'డియర్ కామ్రేడ్', 'పంచతంత్రం', 'పెదకాపు 1' చిత్రాలతో పాటు వెబ్ సిరీస్ 'ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్'లో కీలక పాత్రలు చేసిన వికాస్ ముప్పాల (Vikas Muppala) హీరోగా నటించిన సినిమా 'ప్లాట్' (Plot Telugu Movie). బిబిటి ఫిల్మ్స్ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఆయనకు జోడీగా గాయ‌త్రి గుప్తా నటించారు. కార్తీక్ సేపురు, త‌రుణ్ విఘ్నేశ్వ‌ర్ సేరుపుతో కలిసి దర్శకుడు భాను భ‌వ తార‌క నిర్మిస్తున్నారు. నవంబర్ 3న సినిమా విడుదల అవుతోంది. ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల ముఖ్య అతిథి ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగింది. 


భాను గురించి భవిష్యత్తులో మాట్లాడతారు : వేణు ఊడుగుల
ట్రైలర్ విడుదల తర్వాత దర్శకుడు వేణు ఊడుగుల మాట్లాడుతూ ''ఏడాది క్రితం ఈ సినిమా టీం నా దగ్గరకు వచ్చింది. అప్పుడు పోస్టర్‌ రిలీజ్ చేశాను. అది నాకు నచ్చింది. ఆ పోస్టర్ కొత్తగా, వైవిధ్యంగా అనిపించింది. ఇదొక ప్రయోగాత్మక చిత్రం. సహజంగా తీశారు. ట్రైలర్ చూస్తే కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లినట్టు అనిపిస్తుంది. దర్శకుడు భాను గురించి ప్రేక్షకులు అందరూ భవిష్యత్తులో మాట్లాడతారు. ఇటువంటి సినిమాలు థియేటర్లలో ఆడితే ఇంకా కొత్త కథలు వస్తాయి. దర్శక నిర్మాతలు ప్రయోగాలు చేయడానికి ముందుకొస్తారు'' అని అన్నారు. 


'ప్లాట్' ట్రైలర్ ఎలా ఉంది? కథేమిటి?
'ప్లాట్' సినిమాలో రాహుల్ పాత్రలో వికాస్ ముప్పాల నటించారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. రాహుల్ ఏ వ్యాపారం చేసినా నష్టాలే. ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి పలు వ్యాపారాలు చేసి చివరకు రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అక్కడ రాహుల్ పేరుతో ఉన్న మరొక వ్యక్తి పరిచయం అవుతాడు. కొన్నాళ్ళకు రాహుల్ పేరుతో మోసాలు జరిగాయనే విషయం బయటకు వస్తుంది. రాహుల్ ఫెయిల్యూర్ కోసం కొందరు ప్రయత్నిస్తారు. రాహుల్ ఫెయిల్ అవ్వాలని కోరుకున్నది ఎవరు? మోసాలు చేసిన రాహుల్ ఎవరు? ఏమైంది? అనేది మిగతా కథ.  


Also Read : 'యాత్ర 2'లో చంద్రబాబు నాయుడిగా ఎవరు చేస్తున్నారో తెలుసా? మహేష్...



''వేణు ఊడుగుల గారి 'నీదీ నాదీ ఒకే కథ' సినిమా నాలో ధైర్యాన్ని నింపింది. కరోనా సమయంలో నేను రాసిన కథను నా స్నేహితులు నమ్మడంతో సినిమా ఇక్కడి వరకు వచ్చింది. ప్రచార చిత్రాలు సినిమాపై ప్రేక్షకుల దృష్టి పడేలా చేశాయి. అందరూ థియేటర్లకు వచ్చి సినిమా చూస్తారని ఆశిస్తున్నాను'' అని దర్శక నిర్మాత భాను భవతారక అన్నారు. నవంబర్ 3న చిత్రాన్ని విడుదల చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకులు తరుణ్, హర్ష తదితరులు పాల్గొన్నారు.


Also Read చిరంజీవి కొత్త సినిమాకు క్రేజీ టైటిల్ - ఆ పేరు సినారే ఓ పుస్తకం కూడా రాశారండోయ్



వికాస్ ముప్పాల‌, గాయ‌త్రి గుప్తా జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సాజ్వి ప‌స‌ల‌, సంతోష్ నందివాడ‌, కిషోర్‌ ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు : విన‌య్‌, కళా దర్శకత్వం :  శివ కుమార్ మ‌చ్చ‌, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : సాయిరాం & రాజేంద్ర ప్ర‌సాద్‌, ఛాయాగ్రహణం : ర‌మ‌ణ్‌, సంగీతం : కార్తీక్ రోడ్రిగ్జ్‌, నిర్మాణ సంస్థ : బిబిటి ఫిల్మ్స్‌, నిర్మాత‌లు :  కార్తీక్ సేపురు - భాను భ‌వ తార‌క‌ - త‌రుణ్ విఘ్నేశ్వ‌ర్ సేరుపు, ర‌చ‌న‌ - పాటలు - ద‌ర్శ‌క‌త్వం : భాను భ‌వ తార‌క‌.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial