Ghilli Re Release: 20 ఏళ్ల క్రితం విడుదలయినా కూడా ఇప్పటికీ తమిళ ప్రేక్షకులు మర్చిపోలేని సినిమాలు లిస్ట్‌లో కచ్చితంగా ‘గిల్లి’ కూడా ఉంటుంది. తెలుగులో మహేశ్ బాబు నటించిన ‘ఒక్కడు’ రీమేకే ‘గిల్లి’. ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో విజయ్, త్రిష హీరోహీరోయిన్లుగా నటించారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత మళ్లీ ఈ మూవీ రీ రిలీజ్ అయ్యింది. ‘గిల్లి’ని థియేటర్లలో చూడడానికి ప్రేక్షకులు భారీ సంఖ్యలో రావడంతో కలెక్షన్స్ విషయంలో రికార్డులు సృష్టిస్తోంది ఈ సినిమా. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఎక్కడ చూసినా ‘గిల్లి’ గురించే హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఈ మూవీ గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది. 


కమిట్మెంట్స్ వల్లే..


‘ఒక్కడు’లో మహేశ్ బాబు, భూమిక జంటకు ఎన్ని మార్కులు పడ్డాయో.. ‘గిల్లి’లో విజయ్, త్రిష జోడీకి కూడా అన్నే మార్కులు పడ్డాయి. విజయ్ కెరీర్‌లోనే ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అయ్యింది. అంతే కాకుండా ఈ సినిమా తర్వాతే త్రిషకు కూడా స్టార్ హీరోలతో నటించే అవకాశాలు పెరిగాయి. అయితే ముందుగా ‘గిల్లి’ సినిమా కోసం హీరోహీరోయిన్లుగా విజయ్, త్రిషలను అనుకోలేదట దర్శకుడు ధరణి. ముందుగా ‘గిల్లి’లో హీరోగా విజయ్ స్థానంలో విక్రమ్‌ను అనుకున్నారట. ఇక త్రిష స్థానంలో జ్యోతిక హీరోయిన్‌గా చేస్తే బాగుంటుందని చర్చలు కూడా జరిపారట. కానీ విక్రమ్, జ్యోతికలకు అప్పటికే పలు కమిట్మెంట్స్ ఉండడంతో ‘గిల్లి’ని రిజెక్ట్ చేశారట.


త్రిష హ్యాపీ..


‘గిల్లి’ మూవీ విజయ్, త్రిషల కెరీర్‌లో మర్చిపోలేని సినిమాగా నిలిచిపోయింది. కానీ విక్రమ్, జ్యోతిక ఆ అవకాశాన్ని వదులుకున్నారు కాబట్టే ఈ మూవీ వీరి చేతికి వచ్చిందనే వార్త ప్రస్తుతం కోలీవుడ్‌లో వైరల్ అవుతోంది. ‘గిల్లి’లో విజయ్, త్రిషల కెమిస్ట్రీకి మేకర్స్ ఫిదా అవ్వడంతో వీరు మరెన్నో సినిమాల్లో కలిసి నటించే అవకాశం లభించింది. ఇక ‘గిల్లి’ రీ రిలీజ్ హడావిడిని చూసిన త్రిష.. స్వయంగా తన సోషల్ మీడియాలో దీని గురించి పోస్ట్ కూడా షేర్ చేసింది. ఈ మూవీ విడుదలయ్యి 20 ఏళ్లు అయ్యిందని, మళ్లీ అంతా కొత్తగా చూసినట్టు ఉందని సంతోషం వ్యక్తం చేసింది. ఇక ఎన్నో ఏళ్ల తర్వాత విజయ్, త్రిష కలిసి మళ్లీ లోకేశ్ కనకరాజ్ తెరకెక్కించిన ‘లియో’లో కలిసి నటించారు.


ఓ రేంజ్ కలెక్షన్స్..


ప్రస్తుతం టాలీవుడ్‌లో మాత్రమే రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది అనుకుంటుండగా.. తమిళంలో ‘గిల్లి’ కూడా రీ రిలీజ్ అయ్యి.. ఓ రేంజ్‌లో కలెక్షన్స్‌ను రాబడుతోంది. ఈ రీ రిలీజ్‌ల విషయంలో కేవలం మొదటిరోజు మాత్రమే థియేటర్లలో సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. కానీ ‘గిల్లి’ విషయంలో అలా జరగలేదు. వరుసగా మూడు రోజులు ప్రేక్షకులు.. ‘గిల్లి’ రీ రిలీజ్ కోసం థియేటర్లకు వెళ్లారు. దీంతో కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. ఇలాగే కంటిన్యూ అయితే కచ్చితంగా ఈ మూవీ రూ.25 నుంచి 30 కోట్లు కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



Also Read: ‘టైటానిక్’కే పోటీ ఇస్తున్న విజయ్, త్రిషాల 'గిల్లి' మూవీ - రీ రిలీజ్‌లో కళ్లు చెదిరే కలెక్షన్లు