Shyamala Devi Review on Tantra Trailer: అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి లీడ్‌ రోల్లో తెరకెక్కిన చిత్రం 'తంత్ర'. తాంత్రిక శాస్త్రం, హారర్ ఎలిమెంట్స్ కంటెంట్‌తో రూపొందిన ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ట్రైలర్‌ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ మధ్య టాలీవుడ్‌లో హారర్‌ చిత్రాలకు మంచి క్రేజ్‌ నెలకొంది. అందుకే డైరెక్టర్లు కూడా హారర్‌ చిత్రాలపై ఫోకస్‌ పెడుతూ సరికొత్త కంటెంట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో థియేటర్లో ఆడియన్స్‌ని భయపెట్టేందుకు సిద్ధమైంది 'తంత్ర' మూవీ. ఈ క్రమంలో రీసెంట్‌గా ట్రైలర్‌ రిలీజ్‌ అవ్వగా దానికి ఆడియన్స్‌ నుంచి భారీ రెస్పాన్స్ వస్తుంది. 'తంత్ర' ట్రైలర్‌ చూసినవాళ్లంతా చాలా భయంకరంగా ఉందంటున్నారు. చేతబడి, వశీకరణ లాంటి అంశాలతో సినిమా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఆద్యాంతం ఆసక్తిగా, కొత్తగా సాగింది తంత్ర ట్రైలర్‌.


ఈ ట్రైలర్‌ను దివంగత నటుడు, రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు సతీమణి, ప్రభాస్‌ పెద్దమ్మ శ్యామలా దేవి తాజాగా ట్రైలర్‌ను వీక్షించారు. హీరోయిన్‌ అనన్య నాగళ్లతో కలిసి ట్రైలర్‌ చూసిన ఆమె సర్‌ప్రైజ్‌ అయ్యారు. ట్రైలర్‌ చాలా బాగుందని, మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటూ 'తంత్ర' మూవీ టీంకు ఆమె ఆల్‌ ద బెస్ట్‌ చెప్పారు. ఆ తర్వాత అనన్యను స్పెషల్‌గా విష్‌ చేశారు. తంత్రలో తన నటన చాలా బాగుందని, ఇలాగే మరిన్ని సినిమాలు చేస్తూ సక్సెస్‌ ఫుల్‌ నటిగా ఎదగాలన్నారు. ఇలాగే సినిమాలు చేస్తూ వెళ్లమని,  ఏదోక రోజు తప్పకుండ స్టార్‌ నటి స్థాయికి చేరుకుంటావంటూ శ్యామలా దేవి అనన్యతో మాట్లాడారు. ఈ వీడియోను తంత్ర టీం తమ ఆఫీషియల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్‌ చేశారు. కాగా శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై నరేష్ బాబు, రవి చైతన్య నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 15న థియేటర్లోకి రాబోతుంది. 




ఇక ట్రైలర్‌ విషయానికి వస్తే


ధనుష్‌ రఘుముద్రి-అనన్య నాగళ్ల హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో టెంపర్‌ వంశీ తాంత్రికుడి పాత్రలో కనిపంచబోతున్నాడు. ఇతర కీలక పాత్రలో మీసాల లక్ష్మణ్ ఇతర నటీనటులు అలరించనున్నారు.బాత్రూమ్‌లో తనకు మాత్రమే కనిపించే ఒక దెయ్యాన్ని చూసి అనన్య భయపడడంతో ‘తంత్ర’ ట్రైలర్ మొదలవుతుంది. చాలాకాలం తర్వాత వెండితెరపై రీఎంట్రీ ఇస్తున్న సలోని.. ఈ సినిమాలో ఒక తాంత్రికురాలి పాత్ర పోషించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ట్రైలర్ చివర్లో ‘‘అప్పట్లో ఒక తెలుగు ముఖ్యమంత్రి కూడా ఈ తాంత్రిక సాధన చేశారని బాగా పుకార్లు వచ్చాయి’’ అనే డైలాగ్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. 


భర్త బాటలోనే శ్యామలా దేవి పొలిటికల్‌ ఎంట్రీ?


దివంగత నటుడు, మాజీ ఎంపీ కృష్ణంరాజు సినీ నటుడిగానే కాదు రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉండేవారు. బీజేపీ  ఎంపీగా రెబల్ స్టార్ సేవలు అందించారు. దీంతో, ఆయన చనిపోయిన తర్వాత ఆయన రాజకీయ వారసత్వాన్ని ఆయన భార్య శ్యామలాదేవి కొనసాగిస్తారని చాలాకాలంగా ప్రచారం జరుగుతుంది. అదే సమయంలో ఆమె భర్త పేరుపై మొగల్తూరులో హెల్త్‌ క్యాంప్‌, అన్నదాన కార్యక్రమాలు చేపట్టడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది. అయితే ఇప్పటికే శ్యామలా దేవి దీనిపై స్పందించకపోవడం గమనార్హం. త్వరలోనే ఆమె తన రాజకీయ ఎంట్రీపై త్వరలోనే క్లారిటీ ఇస్తానని మొగల్తూరులో నిర్వహించిన హెల్త్‌ క్యాంప్‌లో ఆమె పేర్కొన్నారు.