ఆస్కార్ అవార్డు రాకతో ‘ఆర్ఆర్ఆర్’ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది. అమెరికాలో జరిగిన 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో ‘నాటు నాటు’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు వరించింది. దీంతో భారత ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మూవీ టీమ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికీ ‘నాటు నాటు’ పాట హవా కొనసాగుతూనే ఉంది. ఎక్కడ చూసినా ఈ పాట ట్యూన్ వినిపిస్తుంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరితోనూ స్టెప్పులేయిస్తోంది ‘నాటు నాటు’ పాట. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఈ పాటపై స్పందించారు. తన రెండేళ్ల చిన్న కొడుకు జహంగీర్ ‘నాటు నాటు’ పాటకు బిగ్ ఫ్యాన్ అయిపోయాడని చెప్పారు. 


ఇప్పటికే ఈ ‘నాటు నాటు’ పాటను ఇటు ఇండియాతో పాటు విదేశీయులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సాధారణ ప్రజల వద్ద నుంచి సెలబ్రెటీల వరకూ అందరూ ఈ పాటకు ఫిదా అయిపోయారు. ఈ నేపథ్యంలో కరీనా కపూర్ కూడా ఈ పాటపై స్పందించారు. ‘నాటు నాటు’ పాటను తన చిన్న కొడుకు జహంగీర్ ఎన్నిసార్లు పెట్టినా వింటూనే ఉంటాడని చెప్పారు. ఈ పాట పెట్టకపోతే తను అన్నం కూడా తినను అని మారం చేస్తుంటాడట. అంతలా ఈ పాటకు ఫ్యాన్ అయిపోయాడని చెప్పుకొచ్చారు కరీనా. అందులోనూ హిందీ వెర్షన్ పాట పెడితే అస్సలు వినడట, కేవలం తెలుగు లిరిక్స్ ఉన్న పాటనే బాగా ఎంజాయ్ చేస్తాడని చెప్పారు. తెలుగు తప్ప ఏ భాష పెట్టినా వద్దని మారం చేస్తాడట. ఇటీవల బాలీవుడ్ లో ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘నాటు నాటు’ పాటపై తన అభిప్రాయాన్ని ఇలా వెల్లడించారు కరీనా. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారట. 


దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఈ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తెరకెకక్కింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా వందల కోట్ల వసూళ్లు సాధించింది. ఇప్పటికీ కొన్ని చోట్ల థియేట్రికల్ రన్ అవుతూనే ఉంది. ఇటీవల జరిగిన 95వ ఆస్కార్స్ లో ఈ మూవీలో ‘నాటు నాటు’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును దక్కించుకుంది. ఈ ‘నాటు నాటు’ సాంగ్ ను కంపోజ్ చేసిన కీరవాణి, సాహిత్యం సమకూర్చిన చంద్రబోస్ ఆస్కార్ వేదికపై అవార్డులను అందుకున్నారు. అంతే కాదు అంతర్జాతీయ వేదికపై ఈ పాటను లైవ్ ప్రదర్శన చేశారు కూడా. ఈ ప్రదర్శనతో లాస్ ఏంజెలెస్ లోని డాల్బీ థియేటర్ దద్దరిల్లింది. ఆస్కార్ అవార్డుల వేడుక తర్వాత మూవీ టీమ్ తిరిగి హైదరాబాద్ చేరుకుంది. త్వరలో టాలీవుడ్ అంతా కలసి ఈ విజయాన్ని సంబరంలా జరుపుకోనున్నారు. 


కరీనా కపూర్ లాంటి బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా తెలుగు సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇది ఇండియన్ సినిమా విజయం అంటు కొనియాడుతున్నారు. ఇక కరీనా కపూర్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. 2012లో కరీనా కపూర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ని పెళ్లి చేసుకున్నారు. కరీనా-సైఫ్ దంపతులకు ఇద్దరు కుమారులు. 2016లో తైమూర్, 2021 లో జహంగీర్ జన్మించారు. సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం పలు సినిమాల్లో బిజీగా ఉన్నారు. 


Read Also: మహేష్ బాబు, రాజమౌళి సినిమాపై కీరవాణి కీలక వ్యాఖ్యలు - ఫ్యాన్స్‌కు పండుగే!