'ఫిదా' సినిమాతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి గాయత్రీ గుప్తా. 'సీత ఆన్ ది రోడ్'లో బోల్డ్ యాక్టింగ్ చేశారు. ఇంకా పలు సినిమాలు చేశారు. ఇప్పుడు ఆమె ఓ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'భవానీ వార్డ్'. గణేష్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్, 'జబర్దస్త్' అప్పారావు, ఈశ్వర్ బాబు ధూళిపూడి ఇతర ప్రధాన తారాగణం. ఇదొక హారర్ థ్రిల్లర్ మూవీ. అవి క్రియేషన్స్, విభు ప్రొడక్షన్స్ సంస్థలపై కళ్యాణ్ చక్రవర్తి, చంద్రకాంత్ సోలంకి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జీడీ నరసింహా దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. 


చక్రాల కుర్చీలో చిన్నారి దెయ్యం... ఎందుకు భయం?
'భవానీ వార్డ్' ఫస్ట్ లుక్ చూస్తే... ఆస్పత్రి నేపథ్యంలో సినిమా తెరకెక్కించినట్లు అర్థం అవుతోంది. ఓ చిన్నారి వీల్ ఛైర్ (bhavani ward movie first look)లో కూర్చుని ఉంటుంది. ఆ వెనుక నీడలా మరో ఆకారం ఉంటుంది. పెద్ద దెయ్యం అనుకోవచ్చు. మరి, ఆ భవానీ వార్డులో ఏం జరింగింది? భయం ఎందుకు? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. ఏప్రిల్ నెలలో చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.


Also Read: బాయ్‌ ఫ్రెండ్ ఛీట్ చేస్తే బాధపడాలా? - ఆయుషికి త్రిగుణ్ చెప్పిన మాట బావుందమ్మా, మీరూ చూడండి


'భవానీ వార్డ్' చిత్ర దర్శకుడు నరసింహ మాట్లాడుతూ... ''నా కథ విని, ఒప్పుకుని నటించిన గాయత్రి గుప్తా గారికి థాంక్స్. మాకు ఆమె ఎంతో సహకరించారు. హీరో హీరోయిన్లు చక్కగా నటించారు. నటీనటుల సహకారంతో అనుకున్న విధంగా సినిమా బాగా తీశా. మా నిర్మాతలు కళ్యాణ్, చంద్రకాంత్ సహకారం ఎప్పటికీ మరువలేను. ప్రేక్షకులు అందరికీ నచ్చేలా సినిమా తీశా. హారర్ సినిమాలు కోరుకునే ప్రేక్షకులకు మరింత నచ్చుతుంది'' అని అన్నారు. ''చిన్న చిత్రాలకు మద్దతుగా నిలవాలనే ఉద్దేశంతో... నరసింహ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా నిర్మించా'' అని నిర్మాత కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. ''ఇక్కడ అందరూ నన్ను సీనియర్ అంటే కాస్త ఆనందంగా, కాస్త ఇబ్బందిగా ఉంది. దర్శకుడు నరసింహా చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. చిత్రీకరణలో ఆయన ఎంతో సరదాగా ఉండేవారు. సాంకేతికంగా సినిమా చాలా బావుంటుంది. మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు థాంక్స్'' అని గాయత్రీ గుప్తా చెప్పారు.


పీఆర్వో నుంచి మళ్ళీ నటుడిగా!
సినిమాలో కీలక పాత్ర చేసిన సాయి సతీష్ మాట్లాడుతూ... ''మా హీరో హీరోయిన్లతో పాటు సినిమాలో నటీనటులంతా అద్భుతంగా నటించారు. పీఆర్వోగా ఉన్న నన్ను మళ్లీ నటుడిగా మార్చిన చిత్రమిది. 'భవానీ వార్డ్'లో నాకు అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్. సినిమా పెద్ద హిట్ కావాలి'' అని అన్నారు. హీరో గణేష్ రెడ్డి, హీరోయిన్ పూజా కేంద్రే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Also Read'ఆపరేషన్ వాలెంటైన్' ఫస్ట్ రివ్యూ - సినిమా చూసిన ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ రియాక్షన్ ఏమిటంటే?


గణేష్ రెడ్డి, పూజా కేంద్రే, గాయత్రీ గుప్తా, సాయి సతీష్, 'జబర్దస్త్' అప్పారావు, మీసం సురేష్, విజయేష్, రాజేంద్ర, 'టిక్ టాక్' దుర్గా రావు తదితరులు నటించిన ఈ సినిమాకు ఛాయాగ్రహణం: అరవింద్ బి, కూర్పు: అంగ నరేష్, సంగీతం: సోల్మోన్ రాజ్, నేపథ్య సంగీతం: నిస్సి జస్టిన్,నిర్మాణ సంస్థలు:  అవి క్రియేషన్స్ - విభు ప్రొడక్షన్స్, నిర్మాత: కళ్యాణ్ చక్రవర్తి - చంద్రకాంత్ సోలంకి, దర్శకుడు: జీడీ నరసింహా.