'ది ఘోస్ట్' సినిమా ప్లాప్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న నాగార్జున, రీసెంట్ గా తన బర్త్ డే సందర్భంగా ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు  కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహించబోతున్నట్లు వెల్లడించారు. ‘నా సామిరంగ’ అనే పేరుతో ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలిపారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలయ్యింది. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని నాగార్జన భావిస్తున్నారట.  


మలయాళ మూవీ ఆధారంగా తెరకెక్కుతున్న ‘నా సామిరంగ’


మలయాళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న 'పోరింజు మారియం జోసే' అనే సినిమా ఆధారంగా ‘నా సామిరంగ’ సినిమాను తెరకెక్కిస్తున్నారట. మూలకథ మారకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా కథలో మార్పులు చేస్తున్నారట. తాజాగా  ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో మొదలయ్యింది. తొలుత ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరించారట. స్టంట్‌ మాస్టర్ వెంకట్‌ ఈ యాక్షన్‌ సీన్లను డిజైన్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నాగార్జున గతంలో ఎప్పుడూ లేని విధంగా ఊరమాస్ పాత్రలో కనిపించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.


శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసేలా మేకర్స్ ప్లాన్


ఈ సినిమాను వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి వచ్చే సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట మేకర్స్. నాగార్జున గత కొంతకాలంగా సంక్రాంతి బరిలో నిలస్తూ, చక్కటి విజయాలను అందుకుంటున్నారు. ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘బంగార్రాజు’లాంటి సినిమాలు కూడా శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేయడంతో పాటు సంక్రాంతి బరిలో దించి సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు 'నా సామిరంగ'ను కూడా వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసి సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమాతో విజయాన్ని అందుకోవాలని భావిస్తున్నారట.  ప్రస్తుతం నాగార్జున లిస్టులో మరికొన్ని కథలు ఉన్నా, ఈ సినిమాను ముందుగా కంప్లీట్ చేయాలని భావిస్తున్నారట.   ఎక్కువలో ఎక్కువ  రెండు నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాలి అనుకుంటున్నారట దర్శకుడు బిన్నీ. ‘ది ఘోస్ట్’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న నాగార్జున, ఈ చిత్రంతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని భావిస్తున్నారట.        


ఆకట్టుకున్న ఫస్ట్ లుక్, గ్లింప్స్


ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. నాగార్జున బర్త్ డే సందర్భంగా ఈ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో నాగార్జున ఊర మాస్ లుక్ లో కనిపించారు. పగిలిన బల్డ్ ఫిలమెంట్ తో బీడీ కాల్చుకుంటూ రఫ్ లుక్ తో దర్శనం ఇచ్చాడు. ఈసారి పండక్కి ‘నా సామిరంగ’ అంటూ గర్జిస్తాడు.  ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాజల్ హీరోయిన్ గా ఓకే అయినట్లు తెలుస్తోంది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా ఈ చిత్రంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాలకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చే ఏడాది(2024) సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. 


Read Also: ‘జవాన్’తో పోటీనా? తప్పు చేస్తున్నారని భయపెట్టారు- కానీ, అద్భుతం జరిగింది- నవీన్ పొలిశెట్టి


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial