కామన్ ప్రేక్షకుడికి సూపర్ స్టార్ మహేష్ బాబు ఏమాత్రం తక్కువ కాదు. తానొక స్టార్ అయినా సరే విడుదలైన ప్రతి సినిమా చూడటం ఆయనకు అలవాటు అని తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది చెబుతూ ఉంటారు. తనకు నచ్చిన సినిమా గురించి ట్వీట్ చేయడానికి సైతం ఆయన ఎప్పుడూ వెనుకాడరు. చిన్న పెద్ద అని తేడాలు లేకుండా నచ్చిన సినిమా గురించి చెబుతారు. ఇప్పుడు 'మారుతి నగర్ సుబ్రమణ్యం' సినిమా గురించి ట్వీట్ చేశారు.


హిలేరియస్... బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్!
విలక్షణ నటుడు రావు రమేష్ ప్రధాన పాత్రలో లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన సినిమా 'మారుతి నగర్ సుబ్రమణ్యం'. ఆగస్టు 23న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాను మహేష్ బాబు కాస్త ఆలస్యంగా చూశారు. అయితే... ట్వీట్ వేయడానికి మాత్రం ఆలస్యం చేయలేదు. సినిమా చూసిన వెంటనే సోషల్ మీడియాలో తన అభిప్రాయం వెల్లడించారు. 


''వాట్ ఏ హిలేరియస్ రైడ్ (మంచి వినోదాత్మక చిత్రమిది. ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాల్లో 'మారుతి నగర్ సుబ్రమణ్యం' ఒకటి. చిత్ర సమర్పకురాలు తబితా సుకుమార్, ఇంకా చిత్ర బృందం అందరికీ కంగ్రాట్స్'' అని మహేష్ బాబు పేర్కొన్నారు. ఆయనకు 'మారుతి నగర్ సుబ్రమణ్యం' టీమ్ థాంక్స్ చెప్పింది. మహేష్ ప్రశంసలతో మారుతి నగర్ జనాల్లో సంబరాలు మొదలు అయ్యాయి.


Also Read: బికినీలో పాయల్ రాజ్‌పుత్... థాయ్‌లాండ్‌లో వేడెక్కుతున్న వీధులు






ఏడు కొండల వేంకటేశ్వర స్వామి ఆశీర్వాదం!
'మారుతి నగర్ సుబ్రమణ్యం' సినిమా నచ్చి తన సమర్పణలో తబితా సుకుమార్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రావు రమేష్ సరసన సీనియర్ నటి ఇంద్రజ నటించగా... ఆయన కుమారుడిగా అంకిత్ కొయ్య, అతడు ప్రేమించే అమ్మాయిగా రమ్య పసుపులేటి కనిపించారు. ఇతర కీలక పాత్రల్లో అజయ్, అన్నపూర్ణమ్మ, శివన్నారాయణ, ప్రవీణ్ తదితరులు సందడి చేశారు. సినిమా విజయం సాధించడంతో శని, ఆదివారాల్లో ఏడు కొండల వెంకటేశ్వర స్వామి వారిని 'మారుతి నగర్ సుబ్రమణ్యం' చిత్ర బృందం దర్శించుకుంది. స్వామి ఆశీర్వాదం తీసుకుంది. సినిమాకు మంచి వసూళ్లు సైతం వచ్చాయి. ఫ్యామిలీ అంతా చూసి నవ్వుకునే సినిమా అని పేరు రావడంతో డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు. సినిమా విడుదలకు ముందు శాటిలైట్ రైట్స్ జీటీవీకి అమ్మేశారు.






Also Read: బిగ్ బాస్ 3లో సందడి చేసిన ఈ అందాల భామ ఎవరో గుర్తు పట్టారా?