యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరో అరుదైన గుర్తింపు సాధించారు. ఆస్కార్ 'యాక్టర్స్ బ్రాంచ్‌'లో సభ్యత్వం పొందారు. ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ కొత్త మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్‌లో తారక్ స్థానం చోటు సంపాదించారు. RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన తారక్.. ఇప్పుడు ప్రతిష్టాత్మక అకాడమీ యాక్టర్స్ లిస్టులో చేరిపోయారు. ఈ విషయాన్ని అకాడమీ అధికారికంగా ప్రకటించింది. ఎన్టీఆర్ కి కూడా ఆహ్వానం అందిస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది.


ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ కోసం అకాడమీ ప్రపంచవ్యాప్తంగా అగ్ర నటులను స్వాగతించగా.. వారిలో ఎన్టీఆర్ ఒకరిగా నిలిచారు. గురువారం (అక్టోబర్ 19) తెల్లవారుజామున అకాడమీ తన కొత్త మెంబర్స్ యాక్టర్స్ లిస్ట్ ని అనౌన్స్ చేసింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ ఏడాది సభ్యులుగా చేరిన ఐదుగురు నటుల పేర్లను వెల్లడించింది. ఈ జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటుగా కే హుయ్ క్వాన్, మార్షా స్టెఫానీ బ్లేక్, కెర్రీ కాండన్, రోసా సలాజర్ వంటి ఇతర నటీనటులకు చోటు కల్పిస్తున్నట్లు తెలియజేశారు. 






దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు, గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని 'నాటు నాటు' పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో వందేళ్ల ఇండియన్ సినిమాకి 'ఆస్కార్ అవార్డ్' కలను సాకారం చేసిపెట్టింది. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు తమ అద్భుతమైన నటనతో డ్యాన్స్ లతో ప్రసంశలు అందుకున్నారు. ఇద్దరు హీరోలు పలు అంతర్జాతీయ వేదికపై మెరవడమే కాదు, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ తో పాటుగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (HCA) అవార్డ్స్ లోనూ సత్తా చాటారు. ఈ క్రమంలో ఇప్పుడు లేటెస్టుగా తారక్ ప్రతిష్టాత్మక 'అకాడమీ యాక్టర్స్ బ్రాంచ్‌' జాబితాలో చేరిపోయారు. ఇది నిజంగా తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు, ఇండియన్ సినిమాకే గర్వకారణమైన విషయమని చెప్పాలి. 


అకాడమీ యాక్టర్స్ బ్రాంచ్‌లో సభ్యత్వానికి ఆహ్వానం కోసం అభ్యర్థి తప్పనిసరిగా కనీసం మూడు థియేట్రికల్ ఫీచర్ ఫిల్మ్ లలో నటించి ఉండాలి. వాటిలో ఒకటి గత ఐదు సంవత్సరాలల్లో విడుదలై ఉండాలి. అది అకాడమీ ఉన్నత ప్రమాణాలను ప్రతిబింబించే క్యాలిబర్ కలిగి ఉండాలి. అలానే ఏదొక క్యాటగిరీలో కచ్చితంగా అకాడమీ అవార్డుకు నామినేట్ చేసుండాలి. ఇలా అన్ని అర్హతలు కలిగిన సినిమాల్లో అత్యుత్తమ నటన కనబరిచిన నటీనటులకు మాత్రమే 'ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్' లో చోటు కల్పిస్తారు. అలాంటి అరుదైన గుర్తింపుకు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎంపికకావడం విశేషం. 


ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం 'దేవర' అనే యాక్షన్ మూవీలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. దీని తర్వాత తారక్ 'వార్ 2' సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ లో హృతిక్ రోషన్‌తో కలిసి నటించనున్నారు. ఇదే క్రమంలో KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ యాక్షన్ థ్రిల్లర్ చేయనున్నారు. 




ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial