పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌ రెండో పెళ్లి గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అప్పట్లో ఓ వ్యక్తితో నిశ్చితార్థం చేసుకున్న రేణూ.. సోషల్ మీడియా వేదికగా ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. దీనిపై పవన్ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నెట్టింట పెద్ద ఎత్తున రచ్చ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత రేణూ కొత్త జీవితాన్ని ప్రారంభించడం గురించి ఎలాంటి సమాచారం లేదు. రేణూ ఎవరికీ తెలియకుండా మళ్ళీ పెళ్లి చేసుకుందా.. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకొని ఒంటరిగానే జీవిస్తోందా అన్నది క్లారిటీ లేదు. దీని గురించి రేణు కూడా ఎప్పుడూ మాట్లాడింది లేదు. ఐతే ఇన్నేళ్లకు ఆమె తన రెండో పెళ్లిపై నోరు విప్పింది. 


రేణూ దేశాయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను నిశ్చితార్థం చేసుకున్నది వాస్తవమే అని, రెండేళ్ల తర్వాత కచ్చితంగా మళ్ళీ పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ''ఎంగేజ్మెంట్ ఫోటో పెట్టిన తర్వాత ఏం జరిగిందనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటీ అందరికీ ఉంటుంది. నేను ఎంగేజ్మెంట్ చేసుకోడానికి రీజన్ ఉంది. పెళ్లి చేసుకుంటాను కానీ, ఇప్పుడు కాదు. అది రెండేళ్ల తర్వాత జరుగుతుంది. 100 శాతం కాదు, 1000 శాతం నేను మ్యారేజ్ చేసుకుంటాను. కాకపోతే ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు నా కూతురికి నా అవసరం ఎంతో ఉందని నేను భావిస్తున్నాను. ఒకవేళ పెళ్లి చేసుకుంటే నా కూతురితో తగినంత సమయం గడుపుతానో లేదో అనిపించింది. తనకి 15 - 16 ఏళ్ళు వచ్చి కాలేజీకి వెళ్తే అప్పుడు పెళ్లి చేసుకుంటాను. పెళ్లి ప్లాన్ క్యాన్సిల్ అవ్వలేదు.. పోస్ట్ పోన్ అయింది'' అని రేణూ చెప్పింది. 


Also Read: 'ఫ్యామిలీ స్టార్'గా మారిపోయిన రౌడీ బాయ్ - టైటిల్ గ్లింప్స్ అదుర్స్!


''పవన్ కళ్యాణ్ గురించి ఏమి మాట్లాడినా కాంట్రవర్షీ అవుతుందనేది నాకు అనుభవం అయింది. అందుకే ఆయన గురించి ఏమీ మాట్లాడను. మొన్న ఆయన పొలిటికల్ జర్నీ గురించి ఇన్ స్టాగ్రామ్ లో వీడియో పెట్టాను. నాకు అనిపించింది నేను మాట్లాడేసాను. అక్కడితో అయిపోయింది. దాని మీద ఛానల్స్ వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు, కానీ నేను స్పందించను. ఇప్పుడు నా ఫోకస్ అంతా 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా మీదే ఉంది'' అని రేణూ దేశాయ్ తెలిపింది. సినిమా రిలీజ్ అయ్యాక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గంటసేపు తన పర్సనల్ విషయాల గురించి మాట్లాడతానని, అన్ని డౌట్స్ క్లియర్ చేస్తారని నవ్వుతూ బదులిచ్చింది. 


కాగా, 'బద్రి' 'జానీ' సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన రేణూ దేశాయ్..  పవన్ కళ్యాణ్ ని ప్రేమించి కొన్నేళ్ల పాటు ఆయనతో సహజీవనం చేసింది. కుమారుడు అకీరా నందన్ జన్మించిన తర్వాత 2009 లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే వ్యక్తిగత కారణాలతో మూడేళ్ళ తర్వాత 2012లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తోంది రేణూ. అయితే రెండేళ్ల తర్వాత మరో పెళ్లి చేసుకుంటానని తాజాగా స్పష్టం చేసింది. ఇక 18 ఏళ్ల విరామం తర్వాత ఆమె నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ఇందులో గుర్రం జాషువా కుమార్తె డా. హేమలత లవణం పాత్రలో రేణూ నటించింది. 


Also Read: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ప్రతిష్టాత్మక 'ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్'లో తారక్‌కు చోటు!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial