‘బాహుబలి’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అద్భుత గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ (Prabhas)ను ‘ఆదిపురుష్’ చిత్రం కోలుకోలేని దెబ్బకొట్టింది. దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినీ అభిమానులను పూర్తి స్థాయిలో డిజప్పాయింట్ చేసింది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. రామాయణం నుంచి ప్రేరణ పొంది తెరకెక్కించిన ఈ సినిమా అభిమానులను ఆకట్టుకోవడంలో ఘోరంగా విఫలమైంది. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్, రావణుడి గెటప్ సహా పలు అంశాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొంత మంది ఏకంగా చిత్రబృందంపై కేసులు పెట్టాలని న్యాయస్థానాలను సైతం ఆశ్రయించారు.


‘ఆదిపురుష్’ డిజాస్టర్ తో ప్రభాస్ కీలక నిర్ణయం


ఎన్నో అంచనాలు పెట్టుకున్న ‘ఆదిపురుష్’ సినిమా దారుణమైన ఫలితాన్ని ఇవ్వడంతో ప్రభాస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొంతకాలం పాటు బాలీవుడ్ దర్శకులతో పని చేయకూడదని ఆయన భావిస్తున్నారట. అంతేకాదు, బాలీవుడ్ దర్శకుల స్క్రిప్ట్‌లను వినడానికి కూడా ఆసక్తి చూపడం లేదట. ఇప్పటికే కమిట్ అయిన బాలీవుడ్ ప్రాజెక్టుల నుంచి కూడా తప్పుకున్నట్లు గుసగుస.


సిద్దార్థ్ ఆనంద్ తో మూవీ చేయాలని...


‘పఠాన్’ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌ దర్శకత్వంలో ప్రభాస్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో ఓ ప్రతిష్టాత్మక యాక్షన్ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలలో ఒకరైన నవీన్ యెర్నేని కొద్ది రోజుల క్రితం సిద్ధార్థ్ ఆనంద్‌ ను కలిశారు. ఈ సందర్భంగా ఓ సినిమా గురించి చర్చించారు. ప్రభాస్, హృతిక్ రోషన్ తో కలిసి ఓ సినిమా చేయాలని నిర్ణయించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌ కి ఈ సినిమా ల్యాండ్‌ మార్క్ ప్రాజెక్ట్ అవుతుందని అందరూ భావించారు. ‘పఠాన్’ ఘన విజయం సాధించినందుకు అభినందించేందుకు నవీన్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌ను కలిశారు. ఈ సందర్భంగానే భారీ యాక్షన్ సినిమా గురించి మాట్లాడారు.


సిద్దార్థ్ ఆనంద్ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న ప్రభాస్?


ప్రస్తుతం ‘ఫైటర్’ షూటింగ్ లో సిద్ధార్థ్ ఆనంద్ బిజీగా ఉన్నారు. ఇందులో ఇండియన్ సూపర్ మ్యాన్ హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా దీపికా పదుకొణె స్ర్కీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక  ప్రభాస్, హృతిక్ రోషన్ తో  కలిసి మల్టీస్టారర్‌ మూవీ చేయాలి అనుకున్నారు. కానీ, ప్రభాస్ ‘ఆదిపురుష్’తో తీవ్ర విమర్శలపాలు కావడంతో బాలీవుడ్ దర్శకులతో కలిసి పని చేయకూడదనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే సిద్ధార్థ్ ఆనంద్ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. సిద్ధార్థ్ ఆనంద్ గతంలో హృతిక్ రోషన్‌తో కలిసి ‘బ్యాంగ్ బ్యాంగ్’,  ‘వార్’ సినిమాలు చేశాడు. ఈ రెండు మూవీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ప్రభాస్,  హృతిక్ రోషన్ మల్టీస్టారర్ కల సాకారమై ఉంటే, భారతీయ సినిమా పరిశ్రమలో ఎన్నో సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉండేది. కానీ, ‘ఆదిపురుష్’ రిజల్ట్ తో  ప్రభాస్ బాలీవుడ్ దర్శకులకు నో చెప్తుతున్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో కలిసి ‘సలార్’, నాగ్ అశ్విన్ తో కలిసి ‘కల్కి 2898 ఏడీ’ సినిమా చేస్తున్నారు.


Read Also: భవిష్యత్తులో ఎవరూ దేవుడి పాత్రల్లో నటించకూడదా? ‘ఓ మై గాడ్ 2’, ‘ఆదిపురుష్‘ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial