుంచి ప్లే చేస్తున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించాం. పైరసీ చేసిన వాళ్లకీ, దాన్ని డౌన్ లోడ్ చేసుకున్న వాళ్లకీ కేసులు వర్తిస్తాయి. సామాన్య ప్రజలు ఇందులో చిక్కుకోవద్దు.' అని స్పష్టం చేశారు.


Also Read: 'మా ప్రమేయం లేని దానికి మమ్మల్ని బలి చేయొద్దు' - 'బాయ్ కాట్ లైలా'పై స్పందించిన మూవీ టీం, సారీ చెప్పిన హీరో విశ్వక్ సేన్