Meenakshi Chaudhary: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ‘గుంటూరు కారం’. ఈ సినిమాను అనౌన్స్ చేసి దాదాపు ఏడాదిపైనే అయింది. ఇప్పటికీ సినిమా షూటింగ్ పూర్తవలేదు. మధ్య మధ్య లో అనేక కారణాల వల్ల మూవీ లేట్ అవుతూ వస్తోంది. దానికి తోడు ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో కూడా సరైన క్లారిటీ రాకపోవడంతో మహేష్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో మూవీ తర్వాత అప్డేట్ ల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా నటి మీనాక్షి చౌదరి చేసిన వ్యాఖ్యలు మహేష్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ మూవీలో హీరోయిన్ గా మీనాక్షిని తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే దానిపై మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించలేదు. మీనాక్షి తాజా వ్యాఖ్యలతో ‘గుంటూరు కారం’ లో హీరోయిన్ గా మీనాక్షి ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. 


‘గుంటూరు కారం’ లో మీనాక్షి..


ఇటీవలే ‘గుంటూరు కారం’ కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం అయింది. మూవీలో ముందు అనుకున్న హీరోయిన్ పూజా హెగ్డే. అయితే ఆమె డేట్లు అడ్జెస్ట్ అవ్వని కారణంగా పూజాను తప్పించి మీనాక్షిను హీరోయిన్ గా ఎంపిక చేశారు మేకర్స్. అయితే ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించలేదు. కానీ, మీనాక్షి చౌదరి రీసెంట్ గా విజయ్ ఆంటోని ‘హత్య’ సినిమాలో నటించింది. ఈ సినిమా తెలుగులోనూ విడుదల కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మీనాక్షి యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ తాను ‘గుంటూరు కారం’ సినిమాలో నటిస్తున్నట్టు లీకులిచ్చింది. ఇది చూసిన మహేష్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


మహేష్ తో మొదటి రోజు షూటింగ్ మర్చిపోలేను: మీనాక్షి చౌదరి


ఇదే కార్యక్రమంలో ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పింది మీనాక్షి. ఈ సినిమాలో మహేష్ బాబుతో కలిసి పనిచేయడం చాలా గొప్పగా ఉందని చెప్పింది. తను మహేష్ బాబుకి పెద్ద అభిమానినని చెప్పింది. ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తయిందని,  షూటింగ్ లో మహేష్ బాబుతో మొదటి రోజు, మొదటి షాట్ మర్చిపోలేని అనుభూతి అని పేర్కొంది. త్రివిక్రమ్ మహేష్ లది హిట్ పెయిర్ అని ఈ సినిమా విషయంలో తాను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను అంటూ మూవీలో హీరోయిన్ పాత్రపై క్లారిటీ ఇచ్చేసింది మీనాక్షి. దీంతో మహేష్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక మహేష్-త్రివిక్రమ్ కాంబోలో ఇది మూడో సినిమా. అందుకే ప్రేక్షకులు ఈ మూవీ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్రివిక్రమ్ మార్క్ డైరెక్షన్ లో మూవీను స్టైలిష్ గా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.


Also Read: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'బ్రో' ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎప్పుడంటే?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial