ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ కు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘బాహుబలి’ సినిమాల తర్వాత ప్రభాస్ క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. దీంతో ఆయనకు సంబంధించి సోషల్ మీడియాలో ఎలాంటి వార్తలు వచ్చినా వెంటనే వైరల్ అవుతూ ఉంటాయి. అయితే ఒక్కోసారి ప్రభాస్ గురించి వచ్చిన పోస్ట్ లు, వార్తలపై ఆయన అభిమానులు తీవ్ర స్థాయిలో మండి పడుతుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో జరుగుతోంది.


సాధారణంగా సినిమా రంగంలో స్టార్ హీరోలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అప్పుడప్పుడూ ఫ్యాన్స్ మా హీరో గొప్పంటే మా హీరో గొప్పంటూ సోషల్ మీడియాలో చర్చలు పెడుతుంటారు. అయితే ఒక్కోసారి అవి శృతి మించుతాయి. అప్పుడు అవతలి హీరోల అభిమానులు స్పందించే తీరు దారుణంగా ఉంటుంది. అవి ఒక్కోసారి పరస్పర దాడుల వరకూ వెళ్తాయి. ఇటీవలే ఓ ట్విట్టర్ అకౌంట్ లో ప్రభాస్ దిగిన ఓ ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోలో ఓ పక్క సూపర్ స్టార్ రజనీకాంత్ మరోపక్క కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ మధ్యలో ప్రభాస్ ఉన్నారు. ఫోటోలో ప్రభాస్ మొఖం ఉబ్బినట్టు, కొంచె ఎబ్బెట్టుగా కనిపిస్తున్నారు. దానికి తోడు ‘ప్రభాస్ కు ఏమైంది?’ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ఇది చూసిన ప్రభాస్ అభిమానులు షాక్ అయ్యారు. అయితే కొంత మంది ఈ ఫోటో పై ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. అది మార్పింగ్ ఫోటో అని తేలింది. దీంతో ప్రభాస్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ పోస్ట్ చేసిన వారిపై విరుచుకుపడ్డారు. పాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్‌కు వస్తున్న క్రేజ్‌ను తట్టుకోలేకే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇంతకీ ఆ ఫోటో సూపర్ స్టార్ రజనీ కాంత్ నటిస్తోన్న ‘జైలర్’ సినిమాకు సంబంధించినది అని తేలింది. ఆ మూవీలో రజనీకాంత్ తో పాటు శివ రాజ్ కుమార్ కూడా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల మూవీ గురించి వారు చర్చిస్తూ ఉండగా తీసిన ఫోటో అని తెలిసింది. ఆ ఫోటోను మార్ఫింగ్ చేసి వారితో ఉన్న ఓ వ్యక్తి మొఖానికి ప్రభాస్ ఫేస్ అతికించారని క్లియర్ గా తెలుస్తోంది. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇలాంటి నెగిటివ్ ప్రచారాలు చేయుకండి అంటూ సీరియస్ కామెంట్లు చేస్తున్నారు. 


ఇక ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు. ఓకేసారి మూడు సినిమాలకు ఆయన పనిచేస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన రామాయణ ఇతిహాస చిత్రం ‘ఆదిపురుష్’ ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. జూన్ 16 న ఈ సినిమాను విడదల చేయనున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమా చేస్తున్నారు ప్రభాస్. ఇప్పటికే ఈ మూవీ 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని సమాచారం. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తోన్న సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుంతోంది. 


Read Also: మహేష్ బాబు, రాజమౌళి సినిమాపై కీరవాణి కీలక వ్యాఖ్యలు - ఫ్యాన్స్‌కు పండుగే!