Bholaa Shankar: 'వాల్తేరు వీరయ్య' వంటి అద్భుతమైన బ్లాక్‌బస్టర్ తర్వాత, మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రం 'భోళా శంకర్‌'లో కనిపించనున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ అప్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఇప్పటికే కొన్ని షెడ్యూళ్లను కంప్లీట్ చేయగా.. తాజాగా డబ్బింగ్ పనులను ప్రారంభించినట్టు వెల్లడించారు.


హీరో అజిత్ నటించిన తమిళ సూపర్ హిట్ ఫిల్మ్ 'వేదాళం' చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతోన్న 'భోళా శంకర్' ఈ ఏడాది ఆగష్టు11న థియేటర్లలో విడుదల కానున్నట్టు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా నటిస్తోన్న ఈ సినిమాలో చిరుకి చెల్లెలిగా నటి కీర్తి సురేశ్ నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇదిలా ఉండగా మేకర్స్ తాజా అనౌన్స్ మెంట్ తో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ను ఇప్పటికే దాదాపు కంప్లీట్ చేసిన మూవీ యూనిట్.. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులను కూడా మొదలు పెట్టిందని తెలియడంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ అనౌన్స్ మెంట్ తో పాటు దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా మూవీ టీం సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. కాగా ఇప్పటి వరకూ అయిన షూటింగ్ మొత్తానికి ముందుగా డబ్బింగ్‌ను అతి త్వరలోనే పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నారని తెలిస్తోంది. దీన్ని బట్టి చూస్తే మేకర్స్ చెప్పిన ప్రకారం చెప్పిన డేట్ కే మూవీ రిలీజ్ కానున్నట్టు సమాచారం.


చిరు నటిస్తోన్న ఈ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌.. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి, షావర్ అలీ, వజ్ర & ఫైటర్స్‌తో భారీ ఇంటర్వెల్ సీక్వెన్స్‌ని చిత్రీకరిస్తున్నారు. ఈ ఏడాది జూన్ నెలాఖరుకు ‘భోళా శంకర్’ షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్టు సమాచారం. ఇక క్రేజీ కాంబోలో వస్తున్న 'భోళా శంకర్' మూవీలో చిరంజీవి ట్యాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నారు. హీరోయిన్ శ్రేయ ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. తమన్నా భాటియా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో అక్కినేని హీరో సుశాంత్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.






ఆల్మోస్ట్ నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన యాక్టింగ్ తో, స్టైల్ తో అభిమానులను కూడగట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పటివరకూ ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి, మెప్పించారు. ఈ మధ్య కాలంలో సినిమాల్లో కాస్త వేగం పెంచిన చిరంజీవి.. తన నెక్స్ట్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. ఆ కాన్సెప్ట్ తోనే సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఆడియెన్స్ ను మరింత ఆకట్టుకున్నారు. ఈ మూవీని అన్ని వర్గాల వాళ్లు ఆదరించడంతో..  భారీ స్పందన లభించింది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ముందుగా అనుకున్నట్టుగానే భారీ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా 'వాల్తేరు వీరయ్య' చిరంజీవి కెరీర్‌లోనే టాప్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిపోయింది.


Also Read 'సేవ్ ద టైగర్స్' రివ్యూ : భార్యల నుంచి భర్తలను కాపాడుకోక తప్పదా - సిరీస్ ఎలా ఉందంటే?