'శ్రీమంతుడు' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో మైత్రీ మూవీ మేకర్స్ ప్రయాణం ప్రారంభమైంది. తొలి అడుగుతో మంచి విజయాన్ని అందుకుంది. తొలి సినిమా తర్వాత 'జనతా గ్యారేజ్', 'రంగస్థలం' చిత్రాలతో మలి అడుగులూ విజయవంతంగా వేసింది. మధ్యలో కొన్ని ఫ్లాపులు ఎదురైనా 'ఉప్పెన', 'పుష్ప', 'సర్కారు వారి పాట' వంటి విజయాలు వచ్చాయి. 


చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి'... సంక్రాంతికి ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు విడుదల చేసి, కమర్షియల్ విజయాలు అందుకున్న ఘనత కూడా మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల సొంతం. అయితే, సంక్రాంతికి విడుదలైన తర్వాత నుంచి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. రెండు మూడు రోజులుగా అయితే దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. 


ఐటీ రైడ్స్ ఎఫెక్ట్ బలంగా పడుతోందని...
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఆఫీసుల్లో, మైత్రీ అధినేతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలికి సన్నిహితుడైన దర్శకుడు సుకుమార్, ఆయన సన్నిహితులకు సంబంధించిన ఇళ్లల్లో బుధవారం ఉదయం నుంచి ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించడం మొదలు పెట్టారు. మైత్రీ సంస్థపై ఐటీ రైడ్స్ చిత్రసీమకు షాక్ ఇచ్చాయి. అంత కంటే పెద్ద షాక్, ఆ సంస్థకు తగిలింది. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో భారీ ఎత్తున నిర్మిస్తున్న 'పుష్ప 2' చిత్రీకరణను అర్థాంతరంగా వాయిదా వేయాల్సి వచ్చింది. దీని వల్ల నిర్మాతలపై ఆర్థికంగా బోల్డంత భారం పడుతుందని చిత్ర పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఐటీ రైడ్స్ కారణంగా పడిన మొదటి దెబ్బ ఇది. 


పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో 'ఉస్తాద్ భగత్ సింగ్', విజయ్ దేవరకొండ & సమంత జంటగా 'ఖుషి' సినిమాలు సైతం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్నవే. ప్రస్తుతానికి ఆ సినిమాల షెడ్యూల్స్ జరగడం లేదు. మరి కొత్త షెడ్యూల్స్ మీద ఎఫెక్ట్ ఉంటుందా? లేదా? అనేది రెండు మూడు రోజులు ఆగితే గానీ తెలియదు. సమంత అనారోగ్యం కారణంగా 'ఖుషి' కొన్నాళ్ళు వాయిదా పడితే... ఎప్పుడో ప్రారంభం కావాల్సిన 'ఉస్తాద్ భగత్ సింగ్' వాయిదాలు పడి పడి ఆఖరికి ఈ నెలలో సెట్స్ మీదకు వెళ్ళింది. 


మైత్రీ సీఈవో చెర్రీకి మాతృవియోగం
ఒకవైపు ఐటీ రైడ్స్ జరుగుతున్న సమయంలో చెర్రీ మాతృమూర్తి మరణించారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఆయన ఇటీవల 'మీటర్' సినిమా నిర్మించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో సీఈవో ఆయన. 


మైత్రీ సంస్థ ఆర్థిక లావాదేవీలు, కార్యకలాపాల్లో చెర్రీ ముఖ్యమైన వ్యక్తి. ఆయనకు మాతృవియోగం కలగడం బాధాకరమని ఇండస్ట్రీలో పలువురు వ్యక్తులు అభిప్రాయ పడుతున్నారు.


సంక్రాంతి తర్వాత హిట్స్ లేవు!
'వాల్తేరు వీరయ్య', 'వీర సింహా రెడ్డి'తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ కూడా ఓపెన్ చేసింది. నిర్మాణ పరంగా, పంపిణీ పరంగా ఆ రెండు చిత్రాలు నిర్మాతలకు లాభాలు అందించాయి. అయితే, ఆ తర్వాత నుంచి విడుదల చేసిన సినిమాలు అన్నీ నష్టాలు తీసుకొచ్చాయి.


Also Read : రవితేజ & శర్వానంద్ - ఓ మల్టీస్టారర్, ఎక్స్‌క్లూజివ్ డీటెయిల్స్


కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన 'అమిగోస్' లాభాలు తీసుకు రాలేకపోయింది. కిరణ్ అబ్బవరం 'మీటర్' సినిమాను చెర్రీ నిర్మించగా... మైత్రీ సంస్థ సమర్పణలో విడుదల చేసింది. నష్టాల సంగతి పక్కన పెడితే, ఆ సినిమా కారణంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కిరణ్ అబ్బవరంతో మాస్ రొటీన్ సినిమా తీయడం ఏమిటని సోషల్ మీడియాలో కొంతమంది మైత్రీ సంస్థను తిట్టిపోశారు.


ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా దర్శకత్వం వహించిన 'కోనసీమ థగ్స్', కృష్ణవంశీ దర్శకత్వం వహించిన 'రంగమార్తాండ' సినిమాలను సైతం మైత్రీ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేసింది. విమర్శకుల ప్రశంసలు లభించినా, వాటికి వసూళ్లు రాలేదు. ఒక దెబ్బ తర్వాత మరొక దెబ్బ... సంక్రాంతి తర్వాత నుంచి మైత్రీ మూవీ మేకర్స్ వరుస దెబ్బలు తింటోందని, వాళ్ళ టైమ్ ఇప్పుడు అసలు బాలేదని ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుస. 


Also Read 'ప్రేమ విమానం'లో అనసూయ - ఇంకా సంగీత్ & శాన్వి