Nagarjuna: ప్రస్తుతం అంతటా ఐపీఎల్ ఫీవర్ నడుస్తుండగా.. సినీ సెలబ్రిటీలు సైతం తమ సినిమా ప్రమోషన్స్ కోసం స్పోర్ట్స్ ఛానెల్‌నే వేదికగా ఎంచుకుంటున్నారు. అలా తాజాగా ‘కుబేర’ మూవీ నుంచి నాగార్జున ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం కోసం స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌ను ఎంచుకున్నారు మేకర్స్. ఇక ఫస్ట్ లుక్‌‌ను విడుదల చేసిన తర్వాత పలువురు క్రికెట్ సెలబ్రిటీలతో నాగార్జున ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానలిచ్చారు. అందులో భాగంగానే మాజీ ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో కూడా నాగ్ ముచ్చటించారు.


క్రికెట్‌లో అఖిల్ సూపర్..


ముందుగా ఇండియన్ సినిమాలో నాగార్జునను సూపర్ స్టార్ అంటూ ప్రశంసించింది మిథాలీ రాజ్. ఆ తర్వాత క్రికెట్‌లో తన కుమారుడు అఖిల్ ఏ రేంజ్‌లో పాపులారిటీ సాధించిందో కూడా గుర్తుచేసింది. తరచుగా జరిగే సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో క్రికెటర్‌గా తన సత్తా చాటుకున్నాడు అక్కినేని అఖిల్. అయితే దీనికోసం అఖిల్.. ఆస్ట్రేలియాలో ట్రైనింగ్ తీసుకున్నాడని కూడా మిథాలీ గుర్తుచేసింది. చివరిగా ఒకవేళ సినిమాల్లో కెరీర్‌ను ఏర్పాటు చేసుకోకపోయింటే, స్పోర్ట్స్‌లోకి ఎంటర్ అవ్వాలి అనుకొని ఉండుంటే ఏ స్పోర్ట్స్‌లోకి ఎంటర్ అయ్యేవాళ్లు అని నాగార్జునను ప్రశ్నించింది మిథాలీ. నాగార్జున.. ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చేముందు మిథాలీని మంచి క్రికెటర్ అంటూ ప్రశంసించారు.


ఎక్కువ మల్టీ స్టారర్స్..


తను యాక్టర్ కాకపోయింటే ఏ స్పోర్ట్స్‌లో కెరీర్‌ను ఎంచుకునేవారు అనే ప్రశ్నకు క్రికెట్ అని ఆలోచించకుండా సమాధానం ఇచ్చారు నాగార్జున. ప్రస్తుతం నాగ్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలతో కలిసి మల్టీ స్టారర్ చేసే విషయంలో నాగార్జున ఈమధ్య ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే తమిళ హీరో ధనుష్ నటిస్తున్న ‘కుబేర’లో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు నాగ్. ఇది దాదాపుగా ధనుష్, నాగార్జునల మల్టీ స్టారర్‌లాగానే ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న ‘కుబేర’ నుంచి తాజాగా నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వగా అందులో ఆయన చాలా కూల్‌గా, హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తున్నారు. 


రజినీకాంత్‌తో సినిమా..


తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న మూవీలో కూడా నాగార్జున ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. రజినీకాంత్, లోకేశ్ కనకరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘కూలీ’లో పలువురు సెలబ్రిటీలను గెస్ట్ రోల్స్ కోసం సంప్రదిస్తున్నారని, అందులో నాగార్జున కూడా ఒక గెస్ట్ రోల్ చేసే అవకాశం ఉందని కొన్నిరోజల క్రితమే వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో దాదాపు 30 ఏళ్ల తర్వాత నాగార్జున, రజినీకాంత్ కలిసి నటిస్తున్నారని అటు కోలీవుడ్ ఫ్యాన్స్, ఇటు టాలీవుడ్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇవి కాకుండా నాగార్జున సోలో హీరోగా నటిస్తున్న అప్‌కమింగ్ సినిమాల గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.



Also Read: 'గంగోత్రి' హిట్‌, కానీ అందంగా లేనని ఆఫర్స్ రాలేదు - ఏడాది పాటు రోజు ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో తిరిగే వాడిని