నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘దసరా’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది. మార్చి 30న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా నాని మీడియాతో మాట్లాడుతూ ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన అనుభవాలను పంచుకున్నారు. తెలంగాణలోని ఓ గ్రామం వీర్లపల్లి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో హీరో నాని సింగరేణి లోకల్‌ రైళ్లలో బొగ్గును దొంగిలించే యువకుడి పాత్రలో కనిపించబోతున్నారు. చిత్రీకరణ సమయంలో తనతో పాటు యూనిట్ సభ్యులంతా కూడా చాలా కష్టపడ్డారని నాని పేర్కొన్నారు.


ప్రమోషన్ కార్యక్రమాల్లో నాని మాట్లాడుతూ.. నా మేకప్ కోసం ప్రతి రోజు చాలా సమయం కేటాయించాల్సి వచ్చేది. షూటింగ్‌ సమయంలో అత్యంత వేడి ఉండటం వల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాం. సెట్ లో  రెండు సార్లు పెద్ద ప్రమాదాల నుంచి బయట పడ్డాను. కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కోసం రిస్క్‌ తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో పడ్డ కష్టానికి ప్రతిఫలంగా ఇప్పుడు ఒక మంచి సినిమా రూపొంది.. మీ ముందుకు రాబోతుందన్నారు.


నాని ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్ చేస్తున్నారు. ఉత్తర భారతంలో ట్రైలర్ విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారనే సమాచారం అందుతోంది. నాని గతంలో ‘శ్యామ్‌ సింగరాయ్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సందడి చేయాలని భావించినప్పటికీ ఆ సమయంలో కొన్ని కారణాల వల్ల సాధ్యం కాలేదు. ఈసారి కచ్చితంగా ‘దసరా’ సినిమాతో దేశవ్యాప్తంగా నాని పాపులారిటీ దక్కించుకునే అవకాశాలున్నాయని నాని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో ‘దసరా’ ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీగా నిలుస్తుందని టీజర్ విడుదల సందర్భంగా నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 


గతేడాది విడుదలైన భారీ విజయాలను సొంతం చేసుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీఎఫ్‌2’, ‘కాంతార’, ‘పొన్నియన్ సెల్వన్‌’ సినిమాల మాదిరిగా ‘దసరా’ సినిమా ఈ ఏడాది ఎక్కువగా మాట్లాడుకునే సినిమా అవుతుందంటూ నాని చాలా నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాను రూపొందించిన శ్రీకాంత్‌ ఓదెల పేరు ముందు ముందు ఇండస్ట్రీలో మారుమోగనుందని నాని అన్నారు. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


‘దసరా’పై మొదటి నుండి భారీ అంచనాలు...


 ‘దసరా’ కచ్చితంగా ఓ సెన్సేషన్ హిట్ కొడుతుందని నాని ఇంటర్వ్యూల్లో చెబుతున్నారు. ‘దసరా’ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడంలో యూనిట్‌ సభ్యులు సఫలం అయ్యారు. ఫలితంగా నాని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు అనడంలో సందేహం లేదు.


ఈ సినిమాలో నానికి జోడీగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ ఇద్దరి లుక్‌ కూడా ప్రేక్షకుల్లో సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెంచేశాయి. నాని, కీర్తి సురేష్ గతంలో ‘నేను లోకల్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత హిట్ జోడీ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


Also Read గుండెల్లో దేశాన్ని నింపుకొని, భారతీయుడిగా ఆస్కార్స్ రెడ్ కార్పెట్ మీద నడుస్తా - ఎన్టీఆర్